జూనియర్ డాక్టర్ల సమ్మె

హైదరాబాద్ లో జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. ఎమర్జెన్సీ విధుల్నికూడా బహిష్కరించడంతో రోగులు తీవ్ర స్థాయిలో ఇబ్బందిపడుతున్నారు. హౌస్ సర్జన్లపై జరిగిన దాడికి నిరసనగా జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. తమ రక్షణకోసం ప్రత్యేక భద్రతా బలగాల్ని ఏర్పాటు చేసేవరకూ సమ్మెను ఆపేది లేదని జూనియర్ డాక్టర్లు తేల్చి చెబుతున్నారు. తమ ప్రాణాలకు రక్షణ ఉంటేనే రోగులకు వైద్యం చేయడానికి వీలౌతుందని తెగేసి చెబుతున్నారు. రోగులకు ఇబ్బందులు కలిగినప్పుడల్లా డాక్టర్లపై దాడి చేయడం పరిపాటిగా మారిందని జుడాలు మండిపడుతున్నారు. గతంలో తమపై జరిగిన దాడులు, ఘటనలు, ప్రభుత్వ స్పందనని దృష్టిలోపెట్టుకుని ఈసారి తాము ఆరునూరైనా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని జూడాలు స్పష్టం చేస్తున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు తర్వాతే సమ్మెను విరమిస్తామని తెగేసి చెబుతున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.