కల్వకుంట్ల కవిత..కొత్త రాజకీయ అధ్యాయానికి ఆరంభం!
posted on Sep 4, 2025 @ 11:49AM
కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ తో బీఆర్ఎస్ పార్టీలో గత కొంత కాలంగా సంచలనంగా మారి, పార్టీలో సంక్షోభానికి కారణమైన కేసీఆర్ తనయ కథ ముగిసినట్లేనా? అంటే కాదు అన్న సమాధానమే వస్తోంది. పరిశీలకులు బీఆర్ఎస్ లో అసలు కథ ఇప్పుడే మొదలైందంటున్నారు. కవిత కొత్త పార్టీ వార్తలు బీఆర్ఎస్ లో భారీ చీలకకు తెరలేపే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇప్పటికే పార్టీలో క్షేత్ర స్థాయిలో కవితకు మద్దతు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె రాజకీయం, కుటుంబ సెంటిమెంట్ లకు రంగరించి బీఆర్ఎస్ లో అత్యంత కీలకంగా ఉన్న హరీష్ రావు పై సంధించిన అస్త్రాలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం అందరూ కవిత పొలిటికల్ గా తీసుకున్న టర్న్ ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలతో పోలుస్తున్నారు. అయితే అది సరికాదు. షర్మిల తన అన్నతో విభేదించి బయటకు రావడానికి రాజకీయ కారణాల కంటే ఎక్కువగా కుటుంబ వ్యవహారాలే కారణం అని చెప్పాల్సి ఉంటుంది. కానీ కవిత విషయం అలా కాదు.. కుటుంబ వ్యవహారాలతో పాటు.. బలమైన రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. పార్టీలో తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్న విషయాన్ని ఆమె చాలా చాలా బలంగా ఎస్టాబ్లిష్ చేయగలిగారు. అంతే కాదు.. పార్టీలో ఆమె ఎప్పుడూ కీలకంగానే వ్యవహరించారు. పార్టీ అగ్రనేతలలో ఒకరిగా క్రీయాశీల పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆమె ఏ మాత్రం తక్కువ చేసి చూడడానికి వీలు లేనంతగా మమేకమయ్యారు. తెలంగాణ జాగృతితో ఆమె తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ సారథిగా బలమైన ముద్ర వేసుకున్నారు.
ఇక ప్రస్తుతానికి వస్తే.. పార్టీ ఆమెను సస్పెండ్ చేస్తే.. ఆమె పార్టీకీ, ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికీ క్షణం ఆలస్యం చేయకుండా రాజీనామా చేసేశారు. అంతే కాదు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న హరీష్ రావుపై విమర్శలు గుప్పించారు. అవినీతి అనకొండగా మాజీ మంత్రి హరీష్ రావును అభివర్ణిస్తూ, ఆయన అవినీతి కారణంగానే కేసీఆర్ రెండో సారి సీఎం అయిన తరువాత హరీష్ కు గతంలో ఆయన నిర్వహించిన ఇరిగేషన్ శాఖ నుంచి తప్పించారని ఆరోపించడం ద్వారా కాళేశ్వరంలో అవినీతికి హరీషే కారణమని ఎస్టాబ్లిష్ చేశారు.
