బోత్ ఆర్ నాట్ సేమ్.. మంత్రి నారాయణ

Publish Date:Jan 12, 2026

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాలు సమానం కాదనీ, వెటికవి డిఫరెంట్ అని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. వైసీపీ తరచుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను, వాటికి అయిన వ్యయాన్నీ పోలుస్తూ చంద్రబాబు సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు, జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.  అమరావతి సచివాలయం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామనీ, ఇది ముఖ్యమంత్రి కార్యాలయం సహా, ఇందులో మంత్రులు, కార్య దర్శులు, అన్ని శాఖాధిపతుల కార్యాలయాలు ఉంటాయనీ,  మొత్తం పాలనాయంత్రాంగాన్ని ఒకే గూటి కిందకు తెస్తున్నామన్నారు. అదే తెలంగాణ సచివాలయంలో అయితే ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శుల కార్యాలయాలు మాత్రమే ఉంటాయనీ, శాఖాధిపతులు, సిబ్బంది కార్యాల యాలు వేరే చోటనుంచి పని చేస్తాయన్నారు.  అయితే అమరావతి సచివాలయం అయితే కార్పొరేషన్లు, వాటి శాఖలతో సహితంగా ఇక్కడే ఉంటా యన్నారు.   పాలనా సౌలభ్యం లక్ష్యంగా అమరావతి సచివాలయ నిర్మాణం ఉంటుందన్నారు. ఇది పాలనను ప్రజలకు చేరువ చేస్తుందన్నారు. ఇవేమీ అవగాహన లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అజ్ణానంతో, అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ముందుగా అమరావతి ప్రాజెక్టును పూర్తిగా అవగాహన చేసుకుని ఆ తరువాత మాట్లాడాలని సజ్జలకు సూచించారు.  ప్రపంచంలోని ఐదు టాప్ నగరాలలో ఒకటిగా అమరావతి అభివృద్ధి చేస్తున్నామన్న నారాయణ ఇక్కడ డ్రైనేజి వ్యవస్థలు, తాగునీటి పైప్ లైన్ లు, విద్యుత్ లైన్లు, టెలిఫోన్ కేబుల్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్నామన్నారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అన్న స్పష్టమైన విజన్ తో ముందుకు సాగుతున్నదన్నారు. రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్ ఏమిటని ఆయన నిలదీశారు. ప్రతిపక్ష నేతగా అమరావతిని రాజధానిగా అసెంబ్లీ సాక్షిగా ఆమోదించిన జగన్ మోహన్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టగానే మూడు రాజధానులంటూ మూడుముక్కలాట మెదలెట్టారని విమర్శించారు.  రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు కావాలని జగన్ అన్నారని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి రాగానే మూడు రాజధానులంటూ ఆయన చేసిన విన్యాసాల వల్ల అమరావతిని భూములిచ్చిన రైతులు ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తు చేశారు.  ప్రస్తుతం అమరావతి రాజధాని అభివృద్ధి పట్ల రైతులు, మహిళలూ ఆనందంగా ఉన్నారని మంత్రి నారాయణ చెప్పారు. ఇక అమరావతిని ఆపడం ఎవరి తరమూ కాదని నారాయణ స్పష్టం చేశారు.  

తెలంగాణ మునిసిపోల్స్.. జనసేన, బీజేపీ ఎవరిదారి వారిదే!

