ద‌గ్గుపాటికి...వివాదాలు ప‌రిపాటి?

Publish Date:Jan 14, 2026

  పండ‌గ పూట నారా వారి కుటుంబ‌మంతా నారావారి ప‌ల్లెలో సంబ‌రాల్లో మునిగి తేలుతుంటే.. అనంత  ఎమ్మెల్యే వివాదం ఒక‌టి పండ‌గ స్పెష‌ల్ గా తెర‌పైకి వ‌చ్చింది. అనంత అర్బ‌న్ ఎమ్మెల్యే ద‌గ్గుపాటి ప్ర‌సాద్ రాన్రాను వివాదాస్ప‌దంగా మారుతున్నారు. తాజాగా ఆయ‌న‌పై ఒకే సారి రెండు ఆరోప‌ణ‌లు. ఒక‌టి నంబూరి వైన్స్ య‌జ‌మానిని డ‌బ్బు కోసం ప‌లు మార్లు ఫోన్లు చేసి బెదిరించ‌డం మాత్ర‌మే కాకుండా.. ఆయ‌న వైన్స్ ని కూడా త‌గ‌ల‌బెట్టించారు.  నంబూరి న‌ల‌భై ఏళ్ల నుంచి టీడీపీలో సిన్సియ‌ర్ కార్య‌క‌ర్త‌గా  కొన‌సాగుతున్నారు. త‌న‌లాంటి టీడీపీ వారి మీదే ద‌గ్గుపాటి ఇంత ప్రతాపం చూపిస్తుంటే.. ఇక సాధార‌ణ మైన వారి  ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఆయ‌న ప్ర‌శ్నిస్తున్న విధం. ఇక ఇదే ద‌గ్గుపాటి పై రాష్ట్ర లింగాయ‌త్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ అయిన  స్వ‌ప్న అనే మ‌హిళ త‌న  భూమి క‌బ్జా చేసిన‌ట్టుగా ఆరోప‌ణ‌లు చేశారు. అనంతపురంలో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అయితే ఆ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్దీన్ మీద ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచరులు దాడిచేశారని ఆరోపణలు వచ్చాయి. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిని బెదిరించారంటూ సోమవారం ఆరోపణలు వచ్చాయి. అలాగే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్ధీన్ ఈ విషయం మీద అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం, ఎమ్మెల్యే గన్‌మెన్ షేక్షా మద్యం సేవించి ఎగ్జిబిషన్ వద్ద వీరంగం సృష్టించారని ఫిర్యాదు చేశారు. పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ తనను బెదిరించారంటూ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్ధీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ‌తంలో ద‌గ్గుపాటి మీద జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అన‌వ‌స‌రంగా  రెచ్చ‌గొట్టిన ఆరోప‌ణ‌లున్నాయి. ఆ ఆడియో కాల్ తో స‌హా బ‌య‌ట ప‌డి  నానా ర‌భ‌స కింద త‌యారైంది. లోకేష్ ఆ టైంలో హెచ్చ‌రించారు కూడా. అయినా స‌రే ద‌గ్గుపాటి కి ఇలాంటి వివాదాలు ఒక ప‌రిపాటిగా  మారింది. ఇప్ప‌టికే కొలికిపూడి వంటి ఎమ్మెల్యేల‌తో అధిష్టానానికి త‌ల బొప్పి క‌డుతోంది.  తాజాగా ద‌గ్గుపాటి  కూడా త‌యార‌య్యారు. అయితే ఇవ‌న్నీ ఆధారాలుండి బ‌య‌ట ప‌డ్డ ఎమ్మెల్యే బాగోతాల‌నీ. ఇదే రాయ‌ల‌సీమ‌లో ఒక కూట‌మి  ఎంపీని కూట‌మి  ఎమ్మెల్యే లంచం డిమాండ్ చేసిన విధం రాష్ట్ర‌మంతా పాకింది. వీరే  కాదు.. మొత్తం 48 మంది ఎమ్మెల్యేల‌ను సాక్షాత్ చంద్ర‌బాబే పిలిచి వార్నింగిచ్చారు. ప‌ద్ధ‌తి మార్చుకోకుంటే క‌ష్ట‌మేన‌ని తేల్చి చెప్పారు. ఇలాంటి అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న వారు సుమారు 70 మంది వ‌ర‌కూ ఉన్న‌ట్టు కొన్ని అంచ‌నాలున్నాయి. కాబ‌ట్టి.. అధినేత చంద్ర‌బాబు వీరంద‌రిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీస్కోకుంటే క‌ష్ట‌మేన‌ని తెలుస్తోంది.

