కొత్త పార్లమెంట్ సెంట్రల్ విస్టా విశిష్టతలు ఇవే!
posted on Dec 10, 2020 @ 1:23PM
దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనానికి ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేశారు. ఆ తర్వాత ఫౌండేషన్ స్టోన్ వేశారు. 'సెంట్రల్ విస్టా' గా పిలుస్తున్న కొత్త పార్లమెంట్ నిర్మాణాన్ని ఇప్పుడున్న పార్లమెంటు భవనం పక్కనే నిర్మిస్తున్నారు. కొత్త పార్లమెంటుకు సంబంధించి చాలా ప్రత్యేకతలు, విశేషాలు ఉన్నాయి. 9 వందల 71 కోట్ల రూపాయల బడ్జెట్ తో సెంట్రల్ విస్టాను నిర్మిస్తున్నారు. 64 వేల 500 చదరపు మీటర్ల వైశాల్యంలో కొత్త పార్లమెంట్ ఉండనుంది. ప్రస్తుత పార్లమెంట్ భవనం కంటే 17వేల చదరపు కిలోమీటర్లు పెద్దగా ఉండనుంది. 2022 ఆగస్టులో జరిగే దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కొత్త పార్లమెంట్ భవనంలోనే నిర్వహించాలని కేంద్ర సర్కార్ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే నిర్మాణ పనులు జరిగేలా ప్రణాళికను సిద్దం చేశారు.
కొత్త పార్లమెంటు భవనం మన దేశ చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా, ప్రతి అడుగులో భారతీయత ఉట్టిపడేలా నిర్మాణం ఉండనుంది. పురివిప్పి ఆడుతున్న జాతీయపక్షి నెమలి ఆకృతిలో లోక్సభ పైకప్పు, విరబూసిన జాతీయ పుష్పంకమలం రూపంలో రాజ్యసభ పైకప్పు, పార్లమెంట్లో అంతర్భాగంగా నిలువనున్న జాతీయ వృక్షం మర్రిచెట్టు రూపంలో తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుత పార్లమెంట్ భవనాన్ని పోలి ఉండనుంది నూతన భవనం రూపు. పార్లమెంట్ కొత్త భవనంలో గ్రౌండ్, మొదటి, రెండు అంతస్థులు ప్రస్తుత భవనం ఎత్తు ఉండేలా కొత్త భవనం నిర్మాణం చేపడుతున్నారు.
ఒకే సారి 1,224 మంది ఎంపీలు కూర్చుకోవడానికి అనుగుణంగా పార్లమెంట్ నిర్మిస్తున్నారు. లోక్సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేలా సీటింగ్ ఉండనుంది. భారత ప్రజాస్వామ్య వైభవాన్ని చాటిచెప్పేలా ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు కార్యాలయాలు నిర్మిస్తున్నారు. విశాలమైన లాంజ్, గ్రంథాలయం, బహుళ కమిటీలకు గదులు, భోజనశాలలు, లోక్సభ, రాజ్యసభ గ్యాలరీల్లో మీడియా, సాధారణ ప్రజల కోసం ఏర్పాట్లు సైతం ఉండనున్నాయి. మీడియా ప్రతినిధులు, సాధారణ ప్రజలకు 480 సీట్లు చొప్పున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పార్లమెంటు సభ్యుడికి 40 చదరపు మీటర్ల ఆఫీస్ స్పేస్ ను శ్రమ శక్తి భవన్ లో ఏర్పాటు చేయనున్నారు. శ్రమ శక్తి భవన్ 2024 నాటికి పూర్తవుతుంది.
ప్రస్తుత భవనంలో తొలి రెండు వరుసల్లో కూర్చున్న ఎంపీలకు మాత్రమే డెస్క్లు ఉన్నాయి. కొత్త భవనంలో సభ్యులందరికీ డెస్క్లు ఉండేలా ఏర్పాట్లున్నాయి. ప్రతి ఎంపీకి టచ్ స్క్రీన్తో కూడిన డిజిటల్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. లోక్సభే సెంట్రల్ హాలుగా 1315 చదరపు మీటర్లలో విస్తరించి ఉండనుంది. లోక్సభను ఆనుకొని ప్రధానమంత్రి కార్యాలయం, 20 మీటర్ల ఎత్తులో కానిస్టిట్యూషనల్ హాల్, దానిపై అశోక స్థూపం నిర్మించనున్నారు. ప్రస్తుత భవనానికి ఉన్నట్లుగానే కొత్త భవనం చుట్టూ నిలువెత్తు రాతి స్తంభాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్యాలరీల్లో కూర్చునే ప్రజలకు సభా కార్యక్రమాలు కనిపించేలా తెరలు ఏర్పాటు చేయనున్నారు. వీవీఐపీల కోసం రెండు గేట్లు, ఎంపీల వాహనాలు వచ్చేందుకు మరో రెండు, సాధారణ ప్రజలు, మీడియా, సందర్శకుల కోసం మరో రెండు భవనానికి గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. నూతన భవనంలో అడుగడుగునా అధునాతన నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. నూతన భవన ఆకృతిని గుజరాత్కు చెందిన హెచ్పీసీ సంస్థ రూపొందించగా.. నిర్మాణ బాధ్యతలను టాటా సంస్థ దక్కించుకుంది. నిర్మాణంలో ప్రత్యక్షంగా రెండు వేల మంది, పరోక్షంగా 9వేల మంది కార్మికులు పాల్గొననున్నారు.
ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనానికి వందేళ్ల చరిత్ర ఉంది. 1921, ఫిబ్రవరి 21న ప్రస్తుత పార్లమెంట్కు శంకుస్థాపన చేయగా.. ఆ సమయంలో రూ. 83లక్షలు వ్యయమైంది. ఆరేళ్లలో నిర్మాణం పూర్తి చేశారు. 1927, జనవరి 18న పార్లమెంట్ ప్రారంభోత్సవం చేశారు. ప్రస్తుత పార్లమెంట్ భవనం కొంత ఇరుకుగా కూడా ఉందనే వాదన ఎప్పటి నుంచో ఉంది. భవనాన్ని అప్ గ్రేడ్ చేసే అవకాశం కూడా లేకపోవడంతో, కొత్త భవనాన్ని నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. అత్యాధునిక టెక్నాలజీకి అనుగుణంగా కొత్త పార్లమెంటు ఉండాలని ఎక్కువ మంది సభ్యులు అభిప్రాయపడ్డారు. మారిన ప్రపంచానికి తగ్గట్టుగా కొత్త భవనం ఉండాలని చెప్పారు. దీంతో 93 సంవత్సరాల ప్రస్తుత పార్లమెంటు భవనానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా, భూకంపాలను కూడా తట్టుకునేలా కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. సెంట్రల్ విస్టా సిద్ధమయ్యాకా పాత పార్లమెంటు భవనాన్ని పురావస్తుశాఖకు అప్పగిస్తామని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.