ప్రత్యేక హోదా, రైల్వే  జోన్  కోసం పోరాడండి.. తనపై ఘజనీ దందయాత్రలు వద్దన్న రఘురామ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జ‌గ‌న్‌కు నర్సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు న‌వ సూచ‌న‌ల పేరుతో వ‌రుస‌గా నాలుగో లేఖ రాశారు. త‌న‌పై లోక్‌స‌భ‌లో అన‌ర్హ‌త వేటు వేయించేందుకు గ‌జ‌నీ దండ‌యాత్ర‌ల వంటివి చేస్తున్నారంటూ లేఖలో ఆయ‌న ఎద్దేవా చేశారు. అన‌ర్హ‌త వేటు వేయాల‌ని ఇప్ప‌టికే లోక్‌స‌భ స్పీక‌ర్‌కు వైసీపీ ఎంపీలు ఏడుసార్లు విజ్ఞ‌ప్తులు చేశార‌ని చెప్పారు. యదా రాజా తదా మంత్రి అన్న‌ట్లు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి జ‌గ‌న్ అడుగుజాడ‌ల్లోనే న‌డుస్తున్నారంటూ చుర‌క‌లంటించారు. ర‌ఘురామ‌పై చ‌ర్య‌లు తీసుకోక‌పోతే పార్ల‌మెంటును స్తంభింప‌జేస్తామంటూ విజ‌య‌సాయిరెడ్డి ఏకంగా హెచ్చ‌రిక‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. అంత శ‌క్తే గ‌నుక వైసీపీకి ఉంటే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా, రైల్వే జోన్‌, పోల‌వరానికి నిధుల కోసం పోరాడాల‌ని ఎంపీ రఘురాం చించారు.ప్రజా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్న త‌నపై అనర్హత వేటు వేయించాలని పదే పదే ప్రయత్నించే బదులు రాష్ట్రానికి సంబంధించిన హక్కుల కోసం పోరాడేలా పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయాల‌న్నారు. వైసీపీ నేత‌లు ఎందుకు పోరాడ‌డం లేద‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నార‌ని రఘురామ అన్నారు. 

ఏపీ సీఎం జగన్ కు ఎంపీ రఘురామ రాజు రాసిన లేఖ ఉన్నది ఉన్నట్లుగా ఇది..

జులై 11, 2021
శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,
ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
విషయం: నాపై అనర్హత వేటు వేసేందుకు మీరు చేస్తున్న ‘‘ఘజనీ దండయాత్రలు’’ (విశ్వప్రయత్నం)
సూచిక: నవ సూచనలు (విధేయతతో) లేఖ 4

ముఖ్యమంత్రి గారూ,

మీరు నా పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయించడానికి విఫలయత్నాలు చాలా చేస్తున్నారనేది జగద్విదితం. నాకు గుర్తు ఉన్నంత వరకూ మీరు ఇప్పటికి ఏడు సార్లు నాపై అనర్హత వేటు వేయాలంటూ గౌరవ లోక్ సభ స్పీకర్ కు వివిధ సందర్భాలలో వినతి పత్రాలు సమర్పించారు.నిజానిజాలు ఎంతో స్పష్టంగా కనిపిస్తున్నా, ఈ అంశానికి సంబంధించి తాము చేయాల్సింది చేస్తామని చెప్పినప్పటికీ కూడా రాజ్యసభ సభ్యుడు, మీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గౌరవ చట్ట సభల చైర్ లను దూషించడాన్ని మీరు ఇప్పటికే గమనించి ఉంటారు. ‘‘యధా రాజా తధా మంత్రి’’ అన్నట్లు, విజయసాయి రెడ్డి కచ్చితంగా మీ అడుగుజాడల్లోనే నడుస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. మీరు గౌరవ న్యాయస్థానాలపైనా, గౌరవనీయులైన న్యాయమూర్తులపైనా తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేసినట్లుగానే అత్యున్నతమైన, గౌరవప్రదమైన వ్యవస్థలపైన విజయసాయి రెడ్డి పలు దఫాలుగా వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు.

తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాబోయే పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తాం అని ఆయన లోక్ సభ స్పీకర్ ను నేరుగా హెచ్చరించే సాహసానికి కూడా ఒడిగట్టారు. గౌరవనీయులైన లోక్ సభ స్పీకర్ ను ఉద్దేశించి ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసినందుకు నేను ఆయనపై ఇప్పటికే సభాహక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చాను కూడా. మీ బృందం చేస్తున్న ఈ చర్యలను పత్రికలలో చదివిన తర్వాత సాధారణ ప్రజలు సైతం ప్రజాసమస్యల పట్ల మీకు ఏ మాత్రమైనా చిత్తశుద్ధి ఉన్నదా? అని ప్రశ్నిస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రజలు అడుగుతున్న ఒక ప్రశ్నను మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. అదేమిటంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి మీ బృందం, ఎందుకు సభలను స్థంభింప చేయడం లేదు? మీరు స్పెషల్ క్యాటగిరి స్టేటస్ పై చెప్పిన మాటలు నమ్మిన ప్రజలు మన పార్టీకి అనూహ్యమైన మెజారిటీని కట్టబెట్టారు. ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నది ఏమిటంటే ఒక సహచర ఎంపిపై అనర్హత వేటు వేయించేందుకు పార్లమెంటును స్థంభింప చేసే శక్తి ఉంటే అదే శక్తిని మన రాష్ట్రానికి ప్రత్యేక క్యాటగిరి స్టేటస్ తెప్పించేందుకు ఎందుకు ఉపయోగించడం లేదని ప్రశ్నిస్తున్నారు. స్పెషల్ స్టేటస్ కోసం పార్లమెంటును స్తంభింప చేయవచ్చు కదా అని వారు అడుగుతున్నారు.

