సీఎం యోగి రాజు.. కంగనా రాణి! ఎంపీ అసద్ హాట్ కామెంట్స్..
posted on Nov 16, 2021 9:13AM
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వ్యాఖ్యలపై దుమారం మరింత ముదురుతోంది. భారత స్వాతంత్రం, మహాత్మ గాంధీజీపై ఆమె చేసిన కామెంట్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 1947లో మనకు వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం కాదని... 2014లో మోదీ ప్రధాని అయిన తర్వాతే మనకు అసలైన స్వాతంత్ర్యం వచ్చిందంటూ ఇటీవలే కామెంట్ చేశారు కంగనా. ఈ వ్యాఖ్యలే దేశంలో పెద్ద వివాదాన్నే రేపాయి. తాను చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పి, పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేయాలని ఎంతో మంది డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా కంగనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. మన దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ఒక మేడమ్ మనకు 2014లో స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారని ఎద్దేవా చేశారు. ఇదే వ్యాఖ్యలు ఒక ముస్లిం చేసి ఉంటే... ఇప్పటికే దేశద్రోహం కేసు పెట్టి, మోకాళ్లపై కాల్పులు జరిపి, ఆ తర్వాత జైలుకు పంపేవారని అన్నారు. ఆమె ఒక రాణి అని వ్యాఖ్యానించారు. యోగి ఆదిత్యనాథ్ రాజు అయినప్పటికీ ఆమెను ఏమీ చేయరని అసద్ విమర్శించారు
టీ20 మ్యాచ్ లో భారత్ పై పాకిస్థాన్ గెలుపొందిన తర్వాత సంబరాలు చేసుకున్న వారిపై దేశద్రోహం కేసులు పెట్టారని... మరి ఇప్పుడు కంగనపై కూడా అవే కేసులు నమోదు చేస్తారా? అని అసదుద్దీన్ ప్రశ్నించారు. విద్రోహం కేసులను కేవలం ముస్లింలపైన మాత్రమే పెడతారా? అని అడిగారు. ఇంతకూ మనకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పాలని ఎంపీ అసదుద్దీన్ డిమాండ్ చేశారు.