మోడీ టీంలో రైల్వే మంత్రి వెరీ వెరీ స్పెషల్..
posted on Jul 9, 2021 @ 12:04PM
ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గ విస్తరణ మాములుగా జరగలేదు. కొవిడ్ పెట్టిన పరీక్షను ప్రామాణికంగా తీసుకుని, భవిష్యత్ సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కునే శక్తివంతమైన యువ మేధావి బృందాన్ని ప్రధాని సిద్దం చేసుకున్నారు. నిజమే, మంత్రివర్గ విస్తరణలో రాజకీయ కోణ ముంది. ఎన్నికల అవసరాలలున్నాయి. అ అన్నిటితో పాటుగా దేశ అవసరాలకు కూడా ప్రధాని పెద్ద పీట వేశారనే, అభిప్రాయం రాజకీయ మేధావి వార్గాల్లో వ్యక్తమవుతోంది. పోస్ట్ కొవిడ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, విద్యావంతులకు ప్రధాని ప్రాధాన్యత ఇచ్చారని, జాతీయమీడియాలో చర్చ మొదలైంది.
ఉదాహరణకు, నూతన మంత్రివర్గంలో కీలకమైన రైల్వే, ఐటి శాఖలను, ఆయన ఎవరో ఎవరికీ తెలియని అశ్వని వైష్ణవకు అప్పగించారు.ఈయన ఒడిశాకు చెందిన మాజీ ఐఎఎస్ అధికారి. అయితే, ఈ అశ్వని వైష్ణవ ఎవరు?ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఇంత కీలకమైన శాఖలను, అనుభవం లేని ఆయనకు ఎలా అప్పగించారు? ఇప్పుడు ఇదే ఇటు రాజకీయ వర్గాల్లో అటు అధికార పాలనా వర్గాలలో జరుగతున్న చర్చ.ఆయనకు పరిపాలనా అనుభవమే కాదు, ప్రత్యక్ష రాజకీయ అనుభవం కూడా లేదు. రెండేళ్ళ క్రితమే, 2019లో ఆయన రాజ్య సభకు ఎన్నికయ్యారు.
ఆయన రాజ్యసభ ఎన్నిక కూడా భలే గమ్మత్తుగా, నమ్మశక్యం కానీ విధంగా నాటకీయంగా జరిగింది. ఒడిసా నుంచి ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాలను గెలుచుకోగల బలం అధికార బీజేడీకి వుంది. ఆ పార్టీ ముగ్గురు సభ్యుల పేర్లను ప్రకటిచింది. బీజేడీ ప్రకటించిన జాబితాలో మన అశ్వనీ వైష్ణవ పేరు కూడా ఉంది. కానీ అరగంటలోనే, ఆయన బీజేడీ అభ్యర్థి కాదు, తమ పార్టీ అభ్యర్థి అంటూ బీజేపీ ప్రకటించుకుంది.. నిజానికి, తమ అభ్యర్ధిని గెలిపించుకునే బలం బీజేపీకి లేదు. బీజేడీ, బీజేపీ మిత్ర పక్షమా అంటే అది కూడా కాదు. నిజానికి ఒడిసాలో కాంగ్రెస్ కాలం చేసిన తర్వాత బీజేడీకిబీజేపీనే ప్రధాన ప్రతిపక్షం. అయినా,, ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి కోరడంతో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, బీజేపీ తమ అభ్యర్ధిగా ప్రకటించుకున్న అశ్వనీ వైష్ణవ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అలా ఆయన బహుశా దేశ చరిత్రలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో రాజ్య సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ప్రధాని నరేందర్ మోడీ ప్రభుత్వం రైల్వే రంగంలో కీలక సంస్కరణలు తీసుకు రావాలని, ప్రైవేట్ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని గత ఏడేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈక్రమంలో ముగ్గురు మంత్రులు మారారు. అయినా ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రధాని మోడీ అన్వేషణ అక్కడ మొదలైంది . అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన కార్యాలయంలో డిప్యూటీ కార్యదర్శిగా పనిచేసిన వైష్ణవ్ తెరపై కొచ్చారు. ఆయనకు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం విభాగంలో విజయవంతంగా పనిచేశారని పేరుంది. ఆ తర్వాత ఆయన ఎంబిఎ కూడా చేశారు. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలలో, ప్రైవేట్ సంస్థలో పనిచేయడమే గాక, సొంతంగా పరిశ్రమలు నెలకొల్పారు.