ఒక పార్లమెంటు సభ్యుడిపై అనర్హత వేటు వేయమని ఇన్ని లేఖలు రాస్తున్నారే పోలవరం ప్రాజెక్టుకు నిధులు తీసుకురావడానికి, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఎందుకు లేఖలు రాయడం లేదని కూడా ప్రజలు పరిపరి విధాలుగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా రాయలసీమకు ఎక్కువ నీటిని అందించి రాయలసీమ భూములను సస్యశ్యామలం చేసే అవకాశం ఉంది కదా అని ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు.

ఒక ఎంపిని అనర్హుడిగా చేయాలని ఇంతగా ప్రయత్నిస్తున్న సాటి ఎంపిలు పార్లమెంటును కూడా స్తంభింప చేస్తామంటున్నారే మరి గత రెండు సంవత్సరాలుగా విశాఖపట్నం రైల్వే జోన్ వ్యవహారం ముందుకు సాగకుండా ఆగిపోయినప్పుడు పార్లమెంటును ఎందుకు స్తంభింపచేయలేదని ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇంతే తీవ్రమైన ప్రయత్నాలు చేసి విశాఖ రైల్వే జోన్ ను సాధించవచ్చు కదా అని ప్రజలు అనుకుంటున్నారు.

ఇంత శ్రద్ధతో రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలుకు కృషి చేసి ఉంటే మీతో కలిసి నడవడానికి, మీకు సంపూర్ణంగా సహకరించడానికి నేను ముందు వరుసలో ఉండేవాడిని. నేను పైన చెప్పిన మూడు విషయాలపై పార్లమెంటును స్తంభింప చేసి ఆ తర్వాత నన్ను అనర్హుడిగా ప్రకటించేందుకు పార్లమెంటును స్తంభింప చేయండి. అలా కాకుండా ఇదే వైఖరి మీరు కొనసాగిస్తే ప్రజలు మీపై తిరుగుబాటు చేసేందుకు ఎంతో ఎక్కువ సమయం పట్టదు. ఒక ఎంపిని అనర్హుడిగా ప్రకటించే అధికారాన్ని లోక్ సభ స్పీకర్ నుంచి తీసేసి పార్టీ అధ్యక్షుడికే ఇవ్వాలనే మీ తలంపును అమలులోకి తెచ్చుకోవాలంటే పార్లమెంటు ఉభయ సభల్లో మూడు వంతుల మెజారిటీతో రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది.
 
అది మీకున్న 22 మంది లోక్ సభ సభ్యులు, ఆరుగురు రాజ్యసభ సభ్యులతో సాధ్యం కాదు.మీకు మరో అదనపు సమాచారాన్ని కూడా నేను ఈ సందర్భంగా ఇవ్వాలనుకుంటున్నాను. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తో కూడిన త్రిసభ ధర్మాసనం ఏం చెప్పిందంటే, పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుల విషయంలో కోర్టులు ఏ మాత్రం జోక్యం చేసుకోలేవు. ఫిరాయింపుల ఫిర్యాదుల పరిష్కారంపై కాలపరిమితిని నిర్ణయించడం కూడా కోర్టుల పరిధిలోకి రాదు. ఇది పూర్తిగా రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లు, లోక్ సభ స్పీకర్ విచక్షణపై మాత్రమే ఆధారపడి ఉంటుంది అని ఎంతో స్పష్టంగా సుప్రీంకోర్టు తెలిపిన విషయాన్ని మీకు మరొక్కమారు గుర్తు చేస్తున్నాను.

మీరు ఈ విషయాన్ని విజయసాయి రెడ్డికి అర్ధం అయ్యేలా చెప్పాలని కోరుతున్నాను. ఎందుకంటే ఆయన మీడియా సమావేశాలలో ఏవేవో విషయాలు మాట్లాడుతున్నారు. స్పీకర్, నిర్ణీత కాల వ్యవధి అంటూ అస్పష్టమైన ప్రకటనలు చేసుకుంటూ, నా అనర్హత ఏదోఒక విధంగా జరగాలని ఆయన ఎంతో ఆశగా కోరుకుంటున్నారు. 2020 సంవత్సరంలో రాజస్థాన్ లో జరిగిన మరో విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా వివరంగా చెప్పాలని అనుకుంటున్నాను.

మొత్తం 20 మంది ఎమ్మెల్యేలను అక్కడి అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. దీనిపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. దాంతో ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పుపై రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ తీర్పు చెబుతూ… నిరసన తెలియచేయడానికి, పార్టీ ఫిరాయించడానికి తేడా తెలుసుకోవాల్సిందిగా కోరుతూ స్టే ఎత్తేయడానికి నిరాకరించింది. దాంతో స్పీకర్ తన పిటిషన్ ను ఉప సంహరించుకున్నారు. చివరికి వారిపై అనర్హత వేటు పడలేదు. ఈ మొత్తం కేసులో కీలకమైన అంశం ఏమిటంటే నిరసన తెలియచేయడానికి, పార్టీ ఫిరాయించడానికి తేడాను తెలుసుకోవాలి అని చెప్పడం.