తమిళనాట కొత్త పొత్తు పొడుపు?

Publish Date:Jan 14, 2026

జననాయకన్ సినిమా విడుదల, కరూర్ తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. ఇలా తమిళనటుడు, టీవీకే అధినేత విజయ్ ను కష్టాలు ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా వెంటాడుతున్నాయి. సొంత పార్టీ ఏర్పాటు చేసి, ఈ ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమౌతున్న వేళ విజయ్ ను నాన్ స్టాప్ గా కష్టాలు వెంటాడుతున్నాయి. విజయ్ తన చివరి చిత్రంగా ప్రకటించిన జననాయకన్ సినిమా ఈ పండుగ సందర్భంగా విడుదల అయ్యే అవకాశం లేకుండా పోయింది. సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో విషయం కోర్టు మెట్లెక్కింది. దానికి తోడు  క‌రూర్  తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఇప్పటికే గంటల తరబడి విజయ్ ను విచారించిన సీబీఐ మరో మారు ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసులు పంపింది.   అయితే ఈ వేధింపుల వెనుక ఉన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయేనని పరిశీలకులు అంటున్నారు. తమిళనాట ఇసుమంతైనా స్టేక్ లేని బీజేపీ విజయ్ తో పొత్తు ద్వారా రాష్ట్రంలో పాగా వేయాలనే ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా విజయ్ ను చక్రvgధంలో ఇరికిస్తోందన్న వ్యాఖ్యలూ వినవస్తున్నాయి. ఇక విజయ్ కు కమలంలో దోస్తీకి సై అనక తప్పదన్న విశ్లేషణలూ వెలువెడ్డాయి. అయితే అనూహ్యంగా విజయ్ కు కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ మద్ద తుగా నిలిచారు.   విజ‌య్ పై  వేధింపుల‌కు పాల్ప‌డ్డం అది త‌మిళ సంప్ర‌దాయాల‌ను భంగ‌ప‌ ర‌చ‌డ‌మే  అవుతుంద‌ని రాహుల్ విమర్శించారు.  దీంతో విజయ్ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తుపొడుపునకు అవకాశాలున్నాయా అన్న చర్చకు తెరలేచింది.  