ఇక కేటీఆర్ పై కూడా కవిత సుతిమెత్తగానే అయినా చాలా చాలా బలమైన ఆరోపణలూ, విమర్శలూ చేశారు. అదే సమయంలో తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ ను పన్నెత్తు మాట అనలేదు. తన రాజకీయ ఎదుగుదల సొంత అన్న కేటీఆర్ కే ఇష్టం లేదన్న విషయాన్ని పరోక్షంగానైనా బలంగా చెప్పారు. వాస్తవానికి కవిత తన పొలిటికల్ యాంబిషన్స్ ను ఎన్నడూ గోప్యంగా ఉంచలేదు. ఒక ఎమ్మెల్సీగానో, లేదా రాజ్యసభ సభ్యత్వంతోనో సరిపెట్టుకోవడానికి తాను సిద్ధంగా లేననీ, పార్టీ క్రియాశీల, కీలకమైన పోజిషన్ కు ఎదగడమే లక్ష్యమని ఆమె తొలి నుంచీ చాటుతూనే వచ్చారు. అయితే కేటీఆర్ తన సోదరే తనకు పోటీ అని భావించడంతోనే కుటుంబంలో సమస్యలు వచ్చాయనీ, అందుకే కవిత గతంలోనే బాహాటంగా కేసీఆర్ వినా మరెవరి నాయకత్వాన్నీ ఆను ఆమోదించబోనని విస్పష్టంగా చెప్పాల్సి వచ్చిందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాగా బుధవారం ఆమె మీడియా సమావేశంలో తన పొలిటికల్ జర్నీని ఏపీసీసీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి షర్మిల జర్నీతో పోల్చడాన్ని నిర్ద్వంద్వంగా ఖండించారు. అంతే కాదు.. పోల్చాల్సి వస్తే తనను కేసీఆర్ తో పోల్చాలని కూడా కవిత విస్పష్టంగా తనదైన శైలిలో చెప్పారు. ఆమె వ్యూహాలు, ఎత్తులు నిశితంగా పరిశీలిస్తే.. కవిత కేసీఆర్ ల పొలిటికల్ స్ట్రాటజీస్ లో సారూప్యత కనిపిస్తుందని అంగీకరించి తీరాలి.
గత కొంత కాలంగా.. అంటు ముఖ్యంగా లిక్కర్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చిన తరువాత నుంచీ కవిత ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా బీఆర్ఎస్ కు సమాంతరంగా తెలంగాణ జాగృతిని ఒక ఉద్యమ స్థయి పార్టీకి దీటుగా తీర్చి దిద్దారు. తద్వారా తన బలాన్ని, బలగాన్నీ పెంచుకుంటూ వచ్చారు. ఇక ఇప్పుడు ఆమె తన సొంత పార్టీ ప్రకటించడానికి ఎక్కువ సమయం తీసుకోకపోవచ్చునన్నది పరిశీలకుల అంచనా. ఒక వేళ వెంటనే పార్టీ ప్రకటన లేకపోతే కనుక.. తెలంగాణ స్థానిక ఎన్నికలలో కవిత.. తెలంగాణ జాగృతి తరఫున అభ్యర్థులను రంగంలోకి దించే అవకాశాలే మెండుగా ఉన్నాయి. దాని వల్ల తాను నిలబెట్టిన అభ్యర్థుల గెలుపొటములను పక్కన పెడితే.. ఈ పోటీ ప్రభావం బీఆర్ఎస్ పై ప్రతికూల ప్రభావాన్ని తప్పక చూపుతుంది. ఇప్పటికే వరుసగా రెండు ఎన్నికలలో ( 2023 అసెంబ్లీ, 2034 సార్వత్రిక) ఓడిపోయిన బీఆర్ఎస్.. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలలో కూడా పరాజయాన్ని మూటగట్టుకుంటే.. ఇక ఆ పార్టీ మళ్లీ తేరుకుని బలం పుంజుకునే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటాయన్నది కవిత అంచనాగా పరిశలకులు విశ్లేషిస్తున్నారు.
ఇక అదే సమయంలో కవిత బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ విఫలమయ్యారని కవిత అన్యాపదేశంగానైనా గట్టిగా చెబుతున్న మాటలు నిస్సందేహంగా పార్టీ క్యాడర్ పై ప్రభావం చూపుతాయి. ఇప్పటికే నోటి దురుసుతనంతో, తొందరపాటు వ్యాఖ్యలతో కేటీఆర్ నాయకత్వ పటిమపై ప్రజలలో సందేహాలు వ్యక్తం అయ్యే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా బాంబులతో కాంగ్రెస్ పేల్చడం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఇలా తాయారైందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను జనమే కాదు, బీఆర్ఎస్ శ్రేణులు కూడా విశ్వసించడం లేదు. కేటీఆర్ ఇటువంటి వైఖరి నిస్సందేహంగా కవితకు కలిసి వచ్చే అంశమేనన్నది పరిశీలకులు విశ్లేషణ. మొత్తం మీద కవిత రాజకీయ పరిణతి, అవగాహన ముందు ముందు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్థకం చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయవర్గాలలో ఓ చర్చ అయితే నడుస్తోంది.