మీరు నాకు జారీ చేసిన నోటీసులలోనూ, లోక్ సభ స్పీకర్ కు నాపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్ లోనూ మీరు చెప్పిన సాకులు పరిశీలిస్తే నాకు అర్ధమైనదేమిటంటే నేను మాతృభాష లోనే ప్రాధమిక విద్యాబోధన ఉండాలనే రాజ్యాంగంలోని 350 ఏ అధికరణ గురించి పార్లమెంటులో మాట్లాడటమే మీకు తీవ్ర అభ్యంతరకరమైన విషయంగా కనిపించింది. ఏ రాజకీయ పార్టీ అయినా సరే పార్టీ నమోదు ప్రక్రియలో భాగంగా తమ పార్టీ రాజ్యాంగానికి లోబడి పని చేస్తుందని ప్రమాణ పత్రం దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఈ పరిస్థితిలో… మేం రాజ్యాంగంలోని 350 ఏ అధికరణకు వ్యతిరేకంగా పని చేస్తామని ఏ రాజకీయ పార్టీ అయినా తమ ఎన్నికల ప్రణాళికలో చెబితే, ఎవరైనా ఈ విషయాన్ని భారత ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళితే, పార్టీ గుర్తింపునే రద్దు చేసే ప్రమాదం ఉంటుంది. నేను రాజ్యాంగానికి కట్టుబడి చేసిన ప్రసంగాన్ని తప్పుపడితే అది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించినట్లు అవుతుంది. నేను పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగానికి విధేయుడనై ఉంటానని, మనసావాచా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని, ప్రమాణం చేసినందున నేను ఆ విధంగానే లోక్ సభలో ప్రసంగించాను తప్ప పార్టీ సిద్ధాంతాలను ఏనాడూ నేను జవదాటలేదు.

ఏనాడూ పార్టీ విప్ ను ధిక్కరించని వాడిని, ఏనాడూ పార్టీ ఫిరాయించని వాడిని ఎవరినైనా సరే 10వ షెడ్యూలు కింద దోషిగా నిలబెట్టి పార్లమెంటు సభ్యత్వం నుంచి తప్పించలేరు, అనర్హత వేటు కూడా వేయలేరు. అందువల్ల నేను మీకు సూచించేది ఏమంటే నా శక్తియుక్తులను పార్టీ బాగు కోసం, పార్టీ నాయకుడి మేలు కోసం, నా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం వాడుకోండి తప్ప ఇలా ప్రవర్తించ వద్దు.

ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది అధికారంలో ఉన్నవారు అక్రమంగా మెజారిటీ సాధించుకోవడానికి, అధికార దాహంతో పార్టీలను చీల్చే రాజకీయ నాయకులను అదుపు చేయడానికి నిర్దేశించిందే తప్ప నాలాంటి వారి కోసం కాదని మీకు స్పష్టం చేస్తూ ఇప్పటికైనా మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకుని పునరాలోచించేందుకు ఇది సరైన సమయమని నేను మీకు సూచిస్తున్నాను. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే ఫిరాయింపుదార్లను ప్రోత్సహించి ప్రభుత్వాలు ఏర్పాటు చేయకుండా చూడటం. అంతే కాని పార్టీలలో వచ్చే నిరసన స్వరాలను అణచి పెట్టేందుకు కాదు.

ఇదే విషయాన్ని చట్టం రూపొందించే సమయంలో పార్లమెంటు లో జరిగిన చర్చల సందర్బంగా పలువురు చెప్పారు. అలా పార్టీలలో వచ్చే నిరసన స్వరాన్ని అణచి వేయడం భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కుకు భంగకరమని కూడా ఆ చర్చల సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.

పాలనా విధానాలపై, ప్రభుత్వ చర్యలపై నిరసన తెలిపే గొంతులను ఈ విధంగా అణచివేయడం ప్రజాస్వామ్యమా? ఇది సాధారణ విషయం కాదు. మనమందరం ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులం. మనమే నిరంకుశంగా ప్రజాస్వామ్యాన్ని అణచివేసే విధంగా ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యం ఏ విధంగా నిలబడుతుంది? ఇది మీకో నాకో చెప్పడంలేదు. నేను కేవలం నా అనర్హత విషయం మాత్రమే ప్రస్తావించడం లేదు. మనందరం కలిసి ఆలోచించాల్సిన అంశం. నేను సిద్ధాంతపరమైన అంశాలనే లేవనెత్తి, పాలనాధికారులను ప్రభుత్వంలో అధికారం చెలాయిస్తున్న వారిని ప్రజల తరపున ప్రశ్నించాను తప్ప వేరే విధంగా చేయలేదు.

ఈ నేపథ్యంలో నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే నా అనర్హత అంశంపై నిరంతరంగా, విసుగు విరామం లేకుండా పోరాటం చేయడం, ఆ పోరాటంలో భాగంగా గౌరవనీయులైన లోక్ సభ స్పీకర్ పైనా, గౌరవనీయమైన వ్యవస్థలపైన బురద చల్లే విధంగా మాట్లాడటం కాకుండా న్యాయపరమైన అంశాలను మరొక్క సారి సరి చూసుకోండి. చట్టం గురించి పూర్తిగా తెలుసుకోండి. మీరు ఇదే విధంగా గౌరవనీయమైన వ్యవస్థలను పలుచన చేసి అగౌరవ పరిస్తే మళ్లీ మళ్లీ మీకు న్యాయస్థానాల నుంచి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉంటాయి. రాజ్యాంగంలోని పదో షెడ్యూలులోని పేరా 2(ఏ)లో చెప్పినట్లు ప్రభుత్వ నిర్ణయాలపై మంచి చెడు పరిణామాలను చెప్పడమనేది ఆరోగ్యకరమైనదిగానే భావించాలి. రాజకీయ పరిస్థితులు ఏకోన్ముఖంగా ఉండే అవకాశం లేదు. అవి సంక్లిష్టంగానే ఉంటాయి.

