ఢిల్లీకి పోనూ పొయ్యారు రానూ వచ్చారు!

 

“ ఏదో ఒకటి చేయాలి.. ఏం చేయాలో అర్థం కావడంలేదు.. అటు జనంలో నమ్మకంపోతోంది... ఇటు అధిష్ఠానం మాట వినట్లేదు.. తెలంగాణ ఎంపీలు ఏం చేసినా చేయకపోయినా కాస్త గట్టిగా నోరన్నా చేసుకుంటున్నారు.. మాకు ఆ అవకాశంకూడా లేదు.. పరిస్థితి ముందునుయ్యీ వెనక గొయ్యిలా ఉంది..“ ఇది.. తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల అంతర్మథనం. తెలంగాణ వాదులనుంచి పెద్ద ఎత్తున పెల్లుబికుతున్న వ్యతిరేకతను తట్టుకోవాలంటే ఏదో ఒకటి చేసితీరాలని తెలంగాణ మంత్రులు గట్టిగా నిర్ణయించుకున్నారు. జానా రెడ్డి ఆధ్వర్యంలో ఓ బృందం హస్తినలో చక్రం తిప్పే ప్రయత్నం చేసింది కానీ.. అధిష్ఠానం పెద్దలనుంచి రెస్పాన్స్ పూర్తిగా కరువైంది. ఓ దశలో అప్పాయింట్ మెంట్ దొరకడంకూడా కష్టమయ్యింది. ఏదో ఒకటి దొరికిందిలే అనుకుని చేతులు కట్టుకుని గడగడా ఎక్కాలు అప్పజెప్పినట్టు చెప్పదలుచుకున్న విషయాన్ని కక్కేసి బైటపడ్డ తెలంగాణ మంత్రులు.. తాము ఢిల్లీకి చేరిన కార్యక్రమం పూర్తయ్యిందనిపించారు. తీరా.. మేడమ్ నుంచొచ్చిన స్పందన ఏంటంటే.. పాడిందే పాడరా పాచిపళ్ల దాసుడా అన్నట్టు మళ్లీ మళ్లీ చెప్పిందే చెప్పి రకరకాలుగా చెప్పి ఎందుకయ్యా విసిగిస్తారు.. అన్న ధోరణిలో ఓ ఎక్స్ ప్రెషన్.. చివరికి తెలంగాణ మంత్రుల పరిస్థితి సింగడు అద్దంకిపోనూ పొయ్యాడు రానూ వచ్చాడు.. అన్నట్టుగా ఉందన్న విషయాన్ని మొత్తం తెలంగాణ ప్రజలంతా గ్రహించారన్న విషయంకూడా వాళ్లకు తెలుస్తూనే ఉంది.. కానీ.. ఏం చేయలేని పరిస్థితి... కాలం అలా ఉంది.. ఏం చేస్తారు మరి..

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.