ఏపీ ఐపీఎస్ల రీకాల్!.. వైసీపీకి వంతపాడే ఖాకీలపై కేంద్రం యాక్షన్!
posted on Dec 24, 2021 @ 11:14AM
బెంగాల్లో జరిగినట్టే ఏపీలోనూ జరగనుందా? ప్రభుత్వానికి తొత్తులుగా మారే పోలీస్ ఉన్నతాధికారులను కేంద్రం రీకాల్ చేయనుందా? చట్టం, కోర్టుల మాటలు వినకుండా పాలకులకు అనుగుణంగా వ్యవహరించే ఐపీఎస్లను వెనక్కి రప్పిస్తుందా? బెంగాల్లో సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చినట్టే.. ఏపీ సీఎం జగన్కు కేంద్రం షాక్ ఇవ్వబోతోందా? అంటే అవుననే అంటున్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేశ్. ఏపీ పోలీస్ వ్యవస్థను కేంద్రం ప్రక్షాళన చేస్తోందని స్పష్టం చేశారు.
ఏపీ పోలీస్ వ్యవస్థపై కేంద్రం టెలీస్కోపుతో చూస్తోందని, త్వరలోనే ఏపీలో పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కేంద్రం చర్యలు తీసుకోబోతోందని సీఎం రమేశ్ తెలిపారు. నిబంధనల ప్రకారం పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు వ్యవహరించడం లేదని ప్రశ్నించారు. పార్టీలు అధికారంలోకి వస్తాయి.. పోతాయి.. వ్యవస్థలు ముఖ్యం అనే విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు గుర్తుంచుకోవాలని బీజేపీ ఎంపీ హితవు పలికారు.
పోలీస్ ఉన్నతాధికారుల తీరు సరిగా లేదని.. అవసరమైతే కేంద్రం కొందరు ఐపీఎస్ అధికారులను రీ కాల్ చేస్తుందని సీఎం రమేశ్ అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారుల విషయంలో కేంద్రం ఏ విధంగా వ్యవహరించిందో చూశామన్నారు. ఏపీలో కూడా అలాంటి పరిస్థితులే వచ్చాయన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే కేంద్రం జోక్యం చేసుకునేలా రాజ్యాంగమే వెసులుబాటు కల్పించిందని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు.. అవినీతి కార్యక్రమాలపై ఈ నెల 28న బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోందని అన్నారు. తొలిసారి సీఎం అయ్యారు కాబట్టి.. నెమ్మదిగా అర్ధం చేసుకుంటారని బీజేపీ ఇన్నాళ్లూ వేచి చూసిందని.. అయితే ఏపీ ప్రభుత్వం విధ్వంసకర విధానాన్ని అవలంభిస్తోందని విమర్శించారు.
సినిమా రేట్లపై ఈ ప్రభుత్వానికి ఉన్న ఇంటరెస్ట్.. ప్రజా సమస్యలపై ఎందుకు లేదని నిలదీశారు సీఎం రమేశ్. సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపుపై థియేటర్ యజమానులు కోర్టుకెళ్తే.. హాళ్లను సీజ్ చేయిస్తారా..? అని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో టిక్కెట్ ధరలు ఎంతున్నాయి..? ఎవరినో దృష్టిలో పెట్టుకుని సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తారా..? అని ప్రశ్నించారు.
మద్యం ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దశలవారీ మద్య నిషేధం కాదని.. దశలవారీ మద్యపాన వినియోగాన్ని జగన్ ప్రభుత్వం ప్రొత్సహిస్తోందని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మండిపడ్డారు. ఏపీలో జరిగే ప్రతీ కార్యక్రమం కేంద్ర నిధులతోనే చేస్తున్నారని తెలిపారు. గ్రామ సచివాలయాల నిర్మాణం కూడా కేంద్ర నిధులతోనే చేపట్టారన్నారు.