కనీసం ఈ లేఖను చదివిన తర్వాత అయినా మీరు రాజకీయ వ్యవస్థను సంపూర్ణంగా అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన అనే అంశం ప్రాముఖ్యతను కూడా మీరు గుర్తిస్తారని నేను అనుకుంటున్నాను. మీ పార్టీలో అంతర్గతంగా ప్రజాస్వామ్యయుత విధానాలు అమలు చేయడం కూడా అనివార్యమని మీరు తెలుసుకోవాలి. అదే విధంగా ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి పూర్తిగా అవగాహన చేసుకుని జాగ్రత్తలు తీసుకుని ఇక నుంచి బాధ్యతతో మెలగుతారని కూడా ఆశిస్తున్నాను.

భవదీయుడు
కె.రఘురామకృష్ణంరాజు

బంగ్లా తరహా ఉద్యమాలతోనే మోడీని సాగనంపగలం

ఇటీవలి కాలంలో తరచుగా రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పెనుదుమారానికి కారణమౌతున్నాయి. సమాజంలో హింసా, ద్వేషాలను రగిల్చే విధంగా ఉంటున్నాయి. ప్రాంతీయ వైషమ్యాలు, మత విద్వేషాలకు తావిచ్చేలా నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసనలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ)ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్‌డీ) జాతీయ అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా చేసిన వ్యాఖ్యలు పెను రాజకీయ దుమారానికి తెరలేపాయి. దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు. ఆయా దేశాలలో ప్రభుత్వాలను గద్దె దించడానికి హింసాత్మక ఆందోళనలు జరిగాయనీ, అటువంటివే భారత్ లో కూడా జరిగితే తప్ప.. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించలేమని అభయ్ సింగ్ చౌతాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశంలో.. శ్రీలంకలో, బంగ్లాదేశ్‌లో యువత ప్రభుత్వాన్ని ఎలా తరిమి కొట్టారో, అదే తరహా పద్ధతులను భారత్‌లోనూ అమలు చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై  బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా, చౌతాలా వ్యాఖ్యలు భారత రాజ్యాంగ వ్యవస్థకు, ప్రజాస్వామ్య నియమాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇది విపక్ష నేతల  దేశ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక  వైఖరికి నిదర్శనమన్నారు.   రాజకీయ లబ్ధి కోసమే దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. విపక్షాలకు  దేశ ప్రయోజనాల కంటే రాజకీయ లబ్ధికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.  మొత్తం మీద అభయ్ సింగ్ చౌతాలా వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించేలా, దేశంలో హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

వైసీపీ బాటలోనే బీఆర్ఎస్?.. అసెంబ్లీ బహిష్కరణకు నిర్ణయం

  పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఒక్క ఓటమితో కుదేలైపోయిందా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని దీటుగా ఎదుర్కోలేక పలాయన మంత్రం పఠిస్తోందా? అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. ఆ పార్టీ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం అందులో భాగమేనని అంటున్నారు. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికే అసెంబ్లీని బహిష్కరించి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇప్పుడు పార్టీ సభ్యులు కూడా అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.  దీంతో రాజకీయ వర్గాలలో బీఆర్ఎస్  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అడుగుజాడలలో నడుస్తోందని అంటున్నారు. ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంంది.   సోమవారం (జనవరి 5)న సభకు హాజరై.. మంగళవారం (జనవరి 6) నుంచి అంటే సభలో కృష్ణ, గోదావరి జలాలపై చర్చ జరిగే సమయానికి అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పరిశీలకులు మాత్రం సభలో కాంగ్రెస్ ను దీటుగా ఎదుర్కోనేందుకు సభాపక్ష ఉప నేతల నియామకం తరువాత బీఆర్ఎస్ బాయ్ కాట్ నిర్ణయం తీసుకోవడం ఏమిటన్న ప్రశ్నకు ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హారీశ్‌రావుకి క్రెడిట్ దక్కే చాన్స్ ఇవ్వవద్దన్య వ్యూహంతోనే బీఆర్ఎస్ ఈ బాయ్ కాట్ నిర్ణయానికి వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక విధంగా అసెంబ్లీలో నదీ జలాలపై చర్చను బీఆర్ఎస్ బాయ్ కాట్ చేయడమంటే.. పలాయన మంత్రం పఠించడమేనని పరిశీలకులు భావిస్తున్నారు.   అయితే నిన్న మొన్నటి వరకూ నదీ జలాల అంశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఎండగడతాం అంటూ బీరాలు పలికిన బీఆర్ఎస్ ఇంత హఠాత్తుగా బహిష్కరణ నిర్ణయం తీసుకోవడంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక వేళ కేసీఆర్ సభకు హాజరైతే.. జల వివాదాలకు ఆయనే సమాధానం చెబుతారు. అయితే కేసీఆర్ గైర్హాజరౌతున్న నేపథ్యంలో ఇటీవల శాసనసభాపక్ష ఉప నేతగా నియమితులైన హరీష్ రావు సభలో బీఆర్ఎస్ తరఫున ప్రసంగించాల్సి ఉంది. అదే జరిగితే సభ సీఎం రేవంత్ వర్సెస్ హరీష్ రావు అన్నట్లుగా మారిపోతుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ డమ్మీ అయిపోతారు. ఇప్పటికే శాసనసభాపక్ష ఉప నేతగా హరీష్ రావు నియామకం కేటీఆర్ ను ఒకింత తక్కువ చేసినట్లుగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో ఇక జలవివాదాలపై హరీష్ రావు గట్టిగా గళం విప్పితే కేటీఆర్ పరిస్థితి పార్టీలో మరింత దిగజారుతుందన్న భావనతోనే బీఆర్ఎస్ ఆకస్మికంగా అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయం తీసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అన్నిటికీ మించి సీఎం రేవంత్, హరీష్ మధ్య కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయనీ, వారిరువురి మధ్యా అరగంట భేటీ జరిగిందనీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించిన గంటల వ్యవధిలో బీఆర్ఎస్ అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో సంక్షోభం ముదిరేలా చేసుకోవడం కంటే.. జనం పలాయనం అనుకున్నా అసెంబ్లీ బాయ్ కాటే మేలని బీఆర్ఎస్ నిర్ణయించుకునట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విశేషమేంటంటే  పార్టీ అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయాన్నిస్వయంగా హరీష్ రావే ప్రకటించడం విశేషం.

