పీసీసీ ఇవ్వండి.. ప్రగతి భవన్ పునాదులు కదిలిస్తా: కోమటిరెడ్డి
posted on Dec 10, 2020 @ 1:23PM
తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కొత్త పీసీసీ ఎంపిక కోసం కసరత్తు చేస్తున్న రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్.. పార్టీలోని వివిధ వర్గాల నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. పీసీసీ చీఫ్ కోసం కసరత్తు సాగుతుండగానే పీసీసీ రేసులో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తనకు సీఎం, మంత్రి పదవులు అవసరం లేదని... పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే చాలని అన్నారు. పీసీసీ పగ్గాలను తనకిస్తే... రాష్ట్రంలో కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పీసీసీ పదవిని ఇవ్వగానే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపడతానని... ఎన్నికలకు ఏడాది ముందు నుంచి హైదరాబాదులో ఉంటానని చెప్పారు. ఊరూరా తిరిగి ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పారు. ప్రజలతో కలిసి ప్రగతి భవన్ పునాదులను కదిలిస్తానంటున్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
పీసీసీ ఇవ్వాలని గతంలో అడిగినా కానీ తనకు అవకాశం ఇవ్వలేదన్న కోమటిరెడ్డి.. ఈ సారైనా అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ ని అడిగానని చెప్పారు. తనపై భూకబ్జా కేసులు కానీ, ఇతర కేసులు కానీ లేవని... అలాంటప్పుడు పీసీసీ తనకు ఇవ్వడానికి అభ్యంతరం ఎందుకని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన చరిత్ర తనదని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి చివరి స్టేజ్ లో ఉందని, తనకు పీసీసీ ఇస్తే పునర్వైభవాన్ని తీసుకొస్తానని చెప్పారు. కోమటిరెడ్డి తాజా కామెంట్లు కాక రేపుతున్నాయి. భూకబ్జా కేసులు తనపై లేవంటూ పరోక్షంగా మరో పార్టీ నేతను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టార్గెట్ చేశారనే చర్చ జరుగుతోంది.
మరోవైపు పార్టీలో ఏకాభిప్రాయం ద్వారానే పీసీసీ చీఫ్ ను ఎంపిక చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. బుధవారం పార్టీ కోర్ కమిటీతో చర్చించిన ఠాగూర్.. గురువారం ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమై పీసీసీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలన్న దానిపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. పార్టీకి చెందిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జులతోనూ మాణిక్కం చర్చించనున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకా ఢిల్లీకి వెళ్లి రాహుల్ కు నివేదిక ఇస్తారని, తర్వాతే ఏఐసీసీ నుంచి పీసీసీ చీఫ్ పై ప్రకటన వస్దుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.