పీలేరు జైలుకు జడ్జి రామకృష్ణ.. హైకోర్టు స్పందన..
posted on Jun 2, 2021 @ 11:21AM
జడ్జి రామకృష్ణను చిత్తూరు జిల్లా జైలు నుంచి పీలేరు సబ్ జైలుకు తరలించారు. తన తండ్రికి ప్రాణహాని ఉందంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె. గోస్వామికి.. రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. రామకృష్ణ ఉన్న బ్యారక్కు వచ్చిన మరో ఖైదీ ఆయనను బెదిరించారని లేఖలో తెలిపారు. బెదిరించిన వ్యక్తి దగ్గర కత్తి కూడా ఉందని అందులో వివరించారు. ఈ లేఖపై స్పందించిన హైకోర్టు చీఫ్ జస్టిస్.. రామకృష్ణకు ప్రాణ హాని విషయమై ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. రామకృష్ణను మరో బ్యారక్లోకి మార్చామని చెప్పగా.. పూర్తి వివరణ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఆ తర్వాత జడ్జి రామకృష్ణను పీలేరు సబ్జైలుకి తరలించారు అధికారులు.
ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై.. జడ్జి రామకృష్ణను పోలీసులు ఏప్రిల్ నెలలో అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జయరామచంద్రయ్య ఫిర్యాదు చేయగా.. సస్పెండయిన జడ్జి రామకృష్ణపై ఐపీసీ సెక్షన్ 124ఏ కింద పీలేరు పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. జడ్జి రామకృష్ణను చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. అయితే, జడ్జి రామకృష్ణ ఉన్న బ్యారెక్లోని మరో ఖైదీ బెడ్ కింద కత్తి ఉండటం ప్రస్తుత వివాదానికి కారణం.
సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే చంపుతానని రామకృష్ణను ఆ ఖైదీ బెదిరించాడని.. జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుతో ఖైదీని మరో బ్యారెక్కు తరలించారు. తన తండ్రి ప్రాణాలకు ముప్పు ఉందని జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశాడు. వెంటనే ఆ జైలు నుంచి మార్చాలని పట్టుబట్టాడు. జైల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. భోజనం చేయడానికి కూడా భయపడుతున్నానని తన తండ్రి తనతో చెప్పారని అన్నారు.
జైల్లో ఉన్న ఆ వ్యక్తి దగ్గర కత్తి ఎందుకు ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ప్రశ్నించారు. జడ్జి రామకృష్ణను హత్య చేసే ఉద్దేశంతోనే అతని బ్యారక్లోకి మరో వ్యక్తిని పంపించారని చంద్రబాబు ఆరోపించారు. ఆ అపరిచిత వ్యక్తి వద్ద కత్తి ఎందుకు ఉందో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి కక్షపూరితంగా కేసులు పెట్టి జడ్జి రామకృష్ణను జైలులో పెట్టించారని చంద్రబాబు ఆరోపించారు. ‘న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు అండగా నిలిస్తే కేసులు పెడతారా?’ అని చంద్రబాబు నిలదీశారు.
జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడంతో.. ఆయన్నుచిత్తూరు జైలు నుంచి పీలేరు సబ్ జైలుకు తరలించారు అధికారులు.