కేసీఆర్ తోనూ ఢీ అంటే ఢీ.. కవిత మాటల అర్ధం అదేనా?

తెలంగాణ రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పని ఖతమేనా? ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు కవిత ఇదే విషయాన్ని ఒకింత నర్మగర్బంగా చెప్పారా?  అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఆరంభం సందర్భంగా సభకు వచ్చి ఓ ఐదారు నిముషాలు సభలో కూర్చున్న బీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్ ఎల్పీ నాయకుడు కల్వకుంట్ల కేసీఆర్..  ఆ తరువాత  సభ నుంచి బయటకు వెళ్లి పోయారు. అయితే.. ఆ రోజు సభలో ఏ విషయంపైనా చర్చ జరిగే అవకాశం లేనందున ఆయన సభనుంచి వెళ్లిపోయారనీ, కొత్త సంవత్సరం రెండో తేదీ నుంచి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రేవంత్ సర్కార్ ను అడుగడుగునా ఇరుకున పెట్టి తన విశ్వ రూపాన్ని చూపిస్తారనీ బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు గట్టిగా చెప్పారు. అదే నమ్మారు. అయితే కేసీఆర్ మాత్రం సభలో పార్టీ గొంతు గళంగా వినిపించేందుకు ఉప నాయకులను నియమించడంతో.. ఆయన ఈ శీతాకాల సమావేశాలలో ఇక సభలో కనిపించరని పరిశీలకులు ఆ రోజే చెప్పారు. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం సభకు కేసీఆర్ గైర్హాజరయ్యారు.  ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ భవిష్యత్ పై తెలంగాణ జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ వ్యాఖ్యలు చేశారు. సభకు కేసీఆర్ డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఇక ఖతమే అని అన్నారు.  శుక్రవారం (ఫిబ్రవరి 2) శాసనమండలి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో  చిట్ చాట్ చేసిన ఆమె.. తన తండ్రి కేసీఆర్ కే  సవాల్ విసిరారు. ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు. తప్పు చేయకుంటే కేసీఆర్ సభకు రావాలని సవాల్ విసిరారు.   అధినాయకుడు అసెంబ్లీకి రాకుండా..  పిల్ల కాకులకు సభాసమయాన్ని వదలడం సరికాదన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కు ప్యాకేజీలు, అమ్ముకోవడం తప్ప ఏం తెలియదని ఎద్దేవా చేశారు.   హరీష్ రావు, రేవంత్ రెడ్డిల మధ్య రహస్య బాండ్ ఉందని ఆరోపించిన ఆమె హరీష్ సీఎం చాంబర్ లో అరగంట సేపు ముచ్చటించడం నిజం కాదా అని ప్రశ్నించారు.   అసెంబ్లీలో  మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించిన ఆమె..  రేవంత్ వర్సెస్ హరీష్ అన్నట్లుగా అసెంబ్లీ చాలా ప్రమాదకరమన్నారు.  కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ పై నేరుగా అటాక్ చేయడం ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఆమె కేసీఆర్ తో తాను మాట్లాడి నాలుగు నెలలు పైనే అయ్యిందన్నారు.  కేటీఆర్, హరీష్ లకు పార్టీని వదిలేయడంపై ఆమె ఈ సందర్భంగా కేసీఆర్ ను తప్పుపట్టారు.  ఇలా మాట్లాడడం ద్వారా ఆమె తాను కేసీఆర్ తో డీ అంటే ఢీ అనడానికి రెడీ అన్న సంకేతాలు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తరువాత తన శాసనమండలి సభ్యత్వానికి కవిత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇప్పటికీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. శుక్రవారం (జనవరి 2) కూడా ఆమె శాసనమండలి స్పీకర్ ను తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు. 

