అసైన్డ్, అటవీ భూములకు పాస్ బుక్కులు! వైసీపీ ఎమ్మెల్యే కబ్జాలో వేల ఎకరాలు?
posted on Oct 30, 2021 8:39AM
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక అవినీతి, అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతలు దేన్ని వదలకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. అధికారులతో కుమ్మకై... లేదంటే వాళ్లను బెదిరించి తమ ఇష్టం వచ్చినట్లుగా అరాచకాలకు పాల్పడుతూ.. కోట్లాది రూపాయల కుంభకోణాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేకు చెందిన అక్రమ బాగోతాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు టీడీపీ నేత. ఎమ్మెల్యే అక్రమాలు చూసి అంతా షాకవుతున్నారు.
గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గ పరిధిలోనూ ఓ భారీ భూ దందాను వెలికి తీశారు వినుకొండ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు. 2019 ఎన్నికల్లో వినుకొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా బొల్లా బ్రహ్మనాయుడు విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వమే రావడంతో ఆయన అక్రమాలకు తెర తీశారని జీవీ ఆరోపించారు. బొల్లాపల్లిలోని భూములను కేంద్రంగా చేసుకుని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భారీ అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. టీడీపీ నేత జీవీ చెప్పిన వివరాలు ప్రకారం... బొల్లాపల్లిలోని అసైన్డ్ భూములకు కూడా ఎమ్మెల్యే పాస్ బుక్కులు ఇప్పించేశారు. స్థానిక తహశీల్దార్ను అడ్డం పెట్టుకుని ఈ దందాను నడిపించారు. ఒక్కో పాస్ పుస్తకానికి రూ.10 వేల చొప్పున ఏకంగా 7 వేలకు పైగా పాస్ బుక్కులు ఇప్పించేశారు. ఇలా పాస్ బుక్కుల మీదకు ఎక్కిన భూముల్లో చుక్కల భూములు, పోరంబోకు భూములు, ప్రభుత్వ భూములు ఉన్నాయి.
పాస్ బుక్కులు ఇప్పించడమే కాదు.. ఈ భూములను తర్వాత తనకు కావలసిన వారి పేర్లపైకి మార్చేసి వాటికి పాస్ బుక్కులు కూడా ఎమ్మెల్యే బోల్లా బ్రహ్మ నాయుడు ఇప్పించేశారని జీవీ తెలిపారు. ఇవే పాస్ బుక్కులను బ్యాంకుల్లో పెట్టి రుణాలు కూడా ఇప్పించేశారట. ఈ రుణాల్లో మెజారిటీ భాగాన్ని బొల్లా తన జేబుల్లో వేసుకున్నారని జీవీ ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంలో బొల్లా బ్రహ్మనాయుడు దాదాపు 10 కోట్ల రూపాయలు స్వాహా చేశారని చెబుతున్నారు.ఆ పని పూర్తి కాగానే.. బొల్లాపల్లి పరిధిలోని అటవీ భూములకు కూడా బొల్లా పాస్ పుస్తకాలు ఇప్పించేసుకున్నారట. ఇవే భూములను కేంద్రంగా చేసుకుని విపక్షంలో ఉండగా.. ఈ భూములన్నింటినీ పేదలకు హక్కు పత్రాలు ఇప్పిస్తామని బొల్లా చెప్పిన వైనాన్ని గుర్తు చేస్తూ జీవీ ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసైన్డ్ భూములను ఆసరా చేసుకుని అధికార యంత్రాంగాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాల్పడిన అవినీతి దందాపై సీబీఐ చేత విచారణ చేయించాలని జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. బొల్లా అవినీతి దందాకు సంబంధించి ఆధారాలను జీవీ ఆంజనేయులు మీడియా సమావేశంలో బయటపెట్టారు. సీబీఐ దర్యాప్తు జరిగితే బొల్లాకు సంబంధించిన మరిన్ని మేర అక్రమాలు వెలుగు చూసే అవకాశాలున్నాయన్నారు. అసైన్డ్ భూములను పేదలకు కాకుండా తనకు అనుకూలంగా ఉన్న వారి పేరిట రాయించుకున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బొల్లాపల్లి లో తిరిగే పరిస్థితి లేదని జీవీ హెచ్చరించారు.పేద రైతుల దగ్గర పాసు పుస్తకాలకు వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఎమ్మెల్యే బొల్లాను చొక్కా ఊడదీసి కొడతారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో సెంటు భూమి ఇచ్చి పేదలను దగా వైసీపీ చేశారని జీవీ విమర్శించారు. ఈ భూ పంపిణీలో కూడా ఎమ్మెల్యే బొల్లా రూ.18 కోట్లు కాజేశారని సంచలన ఆరోపణలు చేశారు. బొల్లాపల్లి భూ అక్రమాలపై ఎమ్మెల్యే బొల్లా పై ఎమ్మార్వో, రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. మొత్తంగా బొల్లా బ్రహ్మనాయుడు అవినీతి దందాను జీవీ వెలుగులోకి తీసుకుని వచ్చిన నేపథ్యంలో వినుకొండలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.