మెడికల్ మాఫియాగా భద్రాచలం ఆస్పత్రులు.. పద్ధతి మార్చుకోకుంటే శిక్ష తప్పదు.. మావోల హెచ్చరిక
posted on Jan 16, 2023 @ 3:14PM
మెడికల్ మాఫియాకు భద్రాచలం ఆస్పత్రులు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాయి. మూడు రాష్ట్రాల సరిహద్దు అయిన భద్రాచలంలో ఆస్పత్రులు సంపాదనే ద్యేయంగా అమయాక గిరిజనులను నిలువునా దోచుకుంటున్నాయి. ఆరోగ్యం బూచిగా చూపి కాసులు దండుకుంటున్నాయి. పద్ధతి మార్చుకోకుంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదు. ఇదీ మావోయిస్టులు భద్రాచలంలో సంపాదనే ధ్యేయంగా పని చేస్తున్న ఆస్పత్రుల యాజమాన్యాలకు మావోయిస్టులు రాసిన బహిరంగ లేఖ సారాంశం.
మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం ఇప్పుడు మెడికల్ మాఫీయాకు అడ్డాగా మారి కాసుల వర్షం కురిపిస్తోంది. ఏజెన్సీ ప్రాంతం కావడంతో గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని సంపాదనే ధ్యేయంగా ఆసుపత్రులు పని చేస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని బూచిగా చూపి వారిని భయబ్రాంతులకు గురి చేసి రోగుల రక్తం పిండుకుంటున్నారని భద్రాచలంకొత్తగూడెం - అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే-ఏఎస్ఆర్) కార్యదర్వి ఆజాద్ పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.
ఛత్తీస్ఘడ్, ఒడిస్సా, ఆంధ్ర ప్రాంత గిరిజనులు, గిరిజనేతరులతో పాటు స్థానిక తెలంగాణ ప్రాంత ప్రజలను వైద్యంపేరుతో రోజులు తరబడి ఆసుపత్రుల్లో ఉంచి అవసరం లేకున్నా నానా రకాల టెస్టులూ ల్యాబులు, ఆసుపత్రులు, వైద్యులు జనాన్ని సొమ్ముల కోసం హింసిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు. ప్రజల ప్రాణాలు ఇప్పడు ఆసుపత్రులకు డబ్బులు కురిపించే వనరులుగా మారిపోయాయని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రజల పాలిట కొందరు వైద్యులు రాక్షసుల్లా తయారయ్యారనీ, రోగుల రక్తం జలగల్లా పీలుస్తున్నారనీ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఆరోగ్య సమస్యలను అలుసుగా టెస్టుల పేర జనంలో భయాన్ని సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలో పని చేసే వైద్యులు సైతం సొంత క్లినిక్కులు ఏర్పాటు చేసుకుని ఎక్కవ సమయం వాటికే కేటాయిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా మెడికల్ మాఫియాగా మారిన వైద్య వృత్తి ఫార్మ కంపెనీలతో జతకడుతూ తక్కువ ధరకు అమ్మాల్సిన మందులను బ్రాండుల పేర్లతో ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. ఇక్కడి వైద్యులు మనుషులను కరెన్సీ నోట్లు ముద్ర వేసే యంత్రాల్లా భావిస్తూ నోటికి వచ్చిన టెస్టుల పేర్లు చెప్తూ.. చేతికి వచ్చిన ఖరీదైన మందుల పేర్లు రాస్తూ పేద ప్రజలను రాబందుల్లా పీక్కుతింటున్నారని మావోయిస్టలు విమర్శించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు వారి సమయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేటాయించకుండా ఇలానే ప్రవర్తిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గిరిజన ప్రాంతమైన భద్రాచలం ప్రాంతంలో సంపాదనే ధ్యేయంగా ప్రైవేటు ఆసుపత్రులను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో నివసించే గిరిజనుల అమాయకత్వాన్ని అసరా చేసుకొని కోట్లకు పడగెత్తిన వైద్యులు, ల్యాబ్, మెడికల్ షాప్ ల యజమానులు తమ పద్ధతిని మర్చుకోక పోతే ప్రజకొర్టు లో శిక్ష తప్పదని మావోయిస్టులు ఆ లేఖలో హెచ్చరించారు. .