సొంత ఇంటి పంచాయతీ పరిష్కరించలేక చేతులెత్తేశారు.. కేసీఆర్ పై రఘునందన్ విమర్శలు

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. కొత్త సంవత్సరం తొలి రోజున ఆయనపై బీజేపీ ఎంపీ రఘునందనరావు తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ తీరు ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్న చందంలా ఉందన్నట్లుగా ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఇతరుల పంచాయతీలను పరిష్కరించడంలో గొప్ప ఉత్సాహం చూపిస్తారనీ, అయితే సొంత ఇంటి పంచాయతీల పరిష్కాం విషయంలో మాత్రం చేతులెత్తేశారనీ అన్నారు. గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.  ఇక కల్వకుంట్ల కవిత సొంత దారి చూసుకున్నారనీ, నేడో, రేపో ఆమె కొత్త పార్టీ ప్రారంభించడం ఖాయమనీ జోస్యం చెప్పారు.  అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ వద్దకు వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహన అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డిలు లేచి నిలబడకపోవడం వారి విచక్షణకు సంబంధించిన విషయమన్న రఘునందనరావు.. కేటీఆర్ కు ముఖ్యమంత్రి కావాలన్న యాంబిషన్ ఉందనీ, అయితే అది సాకారం అవ్వాలంటే ఉండాల్సిన మద్దతు కేటీఆర్ కు సొంత పార్టీ నుంచే కరవైందన్నారు.  పార్టీ దాకా ఎందుకు ఆయనకు సొంత కుటుంబంలోనే మద్దతు లేదని చెప్పారు.  ఈ పరిణామాలన్నిటినీ నిశబ్దంగా గమనిస్తున్న హరీష్ రావు సమయం కోసం వేచి చూస్తున్నారని తాను భావిస్తున్నానన్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న రఘునందనరావు.. కావాలంటే ఈ విషయాన్ని తాను రాతపూర్వకంగా కూడా చెబుతానన్నారు.  ఇక రాష్ట్ర బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలపై స్పందిస్తూ.. ఏ పార్టీలోనైనా అభిప్రాయబేధాలు సహజమని కొట్టి పారేశారు.  దశాబ్ద కాలం బీఆర్ఎస్ పాలనను.. రెండేళ్ల కాంగ్రెస్ పాలననూ చూసిన తెలంగాణం ఇప్పడు బీజేపీకి పట్టం గట్టాలని ఉవ్విళ్లూరుతున్నారన్నారు.  

బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డిపై కాల్పులు

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై కర్నాటకలోని బళ్లారిలో హత్యాయత్నం జరిగింది. ఆయనపై స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు కాల్పులు జరిపి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  మహర్షి వాల్మీకి విగ్రహం ఏర్పాటు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీవిషయంలో  తలెత్తిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది.   ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి  గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో  కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు. అలాగే తొలుత కాల్పులు జరిపిన సతీష్ రెడ్డి గాయపడ్డాడు.   స్థానిక ఎమ్మెల్యే భరరత్ రెడ్డి, గాలి జనార్థన్ రెడ్డిల మధ్య దీర్ఘకాలంగా రాజకీయ వైరం ఉన్న సంగతి విదితమే.  భరత్ రెడ్డి వర్గం వారు గాలి జనార్ధన్ రెడ్డి నివాసం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఘర్షణకు దారి తీసింది.  కాగా ఈ కాల్పుల ఘటన నేపథ్యంలో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొడంతో  పోలీసులు 144వ సెక్షన్ విధించారు. బళ్లారిలో ప్రధాన నాయకులు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు.  

కొత్త సంవత్సరంలో కవిత వార్ కొత్త పుంతలేనా?

బీఆర్ఎస్ వర్సెస్ కవిత వార్ కొత్త సంవత్సరంలో కొత్త పుంతలు తొక్కబోతున్నది. ఇప్పటి వరకూ ఘాటుగా విమర్శలు చేస్తున్నా కవిత తన విమర్శలను ఒకింత సున్నితంగా చిన్నపాటి సూదిమొన గుచ్చినట్లుగా చేస్తు వచ్చారు. అయితే ఇక ముందు అంటే కొత్త సంవత్సరంలో తాను ఇంకెంత మాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకు సాగుతానని.. ఈ ఏడాది చివరి రోజున కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడిన ఆయన ఈ సారి కేటీఆర్ లక్ష్యంగా కూడా సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.  కేటీఆర్ నేరుగా అమెరికా నుంచి వచ్చి పార్టీలో చేరితే.. తాను మాత్రం   2006 లో  సొంతంగా తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశాననీ, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ అన్న విషయానికి తెలంగాణ సాధన ఉద్యమంలో అగ్రస్థానం కలిగేలా చేశాననీ చెప్పుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ తాను ఇండిపెండెంట్ గానే పాల్గొన్నా నన్నారు.  తెలంగాణ ఆవిర్భవించి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ తీరులో మార్పు వచ్చిందని కవిత అన్నారు.  అప్పుడే తన ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానం తనకు కలిగిందన్న కవిత..  తన ఫోన్ ను తన భర్త పోన్ ను ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను అప్పుడే పార్టీ దృష్టికి తీసుకువచ్చినా తేలికగా తీసుకున్నారని కవిత చెప్పారు. అదే కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ చేయిస్తే తేలికగా తీసుకుంటారా అని ప్రశ్నించిన ఆమె,  మా ఇంట్లో పని చేస్తున్న ఒకరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో  సిట్ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడే తన ఫోన్, తన భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న విషయం అర్ధమైందన్నారు.  మహిళలకు అవకాశం ఇచ్చే విషయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సరిగా వ్యవహరించలేదని తండ్రి నిర్ణయాలను సైతం తప్పుపట్టిన కవిత.. కేసీఆర్ హయాంలో 42 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తే.. వారిలో కనీసం ఒక్క మహిళ కూడా లేని విషయాన్ని ఎత్తి చూపారు. ఆ నాడే తాను తన తండ్రిని ప్రశ్నించానని చెప్పుకొచ్చారు.  ఇక హరీష్ రావుపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. హరీష్ రావును తెలంగాణ చంద్రబాబుగా అభివర్ణించారు. ఏడాది ముగుస్తున్న సమయంలో ఆమె పాడ్ కాస్ట్ లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు వచ్చే సంవత్సరం కవిత బీఆర్ఎస్ పై ఇప్పటి వరకూ చేస్తున్న యుద్ధం కొత్త పుంతలు తొక్కబోతోందన్న విషయాన్ని తేటతెల్లం చేశాయి. ఇప్పటి వరకూ తన సోదరుడిని హరీష్ ముంచేస్తారు, తన తండ్రిని తప్పుదోవపట్టిస్తారు అంటూ వచ్చిన కవిత.. ఇప్పుడు మొత్తంగా పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా మొత్తం అందరిపైనా యుద్ధం ప్రకటించేసినట్లైంది. 