Publish Date:Jan 11, 2026

తెలంగాణ  మునిసిపల్ ఎన్నికలకు ముందు కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ఫిబ్రవరిలో తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయిన ఎన్డీయేతో తెలంగాణ ఎన్నికలలో పొత్త ప్రశక్తే లేదని తెలంగాణ బీజేపీ ప్రకటించడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.    సహజంగానే జనసేన తెలంగాణ మునిసిపల్ ఎన్నికలలో పోటీ అనగానే బీజేపీతో పొత్తు ఉంటుందని అంతా భావించారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన బిజెపి, టిడిపిలతో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో సహజంగానే తెలంగాణలో కూడా అదే కూటమి కొనసాగుతుందని అంతా భావించారు. అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రానున్న మునిసిపోల్స్ లో జనసేనతో తమ పార్టీకి ఎటువంటి పొత్తూ లేదంటూ ప్రకటించడం రాజకీయంగా కలకలం సృష్టించింది. బీజేపీ తెలంగాణ మునిసిపోల్స్ లో స్వతంత్రంగా  పోటీ చేస్తుందని, జనసేన సహా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవనీ కుండబద్దలు కొట్టేశారు. రామచంద్రరావు ప్రకటనకు కొద్ది సేపు ముందే జనసేన తెలంగాణ మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాజకీయవర్గాలలో  పొత్తులపై పెద్ద ఎత్తున చర్చకు తెరలేచింది. అయితే ఎన్డీఏ తరహా కూటమి కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితమనీ, ఇది తెలంగాణలో కొనసాగే అవకాశం లేదనీ రామచంద్రరావు ప్రకటనతో తేటతెల్లమైంది.  ఇందుకు ప్రధాన కారణం.. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్యా రాజకీయ వేడి రగులుస్తున్న జలవివాదాలేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ జలవివాదాల కారణంగానే.. ఆంధ్రప్రదేశ్‌లో   సన్నిహిత సమన్వయం ఉన్నప్పటికీ,  తెలంగాణలో పార్టీల మధ్య పొత్తుకు అవకాశం లేని పరిస్థితి నెలకొందని అంటున్నారు.  ఆ కారణంగానే తెలంగాణలో  బీజేపీ, జనసేన పార్టీలు మునిసిపల్ ఎన్నికలలో ప్రత్యర్థులుగా రంగంలోకి దిగాల్సిన అనివార్యత ఏర్పడిందని అంటున్నారు.  

మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Publish Date:Aug 28, 2025

  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు. కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.  . రాష్ట్రీయ స్వయం సేవక్‌  సంఘ్‌ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్‌ భగవత్‌..  బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్‌ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం  .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.  నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్‌ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకుంటుందని  ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.  

మనిషికి, డబ్బుకు మధ్య సంబంధం!

