టీడీపీ ఎమ్మెల్యేపై వైసీపీ కార్యకర్తల రాళ్లదాడి!
posted on Jun 15, 2020 @ 1:48PM
విశాఖ తూర్పు నియోజకవర్గం రామకృష్ణాపురంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆ ప్రాంతంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణబాబుపై వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.
రామకృష్ణాపురంలో సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే రామకృష్ణబాబు వెళ్లిన సమయంలో అధికార పార్టీకి చెందినవారు ఎమ్మెల్యేపై చెప్పులు, కొప్పరి చిప్పలు, రాళ్లు విసిరారు. అవి టీడీపీ కార్యకర్తలకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
వైసీపీ మద్దతుదారుల తీరుకి నిరసనగా ఎమ్మెల్యే రామకృష్ణబాబు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. తమపై రాళ్ల దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు అభివృద్ధి నిరోధకులని ఆరోపించారు. రైడీలను తీసుకువచ్చి రాళ్లతో దాడి చేయించారని రామకృష్ణబాబు మండిపడ్డారు.