మెగా ఫ్యాన్స్ వర్సెస్ నాగబాబు.. జనసైనికులు ఎటువైపు?

జనసేన ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ నాగబాబు కొద్ది కాలంగా ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు, వినిపించడం లేదు. అటువంటి నాగబాబు.. నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన కామెంట్లకు కౌంటర్ ఇవ్వడం ద్వారా ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశారు. జనసేన ఎమ్మెల్సీగా.. ఆ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు పని చేసుకుంటూ పోతున్న నాగబాబు.. శివాజీ కామెంట్లకు కౌంటర్ ఇచ్చి, మెగా ఫ్యాన్స్ కు టార్గెట్ గా మారారు. శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు  కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.   వాస్తవానికి మెగా కాంపౌడ్ అంత పటిష్ఠంగా ఉండటానికి నాగబాబే కారణమని అంటుంటారు, ఆయన నాగ‌బాబు లేకుండా మెగా కాంపౌండ్ ఇంత స్ట్రాంగా నిల‌బ‌డే ఛాన్స్ లేదనే వారు కూడా చాలా మంది ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి అయినా, మెగాపవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ అయినా.. తాము మాట్లాడితే ఇబ్బంది అనుకునే విషయాలను నాగబాబు నోట పలికిస్తారని వారిని దగ్గరా తెలిసన వారు చెబుతుంటారు.   ఇందుకు ఉదాహరణగా అల్లు అర్జున్ గత ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసిన సందర్భంలో కానీ,  ఇండస్ట్రీలో చిరుకు మద్దతుగా గళం విప్పే అంశంలో కానీ నాగబాబు ఎలాంటి శషబిషలూ లేకుండా ముందుకు వచ్చిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. ఇక తన స్వంత కుమార్తె నీహారిక విషయంలో ఆమె పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అండగా నిలబడిన ఉదంతాన్నీ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ నాగబాబును జనసేన నుంచి సస్పెండ్ చేయాలంటూ చేస్తున్న డిమాండ్ ను జనసైనికులు కొట్టి పారేస్తున్నారు. మహాళల వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో నాగబాబు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని ఆయనకు అండగా నిలబడుతున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ అనవసర అంశాన్ని ఇంకా పొడిగించకుండా కామైపోవడం మంచిదని హితవు చెబుతున్నారు.  

గాంధీ నెహ్రూ కుటుంబ వారసుడు రేహాన్ వాధ్రా గాంధీయేనా?

రాహుల్ గాంధీ నెహ్రూ గాంధీ నెహ్రూ కుటుంబ వారసుడు.  కాంగ్రెస్ పార్టీకి ప్ర‌స్తుత‌ం పెద్ద దిక్కు. ద‌శా దిశా దిస్కూచి కూడా రాహుల్ గాంధీయే. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి కూడా ఆయనే. అందులో సందేహం లేదు. అయితే.. రాహుల్ తరువాత కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా చూసిన ఆయన సోదరి ప్రియాంక వధేరా గాంధీ కుమారుడు   రేహాన్ వాద్రానే వార‌సుడు. అందుకు కారణం రాహుల్ గాంధీ అవివాహితుడిగా ఉండటమే. ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.   అదే రాహుల్ గాంధీకి వివాహమై ఉంటే.. ఆయ‌న త‌న‌యులే త‌ర్వాతి  త‌రం వార‌సులు అయి ఉండేవారు. కొద్ది కాలం కిందటి వరకూ రాహుల్ గాంధీ వివాహం అన్నదే వారి కుటుంబంలోనే కాక, రాజకీయవర్గాలలో కూడా హాట్ టాపిక్ గా ఉండేది. అయితే.. రాహుల్ వివాహం పట్ల సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆ చర్చ క్రమంగా ఆగిపోయింది. ఇప్పుడు రాహుల్ మేనల్లుడు రేహాన్ తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడానికి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని పెళ్లి పీటలెక్కుతున్నారు. అయితే రాహుల్ గాంధీకి కూడా ఓ ప్రియురాలు ఉండేదని గట్టిగా వినిపించేది. అయితే ఆయన రేహాన్ లా ధైర్యం చేయలేదు. అందుకు ప్రధాన కారణం సెక్యూరిటీ థ్రేట్ అంటారు.  అప్ప‌ట్లో సోనియా గాంధీ ప్ర‌ధాని  కావ‌ల్సిన  వారు.. ఆమె ప్ర‌ధాని కాలేక పోవ‌డానికి, త‌ర్వాత రాహుల్ పెళ్లాడ‌క పోవ‌డానికి కూడా అదే కారణంగా చెబుతారు.  అప్ప‌ట్లో ఎల్. టీ. టీ. ఈ అనే మిలిటెంట్ గ్రూప్ రాజీవ్ గాంధీని హ‌త‌మార్చిన సంగ‌తి తెలిసిందే. సోనియా ప్ర‌ధాని కాకుండా హెచ్చ‌రిక‌లు జారీ చేసి అడ్డుకున్నది కూడా ఎట్టీటీయే అని అప్పట్లో గట్టిగా వినిపించింది.ఈ నేప‌థ్యంలో రాహుల్ తన త‌ద‌నంత‌ర వార‌సుల‌కు ఈ ప్రాణ‌హాని  సైతం అనువంశికంగా  క‌ల్పించ‌డం ఎందుకు? అన్న కోణంలో ఆలోచించి.. త‌న పెళ్లి ఊసెత్తలేదని అంటారు. అందుకే రేహాన్ పెళ్లి ద్వారా ఆ ఇంట ఇన్నేళ్ల‌కు ఒక శుభ‌కార్యం జ‌రుగుతుండ‌టంతో హ్యాపీ ఫీల‌వుతున్నారు కాంగ్రెస్ కార్య‌ర్త‌లు.

