చిన్నమ్మకు బిగ్ షాక్.. 100 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్
posted on Sep 8, 2021 @ 5:16PM
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి, అన్నాడీఎంకే మాజీ నేత శశికళకు మరో షాక్ తగిలింది. తమిళనాడు చిన్నమ్మకు చెందిన రూ.100 కోట్ల ఆస్తులను బినామీ చట్టం కింద ఆదాయపన్ను శాఖ జప్తు చేసింది. బినామీ చట్టం కింద శశికళ ఆస్తులను ఐటీ శాఖ సీజ్ చేసింది. పనయూర్లో శశికళకు చెందిన 49 ఎకరాల భూమి అటాచ్మెంట్ చేసింది. రూ.100 కోట్ల విలువైన భూమిని అటాచ్ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రకటించారు. శశికళకు ఐటీ శాఖ వరుసగా షాక్లు ఇస్తోంది. కొద్దిరోజుల క్రితమే ఆమెకు పన్ను మినహాయింపు వర్తించదని ఝలక్ ఇచ్చింది. తాజాగా ఐటీ డిపాజిట్ ఆస్తుల నిరోధక చట్టం కింద శశికళ ఆస్తులను జప్తు చేసింది.
ఇప్పటికే శశికళకు చెందిన రూ.2000 కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ ఇప్పటికే జప్తు చేసింది. జైలు శిక్ష పడిన వ్యక్తికి ఐటీ బకాయిల్లో మినహాయింపు వర్తించదని ఐటీ వర్గాలు కోర్టుకు స్పష్టం చేశాయి. 2008లో ఏసీబీ సమర్పించిన నివేదిక మేరకు ఆస్తులకు సంబంధించి రూ. 48 లక్షలు పన్ను చెల్లించాలని ఐటీ వర్గాలు చిన్నమ్మను ఆదేశించాయి. దీనిని వ్యతిరేకిస్తూ ఐటీ ట్రిబ్యునల్ను శశికళ ఆశ్రయించారు. ఆ పన్ను చెల్లింపు నుంచి గట్టెక్కారు. అయితే, ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ ఐటీ వర్గాలు హైకోర్టుకు అప్పీలుకు వెళ్లాయి. బినామీ చట్టం కింద శశికళకు చెందిన చాలా ఆస్తులను ఆదాయపు పన్నుశాఖ సీజ్ చేసింది.
చెన్నైలో జయలలిత పోయెస్ గార్డెన్ నివాసం ఎదుట శశికళ నిర్మించిన విలాసవంతమైన భవనాన్ని కూడా ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. మన్నార్గుడితో పాటు పలు ప్రాంతాల్లో ఆమె కొన్న విలువైన ఆస్తులను కూడా స్వాథీనం చేసుకున్నారు. శశికళతో పాటు ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్ ఆస్తులను కూడా ఐటీ శాఖ సీజ్ చేసింది. అక్రమ ఆస్తుల కేసులో జైలుశిక్ష అనుభవించిన శశికళ బెంగళూర్ జైలు నుంచి విడుదలయ్యారు. తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పాలని ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అన్నాడీఎంకే వర్గాలు శశికళను దగ్గరకు రానివ్వడం లేదు.