Publish Date:Jan 12, 2026

“మనం డబ్బును సంపాదిస్తాం కానీ, డబ్బు మనల్ని సంపాదించడం లేదు కదా?” అని డాంబికంగా పలికేవారున్నారు. అనడానికైతే ఇలా అన్నప్పటికీ వారి జీవితమంతా డబ్బుకు దాస్యం చేస్తూనే వుంటారు. ఆ డబ్బుకై ఎవరినైనా ఆశ్రయిస్తారు. ఎంతైనా వేడుకుంటారు. లేనితనం వల్ల వీరిలా తయారైనారా అంటే అది నిజం కాదు, కేవలం ధనం మీద ఆపేక్షే వీరినిస్థితికి తెచ్చింది. అసలీ జీవితాన్ని ధనార్జనకు కాక మరొకందుకు వినియోగించే వీలుందనే ఆలోచన కలగదు. మతాన్ని ఆశ్రయించామని, దైవారాధనకు అంకితమయామని ప్రకటించే వారిలో కూడా చాలా మందికి ధనమే దైవం వారు తలపెట్టే “మహత్కార్యా” లన్నిటికీ ధనం పోగుచేస్తుంటారు. ఎక్కడో వందలాది ఎకరాల స్థలం కొంటామంటారు. అక్కడ అనేకమందిని చేర్చి ఏదో విశ్వమానవ కల్యాణం సాధిస్తామంటారు. మిగతా రంగాల్లో పనిచేసేవారు కూడా ఇలాంటి "లోక కళ్యాణ” పథకాలే రూపొందిస్తుంటారు. సినిమాలు తీసేవారు, సినిమాహాళ్ళు కట్టించేవారు. హోటళ్ళు నెలకొల్పేవారూ, మార్కెట్లోకి కొత్తపత్రికలు వెలువరించేవారూ, మార్కెట్లోకి కొత్త సబ్బు, విశిష్టమైన సూటింగ్ క్లాత్, చల్లటి కూల్డ్రింకు ప్రవేశ పెట్టేవారూ, అందరూ కూడా ప్రజాక్షేమం కాంక్షించే ఈ పనులు చేస్తున్నామంటారు. కానీ అందరికీ కావలసింది డబ్బే. కానీ డబ్బు అక్కరలేనివారు అరుదుగా ఎక్కడైనా కనిపించవచ్చు. అలాంటివారు కోర్కెల్నీ, సంకల్పాలనూ దాటి వుంటారు. నీమ్ కరోలి బాబా అలాంటి యోగి. ఆయన ఇటు ఇహంలోను, అటు పరంలోనూ ఏక కాలమందు నివసించినట్లు ఉండేవాడని అంటారు స్వామీ రామా. బాబా ఎవరి పరిచయమూ కోరేవాడు కాదు. ఎవరైనా తన దర్శనార్థమై వస్తే, “నేను మిమ్మల్ని చూడడమైనది. మీరు నన్ను చూడడమైనది. ఇక వెళ్ళిరండి" అనేయడం ఆయనకు అలవాటు. నైనిటాల్లో ఒకసారి బాబాతో కూచోనుండగా, భారతదేశంలోని అత్యంత ధనికుల్లో ఒకరైన ఒక వ్యక్తి కరెన్సీ కట్టలతో బాబా వద్దకు వచ్చారని అంటాడు స్వామీ రామా. " ఈ ధనమంతా మీకు సమర్పించడానికి తెచ్చానండీ" అన్నాడు ఆ ధనికుడు.  బాబా ఆ నోట్లకట్టలను కిందపరిచి చక్కగా వాటి మీద ఆసీనుడయ్యాడు. "కూర్చుకునేందుకు అంత మెత్తగా లేవు. వీటికన్నా దిండు నయం. నాకు చలిమంట వేసుకునే అలవాటు లేదు, పోనీ అందుకైనా ఉపయోగిద్దామంటే వీటినేమి చేయను?" అని అడిగాడు బాబా. "అయ్యా ఇది ధనమండీ" అన్నాడు అతడు.  బాబా ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తూ "దీనితో కాసిని పళ్ళు కొనుక్కురండి. అందరం తినచ్చు" అన్నాడు. "ఈ ప్రాంతంలో మార్కెట్ లేదు గదండీ?” అన్నాడు అతడు. "ఐతే మరి ఇది డబ్బెలా అవుతుందయ్యా. పండ్లు కూడా కొనలేని దీనిని నేనేమి చేసుకోను" అని, కాసేపు ఆగి "ఏమి కావాలని నావద్దకొచ్చావు" అన్నారు.  "నాకు విపరీతమైన తలనొప్పి, భరించలేని బాధ" అని చెప్పాడు అతడు "అది నువ్వు సృష్టించుకున్నదే, నేనేమి చేయగలను." అన్నారు బాబా.  "అలా అంటే ఎలా మహాత్మా? మీరు నాకు సాయపడాలి.” అని వేడుకున్నాడు అతను. అప్పుడు బాబా, “పోనీ పాపం” అనుకున్నట్లున్నారు.. “సరే ఇకనుండి నీకు తలనొప్పి ఉండదు పో, కానీ ఇవాళ నుండి నీవు ఇతరులకు పెద్ద తలనొప్పిగా రూపొందుతావు. నీ దగ్గర వెర్రి డబ్బు పోగవుతుంది. తద్వారా నీవు సమాజానికి గొప్ప శిరోవేదన కలిగిస్తావు, ఇక వెళ్ళు" అని పంపించేశాడు నీమ్ కరోలి బాబా. ఆయన చెప్పినట్లే, ఆ ధనికుడు ఆరోగ్యవంతుడై, తన జీవన విధానంతో సంఘానికి గొప్ప “శిరోభారం" గా పరిణమించాడు.                                             ◆నిశ్శబ్ద.
[

Health

]

చలికాలంలో నువ్వులు, అవిసె గింజలు తింటున్నారా? ఈ నిజాలు తెలుసుకోకుంటే నష్టపోతారు..!

