రఘురామ కేసు విచారణ వాయిదా.. ప్రతివాదులకు సుప్రీం నోటీసులు
posted on May 25, 2021 @ 2:11PM
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు తనయుడు భరత్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ పోలీసులు తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేశారని, కస్టడీలో వేధించారని ఎంపీ రఘురామకృష్ణరాజు తనయుడు భరత్ తన పిటిషన్ లో ఆరోపించారు. సీఐడీ అధికారుల తీరుపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు. భరత్ పిటిషన్ ను జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారించింది. భరత్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహాత్గీ వాదనలు వినిపించారు. కస్టడీలో రఘురామను చిత్రహింసలకు గురిచేయడంపై సీబీఐ దర్యాప్తును కోరుతున్నామని రోహాత్గీ సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించారు. ప్రతివాదుల జాబితా నుంచి ఏపీ ప్రభుత్వం, డీజీపీని తొలగించేందుకు కోర్టు అనుమతి కోరారు. రోహాత్గీ విజ్ఞప్తి మేరకు ప్రతివాదుల జాబితాలో మార్పులకు సుప్రీం ధర్మాసనం అనుమతి ఇచ్చింది.
ఈ క్రమంలో తమను ప్రతివాదుల జాబితా నుంచి తప్పించడం పట్ల ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్ దవే అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే దవే అభ్యంతరాలను పట్టించుకోలేదు సుప్రీంకోర్టు ధర్మాసనంఇరువైపులా వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు కేంద్రానికి, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. 6 వారాల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.
రాజద్రోహం కేసులో ఏపీ సీఐడీ అరెస్టు చేసిన నర్సాపురం ఎంపీ రఘురామ రాజుకు సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. అయితే ఆయన విడుదలలో మరింత జాప్యం జరుగుతోంది. మరో నాలుగు రోజుల వరకు వేచి ఉండక తప్పదని రఘురామ తరఫు న్యాయవాది లక్ష్మీనారాయణ అన్నారు. కోర్టు ఆదేశాలతో ష్యూరిటీస్ పిటిషన్ ట్రయల్ కోర్టులో వేశామన్నారు. డిశ్చార్జ్ సమ్మరి కావాలని న్యాయమూర్తి అడిగారని, అయితే రఘురామ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి నాలుగు రోజులు సమయం పడుతుందన్నారు.
.