12 ఏళ్ల పైబడిన వారికి కొవిడ్ టీకా! సెప్టెంబర్ 15 నుంచి మార్కెట్లోకి..
posted on Sep 4, 2021 @ 10:10AM
దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. ప్రస్తుతం 18 ఏళ్ల పైబడిన వారికే కొవిడ్ టీకా అందిస్తున్నారు. 19 ఏండ్ల లోపు వాళ్లకు వేసే కొవిడ్ టీకా కోసం కొన్ని ఫార్మా సంస్థలు ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. తాజాగా 12 సంవత్సరాలు దాటిన వారూ పొందే టీకాను సిద్ధం చేసినట్లు జైడిష్ క్యాడిలా సంస్థ ప్రకటించింది. ‘జైకోవ్-డి’ పేరిట ఉత్పత్తి చేసిన టీకా ఈ నెల 15వ తేదీ నుంచి మార్కెట్ లో అందుబాటులో ఉండబోతోంది. ఈ విషయాన్ని వైద్య వర్గాలు వెల్లడించాయి.
ప్రభుత్వ వైద్యంలో ఈ టీకా ఎప్పటి నుంచి లభ్యమవుతుంది అన్న అంశంపై స్పష్టత రాలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ధరను కూడా నిర్ణయించిన తర్వాతే సర్కారు వైద్యంలో ప్రవేశపెడతారని, అందుకు మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. జైడిష్ క్యాడిలా సంస్థ రూపొంచిందిన ‘జైకోవ్-డి’ మూడు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను రెండు డోసుల్లో పొందుతుండగా.. ‘జైకోవ్-డి’ను మూడు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది.
మొదటి డోస్ తీసుకున్న 28 రోజులకు రెండో డోసు, రెండో డోసు పొందిన తరవాత 28 రోజులకు మూడో డోసు పొందాలి. ఈ లెక్కన తొలి డోసు నుంచి మూడో డోసు టీకా పొందడానికి మధ్య వ్యత్యాసం 56 రోజులు. ఈ టీకా వేయడానికి సూది వినియోగించరు. ‘ఫార్మాజెట్’ అనే పరికరం సాయంతో వ్యాక్సిన్ వేస్తారు. ఆ పరికరాన్ని చర్మంపై ఉంచి నొక్కడం ద్వారా టీకా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ‘జైకోవ్-డి’ను 2-8 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు.
ప్రస్తుతం కళాశాలలు, పాఠశాలలు ప్రారంభమైన దృష్ట్యా ఈ టీకా రావడం విద్యార్థులకు ప్రయోజనకరమన్న భావన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులు సుమారు 48 లక్షల మంది ఉంటారని అంచనా. అవసరమైన వారు ప్రైవేటులో సొంతంగా కొనుగోలుచేసి ఈ టీకాను పొందాల్సి ఉంటుంది. రెండేళ్ల పైబడిన వారి కోసం భారత్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేయనున్న టీకా వచ్చే నవంబరులో అందుబాటులోకి రావచ్చని వైద్య వర్గాలు తెలిపాయి.