దమ్మాలపాటి కేసులో సంచలనం.. పిటిషన్ ను వెనక్కి తీసుకున్న ఏపీ సర్కార్
posted on Jul 22, 2021 @ 3:07PM
ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ లో సంచలన మలుపు తిరిగింది. దమ్మాలపాటి శ్రీనివాస్ పై గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను జగన్ రెడ్డి సర్కార్ వెనక్కి తీసుకుంది. అమరావతిలో అసలు ఇన్ సైడర్ ట్రేడింగే జరగలేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
అమరావతిలో రాజధాని వస్తుందన్న ముందస్తు సమాచారంతో దమ్మాలపాటి శ్రీనివాస్ ముందే భూములు కొనుగోలు చేశారని వైసీపీ సర్కారు ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో దమ్మాలపాటి కూడా భాగస్వామేనని చెబుతోంది. దీనిపై ఏసీబీ విచారణ షురూ చేయగా, దమ్మాలపాటి హైకోర్టుకు వెళ్లారు. దాంతో హైకోర్టు ఏసీబీ దర్యాప్తుపై స్టే ఇచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే ఇన్ సైడర్ ట్రేడింగ్ పై హైకోర్టును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా, అక్కడా చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో దమ్మాలపాటిపై తాము దాఖలు చేసిన పిటిషన్ ను ఉపసంహరించుకుంటున్నట్టు ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు.
ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించిన వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టులో విచారణ ఇంకా పెండింగ్ లో ఉంది. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలియజేశారు. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాల్సి ఉందని వెల్లడించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం... నాలుగు వారాల్లో దీనికి సంబంధించిన విచారణ పూర్తి కావాలని హైకోర్టుకు స్పష్టం చేసింది.