సీఎస్ జవహర్ రెడ్డి సేఫేనా?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రోజు, ఆ తరువాత యథేచ్ఛగా సాగిన హింసాకాండకు సంబంధించి కొందరు పోలీసు అధికారులు, కలెక్టర్లపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. పల్నాడు కలెక్టర్ ను బదిలీ చేసింది. పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. వారందరిపై కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఇందు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ను నియమించి 48 గంటల లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకోవడానికి వీలుగా నివేదికలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డి. ఆయన నివేదిక ఆధారంగానే కేంద్ర ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది.  అయితే అధికారులపై నెపం నెట్టేసి జవహర్ రెడ్డి సేఫ్ గేమ్ ఆడి తప్పించుకున్నారా, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో సర్వం సీఎస్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. అటువంటి సీఎస్ కు రాష్ట్రంలో జరిగిన సంఘటనలకు సంబంధించి బాధ్యత ఉండదా?  అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అసలు ఏపీలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన క్షణం నుంచీ అధికార యంత్రాంగం అంతా అధికార పార్టీ సేవలో తరించడానికే పరిమితమైందన్న ఆరోపణలు ఉన్నాయి. సామాజిక పెన్షన్ల పంపిణీ విషయంలో ఎన్నికల సంఘం ఆదేశాలను సైతం బుట్టదాఖలు చేసి సీఎస్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు విపక్ష తెలుగుదేశం కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ముందు నుంచీ సీఎస్ వ్యవహారశైలిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే ఏపీలో ఎన్నికల ప్రక్రియ అపహాస్యం పాలయ్యేలా జరిగిన సంఘటనలకు సీఎస్ బాధ్యుడు కాడా అని ప్రశ్నిస్తున్నారు.  జగన్ కు మేలు చేయడమే లక్ష్యంగా ఆయన ప్రతి అడుగూ ఉందని సామాన్య జనం కూడా బాహాటంగానే చర్చింకుకుంటున్న పరిస్థితి.   ఇప్పుడు కూడా ఎన్నికల అనంతర హింస విషయంలో సీఎస్ పై ఈసీ చర్య తీసుకుంటుందా లేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈసీ  ఆదేశాలను అమలు చేయాల్సిన సీఎస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చు కునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఆయన సీఎస్ గా ఉండగా  ఓట్ల లెక్కింపు  జరిగితే  అది సక్రమంగా జరుగుతుందన్న నమ్మకం లేదని విపక్ష తెలుగుదేశం కూటమే కాదు, సామాన్య ప్రజలు కూడా అంటున్న పరిస్థితి. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఏం చర్యలు తీసుకుటుందో చూడాల్సి ఉంది. 

Teluguone gnews banner