తిరుమలలో రోజా రాజకీయ వ్యాఖ్యలు.. వెల్లువెత్తుతున్న విమర్శలు?

తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధం. తిరుమల పవిత్రతను కాపాడడానికీ, అలాగే తిరుమల క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా ఉండడానికీ టీటీడీ ఈ నిబంధనను అమలు చేస్తున్నది. కోట్లాది మంది భక్తులు కుల, మత, రాజకీయ విభేదాలకు అతీతంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తుంటారు. అలా వచ్చే వారిలో సామాన్యుల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార వర్గాలకు చెందిన వారు ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే వారిలో ఎవరి నేపథ్యం ఎలాంటిదైనా.. తిరుమల కొండపై అందరూ శ్రీవారి భక్తులుగా మాత్రమే మెలగాలన్న ఉద్దేశంతో తిరుమల గిరిపై రాజకీయ ప్రసంగాలు, వ్యాఖ్యలపై నిషేధం విధించారు.   టీటీడీ ట్రస్ట్ బోర్డు ఈ విషయాన్ని  స్పష్టంగా పేర్కొంది. ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది.  తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.  అయితే మాజీ మంత్రి   రోజా ఆ నిబంధనలనూ, ఆంక్షలనూ తోసి రాజని తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేశారు.  జగనన్న మళ్లీ సీఎం కావాలని శ్రీవారిని తాను కోరుకున్నట్లు దర్శనానంతరం మీడియాతో చెప్పారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల కొండపై రోజా తన రాజకీయ ఆకాంక్షను మీడియా ముందు వ్యక్తపరచడం నిబంధనల ఉల్లంఘనేననీ, ఆమెపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.   తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం రోజాకు ఇదే మొదటి సారి కాదంటున్నారు. గతంలో అంటే రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తొలి రోజులలోనే తిరుమల కొండపై ఆమె చేసిన రాజకీయ వ్యాఖ్యలు దుమారం రేపాయి.  ఘోర పరాజయం తర్వాత కూడా ఆమె తీరులో ఎలాంటి మార్పు లేదని ఇష్టారీతిగా వ్యవహరించినా అడిగేవారు లేరన్న రీతిలో ఆమె తీరు ఉందని అంటున్నారు. టీటీడీ కేవలం హెచ్చరికలకు పరిమితం కాకుండా.. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేసిన రోజాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. 

కేసీఆర్ ఆస్త్రసన్యాసమేనా?

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అస్త్రసన్యాసం చేసేశారా? ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాల హాజరు ఇక ముగిసిపోయిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీలో గళమెత్తేందుకు అధికారాలు అప్పగిస్తూ ఆయన చేపట్టిన నియామకాలను చూస్తుంటే ఔననే అనాల్సి వస్తోందంటున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా మాజీ మంత్రి హరీష్ రావును కేసీఆర్ నియమించారు. అంతే కాదు.. అసెంబ్లీ, మండలిలో   పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు  సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని  దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.  అసెంబ్లీలో హరీష్ రావు తో పాటు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లను డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియమించారు.   సభా వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉన్న హరీష్ రావుతో పాటు, మహిళా, బీసీ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని సబితా ఇంద్రారెడ్డి, తలాసానిలకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. వీరు ముగ్గురూ సభలో పార్టీ పక్షాన కీలక అంశాలపై చర్చలలో పాల్గొంటారు. ఇక శాసనమండలిలో ఎల్. రమణ,  పి. సతీష్ రెడ్డిలను ఉప నేతలుగా నియమించారు. పార్టీ విప్ గా దేశపతి శ్రీనివాస్‌ను పార్టీ విప్‌గా నియమించారు. కేటీఆర్ కు ఎటువంటి బాధ్యతలూ అప్పగించకపోవడంపై పార్టీలోనే కాదు, రాజకీయవర్గాలలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసెంబ్లీ లోపలా, బయటా కూడా అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవడంలో కేటీఆర్ వైఫల్యాల కారణంగానే ఆయనకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా అవకాశం ఇవ్వకుండా పక్కన పెట్టారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. అది పక్కన పెడితే.. కేసీఆర్ ఇక ఈ సమావేశాలు హాజరయ్యే అవకాశాలు లేవనడానికి ఈ నియామకాలే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.