హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఖర్చు రూ.700 కోట్లు?
posted on Jul 27, 2021 @ 4:15PM
హుజురాబాద్ తెలంగాణ రాజకీయాలకు కేంద్రంగా మారింది. ఉప ఎన్నికకు ఇంకా షెడ్యూల్ రాకున్నా నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగిపోతోంది. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ నేతలు అభివృద్ధి కార్యక్రమాల పేరుతో గ్రామాల్లో తిరుగుతున్నారు. ఎవరూ ఏం అడిగినా వెంటనే సాంక్షన్ చేసేస్తున్నారు మంత్రులు. ఎంతో కాలంగా చెబుతున్నా పట్టించుకోని నేతులు.. ఆఘమేఘాల మీద పనులు మొదలు పెడుతున్నారు.
హుజురాబాద్ లో ఎలాగైనా గెలిచేందుకు పావులు కదుపుతున్న అధికార పార్టీ.. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే దళిత బంధును హుజురాబాద్ నుంచి మొదలుపెడతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆ ఒక్క పథకానికే 12 వందల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇదికాకుండా కుల సంఘాలకు, యువజన సంఘాలకు భారీగా తాయిలాలు ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు.
హుజురాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రూ. 300 కోట్లు ఖర్చు చేసిందని, మరో రూ. 400 కోట్ల ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయంటూ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఆరోపించారు. ఈ మేరకు భారత ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు. హుజూరాబాద్లో జరుగుతున్న ఈ వ్యవహారాలను నియంత్రించడంతో పాటు వెంటనే ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని కోరారు. టీఆర్ఎస్ ఖర్చు చేస్తున్న డబ్బులపై నిఘా పెట్టాలని, పార్టీ నాయకులకు సన్నిహితంగా ఉన్న ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్ కంపెనీలు, ఇరిగేషన్ కాంట్రాక్టర్లు, ప్రధానమైన రియాల్టర్లపై దృష్టి సారించాలని గొనే ప్రకాష్ రావు కోరారు. టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, పోలీసుల సాయంతో కేసులు బనాయిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.
నిఘా వర్గాలను రంగంలోకి దింపి ఈటల రాజేందర్తో పాటు ఇతర పార్టీల్లో తిరుగుతున్న యువతను గుర్తించి రాత్రి వేళల్లో వారి తల్లిదండ్రులకు హెచ్చరికలు చేస్తున్నారని గోనే ప్రకాశ్ రావు ఆరోపించారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో కేంద్ర పారామిలిటరీ బలగాలను దింపాలని కేంద్ర ఎన్నికల కమిషన్ను గోనే ప్రకాష రావు అభ్యర్థించారు. బోగస్ ఓట్లు కూడా నమోదయ్యాయని వాటిని తొలగించేందుకు కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తరువాత హుజురాబాద్లో పనిచేస్తున్న అధికార యంత్రాంగాన్ని బదిలీ చేసి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన వారికి పోస్టింగ్ ఇచ్చారన్నారు. వివిధ శాఖల ద్వారా వ్యాపారులను కూడా బెదిరిస్తున్నారని చెప్పారు.
ఇక్కడ తిరుగుతున్న మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులపై కూడా నిఘా పెట్టాలని లేఖలో కోరారు గోనే ప్రకాష్ రావు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని, ఓటింగ్ ప్రక్రియను ఎగతాలి చేసే చర్యలకు పూనుకుంటున్నారని గోనె ప్రకాష్ రావు సీఈసీకి రాసిన లేఖలో వివరించారు. దేశ చరిత్రలోనే హుజురాబాద్ ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మారాయని గొనే ప్రకాష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఎన్నికలను నిర్వహించేందుకు చొరవ చూపాలని ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను కోరారు.