ప్రచారానికి దూరంగా లక్ష్యాల మేరకు కష్టపడి పనిచేస్తారనే పేరుంది. ఈ లక్షణాలే ఆయనను ప్రధాని దృష్టికి ఆకట్టుకొనేటట్లు చేసిన్నట్లు కనిపిస్తున్నది. వాజపేయి ప్రధాన మంత్రి పదవి నుండి వైదొలగిన తర్వాత ఆయన వద్ద ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయనకు బీజేపీ సీనియర్ నేతలతో పరిచయాలు ఏర్పడ్డాయి. ప్రధాని మోడీ కొత్త బృందంలో అత్యున్నత విద్యార్హతలు గల మంత్రి కూడా ఈయనే. 1970 లో జోధ్పూర్లో జన్మించిన వైష్ణవ్ ఇప్పుడు జై నరైన్ వ్యాస్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ (ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్) లో బాచిలర్స్ డిగ్రీలో బంగారు పతకాన్ని సాధించాడు. వైష్ణవ్ 1994 లో ఐఐటి కాన్పూర్ నుండి పారిశ్రామిక నిర్వహణలో ఎం. టెక్ పట్టా పొందారు.
అతని వెబ్సైట్ ప్రకారం, ఐఐటిలో క్లాస్ టాపర్. అదే సంవత్సరం, సివిల్ సర్వీసెస్ పరీక్షలో వైష్ణవ్ ఎంపికయ్యాడు. యుపిఎస్సి పరీక్షలో 27 వ ర్యాంకు సాధించిన ఆయన ఒడిశా క్యాడర్లో చేరి ఐఎఎస్ను ఎంచుకున్నారు. ఆయనను సుందర్ఘర్, బాలసోర్, కటక్ జిల్లాల్లో పోస్ట్ చేశారు. అక్టోబర్-నవంబర్ 1999 లో ఒడిశాను తాకిన ‘సూపర్ సైక్లోన్’ సమయంలో వైష్ణవ్ చాలా చురుగ్గా పనిచేశారు. ప్రశంసలు అందుకున్నారు. . యుఎస్ నేవీ వెబ్సైట్ నుండి తుఫాను పథం గురించి సమాచారాన్ని సేకరించిన ఘనత వైష్ణవ్కు ఉంది. దానిని ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి పంపాడు. మరణాల సంఖ్యను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అతని సమాచారం సహాయపడింది.
మాజీ ప్రధానమంత్రి వాజపేయి కార్యాలయంలో డిప్యూటీ కార్యదర్శిగా కేంద్ర సర్వీస్ లకు డెప్యూటేషన్ పై వెళ్లెవరకూ 2003 వరకు ఒడిశాలో కొనసాగారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ స్కూల్లో ఎంబీఏ కోర్స్ లో చేరడానికి 2008 లో వైష్ణవ్ ప్రభుత్వానికి రాజీనామా చేశారు. అక్కడ ఆయన ఫైనాన్స్, స్ట్రాటజీ కోర్సులపై దృష్టి పెట్టారు. ఆయన వెబ్సైట్ ప్రకారం, వైష్ణవ్ దక్షిణ ఆసియా కోసం జిఇ ట్రాన్స్పోర్టేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా, ఆపై సిమెన్స్లో పట్టణ మౌలిక సదుపాయాల వ్యూహానికి అధిపతిగా పనిచేశారు. ఆ తర్వాత ఆటో కాంపోనెంట్స్ పరిశ్రమపై దృష్టి పెట్టడానికి తనంతట తానుగా వెంచర్ చేయాలని నిర్ణయించుకున్నారు. గుజరాత్లో సుజుకి, హోండా, హీరోలకు సేవలను అందించే నాలుగు భాగాలను వైష్ణవ ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు భారతీయ రైల్వేలో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఏ విధంగా పట్టాలు ఎక్కిస్తారు. ఏ విధంగా లాభాల వెంట పరుగులు తీయిస్తారు అనేది చూడవలసి వుంది.