ఇప్పటికే విజ‌య్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో తమ పార్టీ  ఎవరితోనూ పొత్తు లేకుండా స్వతంత్రంగానే రంగంలోకి దిగుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. త‌మ‌కు డీఎంకేతో స్థానిక రాజ‌కీయ విబేధాలుంటే, కేంద్ర‌ంలోని  బీజేపీతో సైద్ధాంతిక విబేధాలున్నాయ‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కూ డీఎంకేతో కలిసి ఉన్న కాంగ్రెస్ స‌డెన్ గా విజ‌య్ కి మద్దతుగా గళం విప్పడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాట కొత్త పొత్తు పొడుపునకు ఇది సంకేతమా అన్న చర్చా జోరుగా సాగుతోంది.  తొలి నాళ్ల‌లో త‌మిళ‌నాట‌ కాంగ్రెస్ పార్టీ బ‌లంగానే ఉన్నా.. ఆ త‌ర్వాత డీఎంకే, ఏఐడీఎంకే రూపంలో ఈ రెండు పార్టీలే ఇక్క‌డ అధికారం పాల్పంచుకుంటూ వ‌స్తున్నాయి.  కేసీఆర్ లాంటి వారికి ఈ డీఎంకే అన్నాడీఎంకే పాలసీ  ఎంతో ఇష్టం. త‌న కొడుకు కేటీఆర్, అల్లుడు హ‌రీష్ కూడా ఇలాగే రెండుగా  చీలి.. ఇక్క‌డ అధికారం ఎవ‌రో ఒక‌రు పాల్పంచుకోవాల‌ని ఆశిస్తారాయ‌న‌.  అంత‌గా తమిళనాట స్థానిక రాజ‌కీయాలు గ‌త కొన్నేళ్లుగా పాతుకుపోయాయి. ఇప్పుడు డీఎంకే త‌ర్వాతి త‌రానికి కూడా బ‌లంగా  క‌నిపిస్తున్నా అన్నాడీఏంకేకి జ‌య‌ల‌లిత త‌ర్వాత ఒక దిక్కంటూ లేక పోయింది. శ‌శిక‌ళ రూపంలో బలమైన నాయకురాలు ఉన్నా.. మోడీ  కార‌ణంగా ఆమె అన్నాడీఎంకేకీ ఏమీ కాకుండా పోయారు. ఈ  స్థానంలో ఇక్క‌డ బీజేపీ  పాతుకుపోవాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తుంటే మ‌ధ్య‌లో తమిళనాట అశేష అభిమానం సంపాదించుకున్న హీరో విజయ్.   టీవీకే పార్టీ ఏర్పాటు చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన విజయ్ అంటే బీజేపీకి ఆగ్రహం.  దానికి తోడు విజ‌య్ కూడా మెర్స‌ల్ వంటి సినిమాల ద్వారా బీజేపీ వ్య‌తిరేక వాణి వినిపించిన ప‌రిస్థితి గ‌తంలో ఉంది.  వ‌చ్చే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య్ పార్టీ టీవీకే పోటీ  చేయ‌నుండ‌టం.. బీజేపీతో ఎలాంటి  పొత్తు ఉండ‌ద‌ని విజ‌య్ ప్ర‌క‌టించ‌డంతో.. ఆయ‌న‌ను వీలైనంతగా త‌మ దారిలోకి తెచ్చుకోడానికి  బీజేపీ అగ్రనాయకత్వం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. దీనిని విజయ్ ఎలా ప్రతిఘటిస్తారు? రాహుల్ విజయ్ కు మద్దతుగా గళం విప్పడం వెనుక కారణమేంటి? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ పార్టీ ప్రభావం ఏ మేరకు ఉండనుంది?  తేలాల్సి ఉంది.

మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Publish Date:Aug 28, 2025

  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు. కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.  . రాష్ట్రీయ స్వయం సేవక్‌  సంఘ్‌ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్‌ భగవత్‌..  బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్‌ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం  .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.  నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్‌ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకుంటుందని  ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.  

మూలాల ముంగిలికి లాక్కెళ్లే పండుగ.. సంక్రాంతి..!

Publish Date:Jan 14, 2026

  పండుగ అంటే అదొక  ఆనందం.  చదువులు, వృత్తి, ఉద్యోగం, సౌకర్యాలు.. ఇలా కారణాలు ఏవైనా సరే..  పట్టణంలో ఉన్నవారు పండుగ వచ్చిందంటే చాలు పల్లె బాట పడతారు. తెలుగు వారు ఎంతో సంబరంగా చేసుకునే పండుగలలో సంక్రాంతికి ఓ రేంజ్ ఉంది.  భోగి, సంక్రాంతి, కనుమ.. పేరిట ముచ్చటగా మూడురోజులు జరిగే ఈ పండుగ వైభోగం గ్రామాలలో మాత్రమే కనిపిస్తుంది. భోగి మంటలు, భోగి పళ్లు..  పొంగళ్లు, పిండి వంటలు.. పశువుల అలంకరణ,  కోడి పందేలు.. కొత్త అల్లుళ్లకు చేసే మర్యాదలు.. ప్రేమ, అభిమానం, ఆప్యాయత.. ఒక్కటనేమిటి? సంక్రాంతి పండుగలో లేనిదంటూ ఏదీ లేదు.. భోగి మంటలు, భోగి పళ్లు.. జనవరి 13వ తేదీన భోగి పండుగ.  ఈరోజు ఉదయాన్నే చలికి సవాల్ విసురుతూ ఉదయాన్నే లేచి భోగి మంటలు వేయడం చాలా చోట్ల కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న పాత సామాను నుండి పిడకల హారం వరకు భోగి మంటలలో వేస్తారు.   ఇక ఇదే రోజు సాయంత్రం చిన్న పిల్లలకు భోగి పళ్లు పోస్తారు. ఈ భోగి పళ్లలో చెరకు ముక్కలు,  రేగు పళ్లు,  చిల్లర పైసలు, పువ్వులు ఉంటాయి.  ఇలా భోగి పళ్లు పోయడం వెనుక పురాణ కథనం ఉంది.  భోగి పండుగ రోజే బదరీ వనంలో  శ్రీహరిని పసిబిడ్డగా మార్చి దేవతలందరూ రేగుపళ్లు పోశారట.  బదరీ పళ్లనే రేగు పళ్లు అంటారు.  అందుకే కాల క్రమేణా భోగి రోజు చిన్న పిల్లలకు భోగి పళ్లు పోయడం ఆచారం అయ్యింది.  పిల్లలకు భోగి పళ్లు పోస్తే ఆ శ్రీహరి ఆశీస్సులు ఉంటాయని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. పొంగల్.. సంక్రాంతి.. మూడు రోజులు జరిగే సంక్రాంతి పండుగలో రెండవ రోజు ప్రధాన పండుగ అయిన సంక్రాంతి జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను పొంగళ్ల పండుగ అంటారు. ఈ రోజు సూర్యుడి గమనం మారుతుంది.  సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. అది కూడా మకర రాశిలోకి ప్రవేశిచడం వల్ల దీనికి మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. సంక్రాంతి రోజు పొంగళ్లు వండి నైవేద్యం పెడతారు. చాలా చోట్ల రథం ముగ్గులు వేసి సూర్యుడికి స్వాగతం చెబుతారు.  ఈ రోజు చేసే దాన ధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది.  కొత్తగా పెళ్లైన వారు ఈ పండుగను అత్తారింట్లో చేసుకోవడం, సావిత్రి గౌరీ వ్రతం చేసుకోవడం జరుగుతుంది. కనువిందు చేసే కనుమ.. సంక్రాంతి పండుగ ముఖ్యంగా రైతన్నల పండుగ. ఈ రోజు  రైతులు తమకు పంటలు పండించడంలో సహాయపడే పశువులకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. పశువులను చాలా మంది తమ కుటుంబంలో భాగంగా చూస్తారు.  పశువులకు స్నానం చేయించి అందంగా అలంకరిస్తారు. పశువులకు విశ్రాంతిని ఇస్తారు.  కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంలో  సంబరాలు చేసుకుంటారు.  కోనసీమ ప్రాంతాలలో కోడి పందెల సందడి సాగుతుంది.  కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారతాయి. కోడి పుంజుల పౌరుషాలు, వాటిలో పోరాట పటిమ ముక్కున వేలేసుకునేలా చేస్తాయి.  సంక్రాంతి పండుగంటే పల్లెలదే.. పండుగ ఆస్వాదించాలంటే పల్లెకు పోవాల్సిందే..!                           *రూపశ్రీ.
[

Health

]

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 5 అలవాట్లు..!

