రఘురామపై పోలీసుల నిఘా! గుంటూరు అర్బన్ ఎస్పీకి కోర్టు ధిక్కార నోటీసులు..
posted on May 24, 2021 @ 8:55PM
రాజద్రోహం కేసులో ఏపీ సీఐడీ అరెస్టు చేసిన నర్సాపురం ఎంపీ రఘురామ రాజుకు సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. ప్రస్తుతం ఆర్మీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న రఘురామ ఇంకా విడుదల కాలేదు. డిశ్చార్జ్ సమ్మరీ సిద్ధం కాకపోవడంతో ఆయన విడుదల ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే రఘురామకు బెయిల్ వచ్చినా ఆయనపై జగన్ సర్కార్ నిఘా పెట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. రఘురామ ఆర్మీ హాస్పిటల్ నుంచి విడుదల కాగానే ఏపీకి తీసుకువచ్చేందుకు ఏపీ పోలీసులు స్కెచ్ వేశారని చెబుతున్నారు. ఏపీకి చెందిన కొందరు పోలీసులు సికింద్రాబాద్ ఆస్పత్రి దగ్గరే ఉన్నట్లు తెలుస్తోంది.
ఎంపీ రఘురామ రాజు ఇదే విషయాన్ని తెలుపుతూ సికిింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి కమాండర్కు లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఏపీకి చెందిన కొందరు పోలీసులు ఆస్పత్రి దగ్గర ఉన్నట్లు తెలుస్తోందని లేఖలో రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్ వాడుతున్నానని, తన కాలి నొప్పి ఇంకా తగ్గలేదని తెలిపారు. బీపీలో కూడా హెచ్చుదల కనిపిస్తోందని చెప్పారు. నోరు కూడా తరచుగా పొడారిపోతోందని లేఖలో రఘురామ వెల్లడించారు. రెండు, మూడు రోజులు ఆస్పత్రిలోనే.. డాక్టర్ల పర్యవేక్షణలో తనకు చికిత్స అందించాలన్నారు. అయినా మీరు డిశ్చార్జ్ చేయాలనుకుంటే.. డిశ్చార్జ్ సమ్మరీలో తన ఆరోగ్య పరిస్థితిని స్పష్టంగా తెలియజేయాలని కోరారు ఎంపీ రఘురామ రాజు.
మరోవైపు గుంటూరు అర్బన్ ఎస్పీకి ఎంపీ రఘురామకృష్ణరాజు న్యాయవాది దుర్గాప్రసాద్ కోర్టు ధిక్కార నోటీసులు పంపారు. రఘురామ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే తీసుకురావాలని, ఎస్కార్ట్ను ఆదేశించినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రఘురామ బెయిల్పై విడుదలైనట్లే.. విడుదలైన 10 రోజులకు బాండ్లను కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని న్యాయవాది దుర్గాప్రసాద్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రఘురామను తీసుకురావాలని, ఎస్కార్ట్ను పంపడం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లేనని ఆయన తెలిపారు. అందుకే నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి గుంటూరు అర్బన్ ఎస్పీకి దుర్గాప్రసాద్ నోటీసులు పంపారు
ఇటీవల రఘురామకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరైంది. అయితే ఆయన విడుదలలో జాప్యం జరుగుతోంది. మరో నాలుగు రోజుల వరకు వేచి ఉండక తప్పదని రఘురామ తరఫు న్యాయవాది లక్ష్మీనారాయణ అన్నారు. కోర్టు ఆదేశాలతో ష్యూరిటీస్ పిటిషన్ ట్రయల్ కోర్టులో వేశామన్నారు. డిశ్చార్జ్ సమ్మరి కావాలని న్యాయమూర్తి అడిగారని, అయితే రఘురామ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి నాలుగు రోజులు సమయం పడుతుందన్నారు. నాలుగురోజుల తర్వాత మరోసారి సీఐడీ కోర్టులో ష్యూరిటీ పిటిషన్ వేస్తామని చెప్పారు. అప్పటి వరకు బెయిల్పై విడుదల వీలుకాదని లక్ష్మీనారాయణ అన్నారు.