ఎంపీలకు మోడీ సర్కార్ మరో షాక్..ఈసారి ఏం కట్ చేశారంటే?
posted on Oct 30, 2021 @ 7:13PM
ఆర్థికశాఖలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న బీజీపీ ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులకు షాకుల మీద షాకులు ఇస్తోంది. ఎయిర్ ఇండియాలో ఎంపీలకు ఫ్రీ విమాన టికెట్లను రద్దు చేసింది. అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ బిడ్డింగ్ లో దక్కించుకున్న తర్వాత కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎయిర్ ఇండియాను టాటా సంస్థకు అప్పగించేందుకు ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. ఈ కసరత్తులో భాగంగా అన్ని బకాయిలను ముందుగానే క్లియర్ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి అన్ని మంత్రిత్వ శాఖలు విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఇందులో భాగంగానే ఎయిర్ ఇండియా విమాన టికెట్లను డబ్బు చెల్లించి కొనాలని కూడా స్పష్టం చేసింది. ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థగా ఎయిర్ ఇండియా ఉండటంతో ఎంపీలకు ఉచితంగా టికెట్ ప్రొటోకాల్ అమలయ్యేది. ఇప్పుడు ప్రైవేటు సంస్థగా ఎయిర్ ఇండియా మారడంతో ఎంపీలు విమాన టికెట్లను ఉచితంగా పొందలేరని డబ్బులు పెట్టి కొనాలని రాజ్యసభ సచివాలయం శుక్రవారం వెల్లడించింది. ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న ఉచిత టికెట్ సదుపాయం కూడా రద్దు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తాజా నిర్ణయం ప్రకారం ఎంపీలు తమ డబ్బులతో టికెట్లు కొనుగోలు చేసి తర్వాత పార్లమెంటు సచివాలయానికి రీఎంబర్స్ మెంటుకు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపీలకు మరికొన్ని కోతలు పెట్టింది మోడీ సర్కార్. కేంద్రియ విద్యాలయాల్లో ఎంపీల కోటాను కట్ చేసింది. ఇప్పటివరకు ఎంపీలకు 10 శాతం రిజర్వేన్ ఉండేది. ఇది సరిపోకపోతే కేంద్రమంత్రి విచక్షణతో ఎంపీలు మరిన్ని సీట్లను తీసుకునేవారు. ఇపుడు ఆ రిజర్వేషన్ ప్రక్రియను కూడా కేంద్రం రద్దు చేసేసింది. ఇప్పటికే ఎంపీ ల్యాడ్స్ ఫండ్లను కూడా నిలిపేసింది. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఏటా ప్రతి ఎంపీకి కేంద్రం రు. 5 కోట్లను మంజూరు చేస్తోంది. అయితే కొన్ని చోట్ల ఈ ఫండ్స్ దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ రిలీజ్ ను కేంద్రం ఫ్రీజ్ చేసేసింది. పార్లమెంటు క్యాంటిన్ లో దొరికే ఆహారం ధరలు బాగా పెంచేసింది.