Publish Date:Jan 14, 2026

  ఈ రోజుల్లో చెడు జీవనశైలి,  తప్పుడు ఆహారపు అలవాట్లు  గుండె ఆరోగ్యంపై  చాలా చెడ్డ  ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాకుండా మన చిన్న చిన్న రోజువారీ అలవాట్లు గుండెకు హాని కలిగిస్తాయి.  ఇవి క్రమంగా  గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. దీనితో పాటు నేటికాలంలో అన్ని సమస్యలకు మందులు వాడటం,  ఖరీదైన చికిత్సలు తీసుకోవడం  కూడా కొన్నిసార్లు  శరీరానికి హాని కలిగిస్తాయి.  అధిక వ్యాయామం కూడా గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.  ఇలా నేటి కాలంలో చాలా కారణాలుగా గుండె జబ్బుల ప్రమాదం క్రమేపీ పెరుగుతోంది.  గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే.. కొన్ని సులభమైన,  ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించడం చాలా ముఖ్యం. ఇది శరీరానికి ఎటువంటి హాని లేకుండా  చేస్తుంది. అటువంటి 5 సులభమైన అలవాట్ల గురించి తెలుసుకుంటే.. భోజనం తర్వాత నడక.. భోజనం తర్వాత 10 నిమిషాల నడక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే కూర్చునే అలవాటును మార్చుకోవాలి.  ప్రతి భోజనం తర్వాత 10 నిమిషాల తేలికపాటి నడక చేయాలి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది,  బరువు పెరగకుండా నిరోధిస్తుంది. ఒమేగా-3 ఫ్యాట్స్.. రోజువారీ ఆహారంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉండేలా చూసుకోవాలి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె,  మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇది గుండె, మెదడు,  వాపును నియంత్రించడంలో సహాయపడుతుంది. సాల్మన్, చేపలు, అవిసె గింజలు,  వాల్‌నట్‌ల వంటి వాటి నుండి  ఒమేగా-3ని పుష్కలంగా పొందవచ్చు. నిద్ర.. మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ 7-9 గంటలు మంచి నిద్ర పొందడం ముఖ్యం. ఈ రోజుల్లో చాలా మందికి రాత్రిపూట ఫోన్ వాడటం,  టీవీ చూడటం అలవాటు కారణంగా నిద్ర సైకిల్ దారుణంగా దెబ్బతింటోంది. తక్కువ నిద్రపోవడం వల్ల ఊబకాయం, వ్యాధులు,  అలసట వంటి సమస్యలు వస్తాయి. ప్లాస్టిక్ నిషేధం.. మంచి గుండె ఆరోగ్యానికి ప్లాస్టిక్ వస్తువులను నివారించడం,  గాజు లేదా స్టీల్ కంటైనర్లు ఉపయోగించడం ముఖ్యం. ప్లాస్టిక్‌లో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి.  ఇవి హార్మోన్లకు,  శరీరానికి హాని కలిగిస్తాయి. ప్లాస్టిక్ రసాయనాలు నెమ్మదిగా శరీరంలో విషాన్ని వ్యాపింపజేస్తాయి. ఇది క్యాన్సర్,  ఇతర వ్యాధులకు కారణమవుతుంది. అందువల్ల ఆహారాన్ని నిల్వ చేయడానికి గాజు లేదా స్టీల్  పాత్రలు మంచివి. ఇవి  గుండె ఆరోగ్యానికి అలాగే మొత్తం ఆరోగ్యానికి సురక్షితమైనవి. బరువు.. మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి  బరువు,  BMI ని చూస్తే సరిపోదు. రక్త పరీక్షలపై కూడా శ్రద్ధ వహించాలి.  బరువు లేదా BMI కంటే రక్త పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. LDL, CRP,  ఫాస్టింగ్ ఇన్సులిన్ వంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించవచ్చు. గుండె జబ్బులను నివారించడానికి ఇది ఉత్తమ మార్గం. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం వల్ల సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. ఆహారం.. గుండె ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలంటే  ఆహారంలో పండ్లు,  ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలి. వాటిలో  గుండెను బలంగా,  ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఉంటాయి.  వాటిని సరిగ్గా తినకపోతే, అది గుండెకు హాని కలిగిస్తుంది. ఈ రోజుల్లో, చాలా మంది ఏదో ఒక విషయం గురించి ఒత్తిడి తీసుకోవడం చాలా సహజం అయిపోయింది. ఇది గుండెపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.                                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..