టాయిలెట్లు కడిగిన మంత్రి.. వీడియో వైరల్
posted on Dec 18, 2021 @ 1:48PM
సమస్యలపై జనాలు ఫిర్యాదు చేస్తే సాధారణంగా నాయకులు ఏం చేస్తారు.. ఆ ఫిర్యాదును సంబంధిత అధికారులకు పంపించి చేతులు దులుపుకుంటారు. ఇంకొందరమో అక్కడి నుంచే సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసి వెళతారు. కానీ ఈ మంత్రి మాత్రం అందుకు భిన్నం. తనకు ఫిర్యాదు అందిన సమస్యపై వెంటనే స్పందించారు. అధికారులకు చెప్పకుండా తానే స్వయంగా రంగంలోకి దిగారు. అప్పటికప్పుడు సమస్యను పరిష్కరించారు. ఏకంగా టాయిలెట్లు శుభ్రం చేసి జనాలతో శభాష్ అనిపించుకున్నారు.
మధ్యప్రదేశ్ లో జరిగిన ఈఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గ్వాలియర్ లో ఉన్న ఓ పాఠశాలలో టాయిలెట్లు మంచిగా లేవంటూ ఓ విద్యార్థిని విద్యుత్ శాఖ మంత్రి ప్రధుమాన్ సింగ్ తోమర్ కు ఫిర్యాదు చేసింది. దీనివల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపింది. అయితే సమస్యను పరిష్కరించాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేయలేదు. తానే స్వయంగా రంగంలోకి దిగారు మంత్రి.. ఆ పాఠశాలకు వెళ్లి టాయిలెట్లను కడిగి శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. టాయిలెట్లు కడిగిన మంత్రిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
విద్యార్థిని ఫిర్యాదుతో ఆ పాఠశాలకు వెళ్లిన మంత్రి తోమర్ చీపురు, బ్రష్ పట్టుకుని టాయిలెట్ల గదులకు వెళ్లారు. అక్కడ నీళ్లు పోస్తూ..శుభ్రం చేశారు. టాయిలెట్లున్న పరిసర ప్రాంతాల్లో చెత్త శుభ్రం చేశారు. పాఠశాలలో ఉన్న టాయిలెట్లను శుభ్రంగా ఉంచాలని అక్కడున్న వారికి చెప్పారు. పాఠశాలలో ఉన్న సిబ్బంది పరిశుభ్రంగా ఉంచడం లేదని విద్యార్థిని చెప్పడంతో తాను ఈ పని చేయడం జరిగిందని మీడియాకు తెలిపారు మంత్రి తోమర్.
మంత్రి ప్రధుమాన్ సింగ్ తోమర్ గతంలోనూ ఇలాంటి పనులు చాలానే చేశారు. గ్వాలియర్ నియోజకవర్గంలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో టాయిలెట్లు క్లీన్ గా ఉంచడం లేదని ఫిర్యాదు రావడంతో స్వయంగా వాటిని కడిగి క్లీన్ చేశారాయన. ఇటీవలే ఈ నియోజకవర్గంలో బిర్లానగర్ లో 16వ వార్డులో ఉన్న కాల్వలను క్లీన్ చేశారు. అంతేకాదు విద్యుత్ స్తంభం ఎక్కి…దానిపై ఉన్న చెత్తను శుభ్రం చేశారు. అప్పట్లో ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది.