ఈటల బర్తరఫ్ కు అసలు కారణం ఇదే.. కేటీఆర్ సంచలనం..
posted on Jul 14, 2021 @ 3:21PM
తన మంత్రి వర్గం నుంచి సీనియర్ నేత ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసి సంచలనానితి తెరలేపారు ముఖ్యమంత్రి కేసీఆర్. అప్పటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిమాలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తనను మంత్రివర్గం నుంచి తొలగించడంపై కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు ఈటల రాజేందర్. కేసీఆర్ కుటుంబంపైనా ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరిన తర్వాత తన ఆరోపణల్లో మరింత తీవ్రత పెంచారు ఈటల. కేసీఆర్ టార్గెట్ గానే ఆయన ముందుకు పోతున్నారు. అయితే ఈటల ఎన్ని విమర్శలు చేసినా.. కరీంనగర్ జిల్లా నుంచే ప్రాతినిద్యం వహిస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాత్రం స్పందించలేదు. ఈటల విషయంలో కేటీఆర్ సైలెంటుగా ఉండటంపైనా రాజకీయ వర్గాల్లో చర్చలు జరిగాయి.
అయితే తాజాగా ఈటల రాజేందర్ విషయంలో స్పందించారు మంత్రి కేటీఆర్. ఈటల రాజేందర్ ను భర్తరఫ్ ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పారు.ఈటలకు టీఆర్ఎస్ ఎలాంటి నష్టం చేయలేదన్నారు. 2003లో ఎంత కష్టమైనా పార్టీ టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు. టీఆర్ఎస్లో పదవులు అనుభవిస్తూనే.. ఇతర పార్టీ నేతలతో ఈటల సంప్రదింపులు జరిపారన్నారు కేటీఆర్. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆ భేటీలోనే మాట్లాడితే పోయేదని.. కానీ, సింపతి కోసం ప్రజల దగ్గర మాట్లాడి ఆయనకు ఆయనే దూరమయ్యారని చెప్పారు. ఈటల పార్టీలోకి రాకముందే కమలాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలంగా ఉందన్నారు. హుజూరాబాద్లో పార్టీల మధ్యనే పోటీ ఉందని.. వ్యక్తుల మధ్య కాదని కేటీఆర్ అన్నారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఏడేళ్లలో కేంద్రం దేశంలో ఏం చేసిందో చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా? అన్నారు. చిల్లర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ సమస్యపై తప్ప ప్రతిపక్షాలు మాట్లాడేందుకు సబ్జెక్ట్ లేదని కేటీఆర్ విమర్శించారు.