Publish Date:Jan 12, 2026

మన శరీర ఉష్ణోగ్రత ప్రతి సీజన్‌లో నార్మల్ గా ఉంటుంది.  దాదాపు 37-38 డిగ్రీల సెల్సియస్  వరకు శరీర ఉష్టోగ్రత ఉంటుంది. అయితే చలికాలంలో బయటి ఉష్ణోగ్రత 5, 10, 15, లేదా 18 డిగ్రీల సెల్సియస్‌ గా నమోదు అవుతూ ఉంటుంది. ఇలాంటి  పరిస్థితిలో  శరీరం వెచ్చగా ఉండటానికి చాలా కష్టపడుతుంది. సరైన ఆహారం,  ఆరోగ్యకరమైన జీవనశైలి లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.చాలామంది చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి నువ్వులు, అవిసె గింజలు తినడానికి ఆసక్తి చూపుతారు. చాలామంది వీటిని లడ్డులుగా చేసుకుని తింటుంటారు.  ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యం,  పోషకాలతో మెరుగ్గా ఉంటాయి.  ఆరోగ్యకరమైన ఆహారాలుగా కూడా పరిగణింపబడతాయి. అయితే ఈ లడ్డులను తయారు చేసుకుని తినేవారు ఖచ్చితంగా కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలని అంటున్నారు ఆహార నిపుణులు.  నువ్వులు, అవిసె గింజలు లాంటి పదార్థాలను తీసుకునే ముందు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి.  లేకపోతే చాలా నష్టం చూడాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే.. శీతాకాలంలో ఆరోగ్యకరమైన లడ్డులు తినడం ఒక ట్రెండ్. కానీ చాలామంది మొదట రుచికి, తరువాత ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే లడ్డులు తయారుచేసినప్పుడల్లా రుచి  కంటే  ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసమే వాటిని తింటున్నామని గుర్తుంచుకోవాలి. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. చలికాలంలో నువ్వులు,  అవిసె గిండలతో  చేసిన లడ్డులు రోజుకు ఒక చిన్న లడ్డూ సరిపోతుంది. దీని కంటే ఎక్కువ అవసరం లేదు. ఉదయం అల్పాహారం తర్వాత లేదా మధ్యాహ్నం సమయంలో  తినడం మంచిది.  సాయంత్రం స్నాక్‌గా కూడా ఆస్వాదించవచ్చు. రాత్రిపూట వీటిని తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రాత్రిపూట వాటిని తినకుండా ఉండటం మంచిది. ఒకే రకమైన లడ్డూ తినడం కంటే.. 3-4 రకాల లడ్డూలను తయారు చేసి, ఒక్కొక్క సారి ఒక్కొక్కటి తినడం మంచిది.   ఇవి ఆరోగ్యకరమైనవి. చాలామంది అన్ని రకాల  విత్తనాలు కలిపి లడ్డులు చేస్తుంటారు. ఇది మంచిది కాదు. ఈ లడ్డులను  తీసుకునేటప్పుడు పాలు తాగాల్సిన అవసరం లేదు. లడ్డులు  సులభంగా జీర్ణమైతేనే తీసుకోవాలి. వాటిని తిన్నప్పుడు జీర్ణసంబంధ సమస్యలు వచ్చినా,  గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు వచ్చినా వాటిని తీసుకోకపోవడం మేలు. పిల్లలు,  వృద్ధులు నువ్వులు, అవిసె గింజలతో చేసిన  లడ్డులను తినకూడదు. ఎందుకంటే వారిలో   జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు ఈ రకమైన లడ్డులు   తినకూడదు. ఈ తప్పులు చేయకూడదు.. లడ్డులను కట్టడానికి పెద్ద మొత్తంలో నెయ్యిని ఉపయోగిస్తారు. దీని వల్ల వాటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. చక్కెరకు బదులుగా బెల్లం వాడటం వల్ల లడ్డు ఆరోగ్యంగా మారుతుంది, కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా దీనిని తినవచ్చనుకుంటారు. కానీ  చక్కెర స్థాయి అదుపులో లేనప్పుడు ఈ లడ్డులను తినడం మంచిది కాదు. తీవ్రమైన కాలేయం,  మూత్రపిండాల రోగులు ఈ లడ్డులను  వైద్యులు  లేదా డైటీషియన్‌ను సంప్రదించకుండానే తీసుకోకూడదు. ఈ లడ్డులను స్నాక్స్ గా చిరుతిండిగా తీసుకుంటారు. కానీ వీటిని స్నాక్స్ పేరుతో ఎక్కువ తినడం కంటే ఇవి శరీరానికి ఒక మంచి మెడిసిన్ అనుకుని తీసుకుంటే మంచిది. లడ్డులను ఇంట్లోనే తయారు చేసుకుని తినడం మంచిది. బయటి లడ్డుల తయారీలో కల్తీ పదార్ధాలు వాడే అవకాశం ఎక్కువ. ఇంట్లో ఈ లడ్డులు తయారు చేసేటప్పుడు పాలను కలపడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కాబట్టి పాలను వాడకపోవడం మంచిది.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...