ఏపీ ఎన్నికల హింసపై ఈసీ సీరియస్.. బదలీ వేట్లు.. సస్పెన్షన్లు
posted on May 17, 2024 9:22AM
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఏపీ సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిపించుకుని మరీ వివరణ కోరింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానం కావడానికి బాధ్యులెవరని నిలదీసింది. హింస ప్రజ్వరిల్లిన పల్నాడు ఎస్పీపై బదిలీ వేటు వేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. అలాగే పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసింది. తిరుపతి ఎస్పీని బదిలీ చేసింది. వీరిపై కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.
మొత్తంగా ఎన్నికల సంఘం ఏపీలో పరిస్థితులపై ఆలస్యంగానైనా స్పందించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో మొత్తం 12 మంది పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. అంతే కాకుండా ఈ విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసింది. హింసాత్మక ఘటనలపై 48 గంటలలోగా నివేదిక ఇవ్వాలని, ఇపీసీ సెక్షన్ల ప్రకారం ఎఫ్ ఐఆర్ అప్డేట్ చేయాలనీ ఆదేశాలు జారీ చేసింది.
అంతే కాకుండా ఏపీలో కౌంటింగ్ ముగిసిన పదిహేను రోజుల వరకూ రాష్ట్రంలో పాతిక కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను కొనసాగించాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రోజునూ, ఆ తరువాత కూడా జరిగిన హింసాత్మక ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. పక్కా ప్రణాళిక ప్రకారం అధికార వైసీపీ మూకలు దాడులకు తెగబడుతుంటే పోలీసులు చోద్యం చూశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. విపక్ష కూటమి అభ్యర్థులపై హత్యాయత్నాలకు పాల్పడేందుకు కూడా వైసీపీ మూకలు వెనుకాడలేదంటే రాష్ట్రంలో పోలీసుల వైఫల్యం ప్రస్ఫుటంగా కళ్లకుకట్టింది. పోలింగ్ ముగిసి నాలుగు రోజులు గడిచినా ఇప్పటికీ పరిస్థితులు అదుపులోకి రాలేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈసీ కన్నెర్ర చేసింది.
ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం రాష్ట్రంలో ప్రతీకార దాడులకు ఆస్కారం ఉందంటూ ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీఎస్పీ బలగాలను పంపుతామనీ, అవసరాన్ని బట్టి కేంద్ర సాయుధ బలగాలనూ మోహరించాల్సి ఉంటుందని ఇంటెలిజెన్స్ విభాగం సూచించింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అవసమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొంది.