బీజేపీ అపర చాణిక్యం! బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ ఖాతాలోకే!

ఉత్తరాదిలో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చే పరిస్థితి వున్నా, తెలంగాణలో మాత్రం ఆ పార్టీ తొమ్మిది స్థానాలు గెల‌వ‌బోతోంది. ఏపీలో జగన్ వచ్చినా, చంద్రబాబు వచ్చినా బీజేపీకి ప్రమాదం లేదు కానీ, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పట్టు సాధించడానికి వ్యూహాత్మ‌కంగా ఎత్తుగ‌డ‌లు వేసింది. సికింద్రాబాద్ సీటును ప‌ణంగా పెట్టి మొత్తం తెలంగాణాలో ఓట్ల‌ను త‌నకు అనుకూలంగా మ‌లచుకుంది. ఎంఐఎం సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండ‌ని పిలుపునివ్వ‌డంతో తెలంగాణా వ్యాప్తంగా హిందు ఓట‌ర్ల‌పై ప్ర‌భావం ప‌డి బీఆర్ ఎస్ ఓట్లు బీజేపీకి మ‌ళ్ళాయి. తెలంగాణాలో కాషాయ‌పార్టీకి బాగానే కలిసొచ్చింది. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి భారీ ఎత్తునే ప‌డ్డాయి.
 
గ్రౌండ్ లెవెల్లో 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్ని చూసిన‌ట్లైతే.... బీజేపీ 9, కాంగ్రెస్ 7, ఎంఐఎం 1.
1. ఆదిలాబాద్ః  కాంగ్రెస్ - బీజేపీ మ‌ధ్యే ఫైట్ క‌నిపిస్తోంది. అయినా బీజేపీకే ఎడ్జ్ వుంది.  మంత్రి సీత‌క్క బాగా వ‌ర్క్ చేశారు. పోల్ మేనేజ్‌మెంట్ బాగా చేశారు. బీజేపీకి గ‌ట్టి పోటీ ఇచ్చినా,  భైంసా, ఆదిలాబాద్ హిందుత్వ ఓటు బ్యాంక్ తో పాటు, ఈ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో 4 గురు బీజేపీ ఎమ్మెల్యేలు వున్నారు. దీంతో బీజేపీ విజ‌యావ‌కాశాలు పెరిగాయి. ప్ర‌ధాన పోటీ  బీజేపీ - కాంగ్రెస్ మ‌ధ్య వున్న‌ప్ప‌ట్టికీ ఇక్క‌డ బీజేపీకే గెలుపు అవ‌కాశాలున్నాయి.  

2. నిజామాబాద్ః బీజేపీకే ఎడ్జ్ క‌నిపిస్తోంది. హిందుత్వ ఎజెండే ప‌ని చేసింది. బీజేపీ అభ్య‌ర్థి అర‌వింద్ ఇమేజ్ తో పాటు ఆయ‌న ప్ర‌సంగాలు,  డైలాగ్స్ ఓట‌ర్ల‌ను బాగానే ఆక‌ట్టుకున్నాయి. పైగా ఇక్క‌డి నుంచి ఇద్ద‌రు ఎమ్మెల్యేలు బీజేపీకి వుండ‌టంతో అర‌వింద్‌కు బాగా క‌లిసి వ‌చ్చింది. పోటీ బీజేపీ - కాంగ్రెస్ మ‌ధ్య ఉన్నా బీజేపీకీ గెలుపు అవ‌కాశాలున్నాయి. 

3. క‌రీంన‌గ‌ర్ః బీజేపీకే ఎడ్జ్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. బండి సంజ‌య్‌కి సానుభూతి వ‌చ్చింది. ఆయ‌న స్వంత ఇమేజ్‌తో పాటు, మైనార్టీ ఓట్లు కూడా ప‌డ్డాయి. ఇక్క‌డ పోటీ బీజేపీ - బీఆర్ ఎస్ మ‌ధ్య ఉంది. కాంగ్రెస్ డ‌మ్మీ అభ్య‌ర్థి.  ఇక్క‌డ బీఆర్ ఎస్ అభ్య‌ర్థి కూడా చేతులెత్తేశారు. కాబ‌ట్టి బీజేపీ గెలుపు ఖాయ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. 

4. పెద్ద‌ప‌ల్లిః 7 గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. మంత్రి శ్రీధ‌ర్ బాబు ఇంఛార్జ్ గా ప‌ని చేశారు.  బీజీపీ వీక్ అయినా బాగా పుంజుకుంది. పోల్ మేనేజ్‌మెంట్ స‌రిగా చేయ‌లేదు కాంగ్రెస్‌. దీంతో బీజేపీకి బాగా ప్ల‌స్ అయింది. మోడీ వేవ్ వుండ‌టంతో రెండు పార్టీల మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ క‌నిపించింది. అయితే ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ వుంద‌ని చెప్ప‌వ‌చ్చు. 

5. వరంగ‌ల్ః మంద‌కృష్ణ మాదిగ ప్ర‌భావం బాగా ప‌నిచేసింది. కాంగ్రెస్ మాదిగ‌ల్ని ప‌ట్టించుకోలేద‌నే ప్ర‌చారం ఓట‌ర్ల‌లో బాగా వెళ్ళింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ బ‌లంగా వుంది. ఎందుకంటే ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 3 చోట్ల బీజేపీ సెకెండ్ ప్లేస్ లో వుంది. ఇక్క‌డ బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ అభ్య‌ర్థులు వీక్‌. బీజేపీ అభ్య‌ర్థి బీఆర్ ఎస్ నుంచి వ‌చ్చారు. ఆర్థికంగా కూడా బ‌ల‌మైన నేత.  బీజేపీ - కాంగ్రెస్ మ‌ధ్య గ‌ట్టి పోటీ వున్న‌ప్ప‌ట్టికీ, బీజేపీకే ఎడ్జ్ వుంది. 

6. భువ‌న‌గిరిః బీజేపీకే అనుకూలంగా వున్నా కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ జోక్యంతో సీన్ మారింది. సి.ఎం. రేవంత్ రెడ్డి ఇక్క‌డ గెలుపును  ప్ర‌తిష్టాత్మ‌క‌గా తీసుకున్నారు. కోమ‌టి బ్ర‌ద‌ర్స్‌ను పొగుడుతూ సి.ఎం. చేసిన ప్ర‌సంగాలు వైర‌ల్ అయ్యాయి. సి.ఎం. అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి అనే డైలాగ్‌తో మొత్తం సీన్ మారింది. ఇక్క‌డ బీజేపీ గ‌ట్టి పోటీ ఇస్తున్న‌ప్ప‌ట్టికీ కాంగ్రెస్ అభ్యర్థికే గెలుపు అవ‌కాశాలున్నాయి.

7. న‌ల్గొండః కాంగ్రెస్ అభ్య‌ర్థికి అనుకూలంగా ఉంది. బీజేపీ గ‌ట్టి పోటీ ఇచ్చినా ఇక్క‌డ‌ గెలుపు కాంగ్రెస్ అభ్య‌ర్థిదే.

8. చేవెళ్ళః బీజేపీ భారీ మెజార్టీ తో ఇక్క‌డ గెల‌వ‌నుంది. బీజేపీ అభ్య‌ర్థి కుటుంబ‌నేప‌థ్యం, ఆయ‌న చేస్తున్న సామాజిక సేవా కార్యక్ర‌మాలతో పాటు మోడీ వేవ్ బాగా క‌లిసి వ‌చ్చింది. బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన రంజిత్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స‌పోర్ట్ చేయ‌లేదు. బీఆర్ ఎస్ ఎఫెక్ట్ కూడా అంత‌గా లేదు. కాబ‌ట్టి ఈ నియోజ‌వ‌ర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్థి భారీ మెజార్టీతో గెల‌వ‌బోతున్నారు.

9. మెద‌క్ః ఇక్క‌డ బీఆర్ ఎస్ - బీజేపీ మ‌ధ్యే పోటీ ఉన్న‌ప్ప‌ట్టికీ  ఎడ్జ్ బీజేపీకే వుంది. బీఆర్ఎస్‌కు 6 గురు ఎమ్మెల్యేలున్నా పోల్ మేనేజ్‌మెంట్ చేయ‌లేక‌పోయారు. బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద్‌రావు  ప్ర‌సంగాలు, ఆయ‌న మాట తీరు ప్ర‌జ‌ల్లో బాగా వెళ్ళింది. ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి ప‌రిమితం అయింది. బీజేపీ అభ్య‌ర్థిగా గెలుపు అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

10. మ‌ల్కాజ్‌గిరిః ఎన్నిక‌ల‌కు ముందే ఈటెలకు ఒన్ సైడ్ అనే ప్ర‌చారం జ‌రిగింది. ఇక్క‌డ గెల‌వ‌డాన్ని ఈటెల ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని ప్ర‌చారం చేశారు. ఆయ‌న కోడ‌లు బాగా యాక్టివ్‌గా తిరిగారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి నాన్ లోకల్ కావ‌డంతో ఇక్క‌డ పోటీ బీజేపీ - కాంగ్రెస్ మ‌ధ్య వుంది. అయితే ఇక్క‌డ ఈటెల గెలుపు ఒన్ సైడ్ అని చెప్ప‌వ‌చ్చు. 

11. నాగ‌ర్‌క‌ర్నూల్ః కాంగ్రెస్ పార్టీకి ఈజీ గా గెలిచే సీటు అనుకున్నారు. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో పోల్ మేనేజ్‌మెంట్‌లో వెనుక‌బ‌డ్డారు. అంత‌గా ప్ర‌చారం చేయ‌లేదు. కాంగ్రెస్ పార్టీ మాల అభ్య‌ర్థిని బ‌రిలో దింపింది. అయితే ఇక్క‌డ‌ మాదిగ ఓట్లు ఎక్కువ‌గా వున్నారు కాబ‌ట్టి వాళ్ళే కీల‌కం. వాళ్ళంతా బీజేపీ వైపే మ‌ళ్ళారు. బీజేపీ అభ్య‌ర్థి భ‌ర‌త్ యువ‌కుడు. మాదిగ కుల‌స్థుడు. అత‌ని  తండ్రి గ‌తంలో మంత్రిగా చేశారు. ఇవ‌న్నీ భ‌ర‌త్‌కు బాగా క‌ల‌సి వ‌చ్చాయి. దీంతో పాటు క‌ల్వ‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం నాగ‌ర్ క‌ర్నూల్‌లో వుండ‌టంతో అదీ ప్ల‌స్ అయింది. 2019 లో బీఆర్ ఎస్ నుంచి రాములు 2 ల‌క్ష‌ల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు భ‌ర‌త్‌కు తండ్రికి ల‌భించిన ఓట్లు ప్ల‌స్ అవుతాయ‌ని బీజేపీ అంచ‌నా వేస్తోంది. నాగ‌ర్ క‌ర్నూల్‌లో  బీజేపీ భారీ మెజార్టీతో గెల‌వ‌బోతోంది.

12. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ః ఇక్క‌డ‌  బీజేపీ - కాంగ్రెస్ మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ న‌డిచింది. సి.ఎం. స్వంత నియోజ‌క‌వ‌ర్గం. బీజేపీ అభ్య‌ర్థి డికె అరుణ‌కి స్థానికంగా మంచి ప‌ట్టు వుంది. ఆర్థిక బ‌లం వుంది. గెలిస్తే మంత్రి అవుతారు. మోదీ వేవ్ క‌లిసి వ‌స్తుంద‌నుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి వంశీ గెలుపు కోసం సి.ఎం. రేవంత్ బాగానే క‌ష్ట‌ప‌డ్డారు. అయితే బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారి మ‌ధ్య కొంత ఆధిప‌త్య‌పోరు క‌నిపించింది. అది  కాంగ్రెస్‌కు న‌ష్టం క‌లిగిస్తుంద‌ని బీజేపీ అంచ‌నా వేస్తోంది. మ‌రో వైపు బీఆర్ ఎస్ ఓట్లు కూడా బీజేపీకే ప‌డ్డాయి. సి.ఎం. రేవంత్‌రెడ్డి ఎనిమిది స‌భ‌ల్లో పాల్గొని ప్ర‌చారం చేశారు. పోటీ బీజేపీ కాంగ్రెస్ మ‌ధ్య ఉన్న  కాంగ్రెస్ కే ఎడ్జ్ క‌నిపిస్తోంది.

13. ఖ‌మ్మంః కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. బీజేపీ సెకెండ్ ప్లేస్‌కు ఎదిగింది. ట్రైబ‌ల్ ఏరియా లో బీజేపీ బాగా బ‌ల‌ప‌డింది.  బీఆర్ఎస్‌ 3వ స్థానానికి ప‌డిపోయింది. ఇక్క‌డ భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుంది.

14. మ‌హ‌బూబాబాద్ః కాంగ్రెస్ కు ఎడ్జ్ ఉంది. బీఆర్ఎస్ గ‌ట్టి పోటీ ఇచ్చింది. బీఆర్ఎస్‌లో ఆధిప‌త్య పోరు కాంగ్రెస్‌కు క‌లిసి వ‌చ్చింది. 

15. జ‌హీరాబాద్ః బీజేపీ - కాంగ్రెస్ మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ న‌డిచింది. ఇక్క‌డ గెలుపు అవ‌కాశం బీజేపీకే వుంది. పోల్‌మేజేజ్‌మెంట్ గ‌ట్టిగా చేసింది బీజేపీ. నార్త్ ఇండియా వాళ్ళు ఇక్క‌డ ఒట‌ర్లుగా ఉన్నారు. వారి ఆధిప‌త్యం ఎక్కువ‌. ఆర్థికంగా బ‌ల‌మైన వ్య‌క్తి వుండ‌టంతో అది బీజేపీకి క‌లిసి వ‌చ్చింది. కామారెడ్డి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం, ఈ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో వుండ‌టం బీజేపీకి క‌లిసి వ‌చ్చింది. ప్ర‌స్తుత బీజేపీ అభ్య‌ర్థి... గ‌తంలో బీఆర్ ఎస్ నుంచి 2 సార్లు గెలిచారు. ఇప్పుడు బిజేపీలోకి వ‌చ్చి పోటీ చేశారు. ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థికి హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయం అనిపిస్తోంది.

16. సికింద్రాబాద్ః కాంగ్రెస్ - బీజేపీ మ‌ధ్యే పోటీ వుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ముస్లిం ఓట్లు 6 ల‌క్ష‌కు పైగా వున్నాయి. కాంగ్రెస్ అభ్య‌ర్థి దానం నాగేంద‌ర్ ఆర్థికంగా బ‌ల‌వంతుడు. పోల్ మేనేజ్‌మెంట్ చేయ‌డంలో ఆయ‌న‌కు తిరుగులేదు. పైగా ఎంఐఎం త‌మ అభ్య‌ర్థిని పోటీలో పెట్ట‌క‌పోవ‌డం, కాంగ్రెస్‌కు క‌లిసి వ‌స్తుంది. ఎంఐఎం వ్యూహాత్మ‌కంగా, ఉద్దేశ‌పూర్వ‌కంగానే కాంగ్రెస్‌కు ఓటు వేయ‌మ‌ని, బీజేపీని ఓడించ‌మ‌ని పిలుపునిచ్చింది. ఎంఐఎం చేసిన ప్ర‌చారం, మొత్తం తెలంగాణాలో హిందూ ఓట్ల‌పై ప్ర‌భావం చూపింది.  బిజెపి-ఎంఐఎం క‌లిసి గేమ్ ప్లాన్ ప్లే చేయ‌డంతో బీజేపీ తెలంగాణాలో భారీ ఎత్తున సీట్లు గెలిచే అవ‌కాశం దొరికింది. బీజేపీ ఎత్తుగ‌డ తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి భారీ న‌ష్టం చేకూర్చింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రో వైపు కిష‌న్‌రెడ్డి డ‌బ్బు పంచ‌లేదు. లోక‌ల్‌గా అందుబాటులో వుండ‌ర‌నే ప్ర‌చారం కూడా ఆయ‌న‌కు మైన‌స్ చేసింది.  మొత్తానికి ఎంఐఎం ప్ర‌చారం, సికింద్రాబాద్‌లో డ్యామేజ్ చేసినా, తెలంగాణాలో బీజేపీకి అలా క‌లిసివ‌చ్చింది.

17. హైద‌రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం త‌ర‌ఫున పోటీ చేసిన బీజేపీ అభ్య‌ర్థి యూట్యూబ్ వ్యూస్ మీద చూపిన  ఆస‌క్తి ఓట‌ర్ల‌పై చూపించ‌లేదు. కేవ‌లం సోష‌ల్ మీడియా ప్ర‌చారాన్నే న‌మ్ముకుని న‌ట‌న‌లో జీవించారు. గొప్ప న‌టిగా పేరు పొందారు కానీ రాజ‌కీయ నాయ‌కురాలిగా రాణించ‌లేక‌పోయారు. బీజేపీ అభ్య‌ర్థి ఎంఐఎం అభ్య‌ర్థికి క‌నీస పోటీ ఇవ్వ‌లేక‌పోయారు. ఎప్ప‌ట్టి లాగా భారీ మెజార్టీతో ఎంఐఎం ఈ సారి కూడా విజ‌యం సాధించ‌నుంది. 

- ఎం.కె. ఫ‌జ‌ల్‌

ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్

  ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు. వీరిలో ధనియాల రాథ, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి ఉన్నారు. మరో ఐదుగురు కార్పొటర్లు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వంగా కలిశారు.  మరోవైపు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటన రోజే కాంగ్రెస్ పార్టీలో చేరటంతో  రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను కేటీఆర్‌ సన్మానించారు.  

ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్ల కొట్టివేత

ఐబొమ్మ రవి బెయిలు పిటిషన్లన నాంపల్లి కోర్టు కొట్టివేసింది. సినిమాల పైరసీ వ్యవహారంలో ఐబొమ్మ రవిపై ఐదు కేసులు నమోదైన సంగతి తెలిసిదే.  ఈ క్రమంలోనే ఈ కేసులలో ఐబొమ్మ రవిని పోలీసులు దఫాల వారీగా కస్టడీలోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి.  పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబం ధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు. కేసుల విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో అతడికి బెయిలు లభిస్తే, దర్యాప్తునకు ఆటంకం కలిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.  అంతేకాకుండా ఐ బొమ్మ రవి విదేశాల్లో పౌరసత్వం కలిగి ఉన్నాడని, ఇటువంటి సమయంలో రవికి బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశాలు  ఉన్నాయని, అదే జరిగితే  కేసు విచారణ   దెబ్బతింటుందని పోలీసులు పేర్కొన్నారు. రవి భారతదేశం లోనే అందుబాటులో ఉండేలా కస్టడీలో ఉంచడం అత్యవసరమని పోలీసుల తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం నాంపల్లి కోర్టు పోలీసుల వాదనలను పరిగణనలోనికి తీసుకున్న కోర్టు రవి పై నమోదైన ఐదు కేసులకు సంబంధించి దాఖలైన అన్ని బెయిల్ పిటీషన్లను  కొట్టి వేసింది.  

భోగాపురం క్రెడిట్ వార్.. లైన్ లోకి విజయసాయి?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య జరుగుతున్న క్రెడిట్ వార్ లోకి వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి ఎంటరయ్యారు. అయితే ఆయన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ క్రెడిట్ లో తనకూ కొంత భాగం ఉందని మాత్రమే చెప్పారు. అలా చెప్పడంలో ఆయన వైసీపీనీ, ఆ పార్టీ అధినేత జగన్ ను పూర్తిగా విస్మరించారు. భోగాపురం విమానాశ్రయంలో ఫస్ట్ టెస్ట్ ఫ్లయిట్ ను స్వాగతిస్తూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు.  ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు. విజయసాయి ఈ వైఖరి పట్ల వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.  పలువురు వైసీపీ మద్దతుదారులు విజయసాయిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీకి క్రెడిట్ దక్కకుండా అడ్డుపడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు.  సరే అది పక్కన పెడితే.. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ పరిస్థితి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డ చందంగా అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ ఎంపీగా నాడు సభలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం గళమెత్తిన విజయసాయి.. ఇప్పుడు పార్టీ ప్రస్తావన కూడా లేకుండా తాను వ్యక్తిగత స్థాయిలోనే భోగాపురం కోసం మాట్లాడానన్నట్లుగా సోషల్ మీడియాలో పేర్కొనడం.. వైసీపీ విమర్శకులకు కొత్త శక్తిని ఇచ్చినట్లైంది. ఈ నేపథ్యంలోనే  నాడు విపక్ష నేతగా భోగాపురం వద్దంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. విమానాశ్రయాన్ని అడ్డుకోవడానికి చేయగలిగినంతా చేసి ఇప్పుడు తగుదునమ్మా అని క్రెడిట్ కోసం పాకులాడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.  

ఉగాదికి కవిత కొత్త పార్టీ

  తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది. ఉగాదికి కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి పేరుతో పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాల ఇన్‌ఛార్జ్‌లు, కార్యదర్శులతో కవిత సమావేశమయ్యారు. జనం బాట కార్యక్రమానికి సంబంధించిన రివ్యూ తెలుసుకున్నారు. పార్టీ పెడితే ప్రజల్లోకి బలంగా వెళ్లగలమా? లేదా? అన్న సలహాలు, సూచనలు కార్యకర్తలు, నాయకుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నూతన పార్టీతోనే పోటీ చేయనున్నట్లు కవిత వెల్లడించిన సంగతి తెలిసిందే.  శాసనమండలిలో భావోద్వేగంతో మాట్లాడిన కవిత పలు సంచలన విషయాలు వెల్లడించారు. అయితే  కవిత తన జిల్లాల పర్యటనలను వాయిదా వేసుకున్నారు. వాస్తవంగా  ఇవాళ నుంచి సిరిసిల్ల జిల్లాలో పర్యటించాల్సి ఉంది. తన అన్న కేటీఆర్ ​ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో కవిత పర్యటన నేపథ్యంలో ఆసక్తి నెలకొంది.  జాగృతి సంస్థను రాజకీయ పార్టీగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే పార్టీ నాయకులందరు డిమాండ్​ చేస్తున్నారు.   

కవిత కాంగ్రెస్‌లో చేరొచ్చు...కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

  ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని మల్‌రెడ్డి హింట్ ఇచ్చారు. గతంలో దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి నేతలు కాంగ్రెస్‌లోకి వస్తారని అనుకున్నా.. అనుకున్నట్టుగానే వచ్చారని ఆయన తెలిపారు.  మంత్రి పదవిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకే నష్టం అన్నారు. నిరాకరిస్తే నాకేం నష్టం లేదు. ఈ విషయంలో పార్టీ పెద్దలు ఆలోచించాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనేది ఊహాగానమేనని రంగారెడ్డి జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు అయినా చేసుకోవచ్చు. కానీ జిల్లా స్వరూపం పేరు మారొద్దున్నారు. ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో ల్యాండ్ విలువ పెరిగి  భూములు ఎవరూ అమ్మడం లేదని ఆయన అన్నారు.  

తమిళనాట రచ్చ రేపుతున్న లాప్ ట్యాప్ రాజకీయం!

తమిళనాడులో రాజకీయ వెడి రోహిణీకార్తెను తలపిస్తున్నది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాలలో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన విజయ్.. అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.  ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయ వాతావరణం వేడెక్కింది.ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే భావిస్తుంటే.. ఇరు పార్టీల పాలననూ చూసిన తమిళులు.. తనకు ఒక చాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని విజయ్ అంటున్నారు.  కాగా ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి స్టాలిన్ సర్కార్ ఫీబీస్ కు తెరలేపింది. విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీ చేపట్టింది. దీంతో కంగుతిన్న అన్నాడీఎంకే ఎన్నికల తాయిలాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు స్టాలిన్ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారంటూ విమర్శలకు తెరలేపింది. అయితే డీఎంకే మాత్రం ఇదేం కొత్త పథకం కాదనీ, దివంగత ముఖ్యమంత్రి జయలలిత విద్యార్థులకు లాప్ టాప్ ల పంపిణీ పథకాన్ని 2011లోనే ప్రారంభించారని చెబుతోంది.   2021లో అధికారంలోకి వచ్చిన డీఎంకే, గత పథకాలను కొనసాగిస్తామని ప్రకటించి, ఇప్పుడు ఏడాదికి 20 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. చెన్నైలో సీఎం ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా తొలి విడతగా 10 లక్షల మందికి లాప్ ట్యాప్ ల పంపిణీ చేపట్టింది. దీంతో ఎన్నికల వేళ తమిళనాట ట్యాప్ లాప్ రాజకీయం రచ్చ రేపుతోందని పరిశీలకులు అంటున్నారు.  

కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడీ కన్నుమూత

కాంగ్రెస్  సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడీ  మంగళవారం (జనవరి 6) తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 81 ఏళ్లు. ఆయనకు భార్య, కుమారుడు, కోడలు, ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు, మనవళ్లు ఉన్నారు. ఎరండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కల్మాడీ మృతి రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పైలట్ అయిన సురేష్ కల్మాడీ  ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పుణె నుంచి పలుమార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించి, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.  పుణె రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన నేతగా, 'కింగ్‌మేకర్‌'గా ఆయన గుర్తింపు పొందారు.  భారత ఒలింపిక్ సంఘం   అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన నేతృత్వంలోనే 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలు జరిగాయి.   

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ముగిసిన నవీన్ రావు విచారణ.. వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు!

ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా సీట్ గుర్తించిన బీఆర్ఎస్ నాయకుడు నవీన్ రావును సిట్  సోమవారం (జనవరి 5)  విచారించింది. ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలపై సిట్ ఒక నిర్ణారణకు వచ్చిందని తెలుస్తోంది.  ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా ఎక్విపిమెంట్ సేకరణ, కార్యాలయం ఏర్పాటు, మధ్యవర్తుల పాత్ర వంటి అంశాలు ఈ కేసులో కీలకంగా మారాయని అధికారులు చెబుతున్నారు. రాజకీయ నేతల పేర్లు కూడా విచారణలో వినిపించడంతో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా సంచలనంగా మారింది.   నవీన్ రావును సిట్ అధికారులు సోమవారం (జనవరి 5) దాదాపు ఎనిమిది గంటలపాటు విచారించారు. ఈ విచారణలోఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆర్థిక, సాంకేతిక, నిర్వహణ తదితర అంశాలపై స్పష్టమైన ఆధారాలు వెల్లడైనట్లు సమాచారం.  ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది.  పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ నిర్వహణ కోసం జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రత్యేక కార్యాలయాన్ని నవీన్ రావు తీసుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ కార్యాలయం నుంచే ఫోన్ ట్యాపింగ్ కార్యకలా పాలు కొనసాగినట్లు అనుమానిస్తున్నారు. కార్యాలయ అద్దె, నిర్వహణ ఖర్చులు, పరికరాల అమరిక వంటి వివరాలపై కూడా అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ కేసులో రాజకీయ కోణం మరింత బలపడిందని చెబుతున్నారు. బీఆర్‌ఎస్ నేతల తరఫున ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావులతో నవీన్ రావు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సిట్ విచారణలో తేలినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఎవరి కోసం, ఏ ఉద్దేశంతో వినియోగిం చారన్న అంశంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో  నవీన్ రావు విచారణ ముగిసినా, ఈ కేసు ఇక్కడితో ఆగే అవకాశాలు లేవని సిట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన డేటా ఎవరెవరికి చేరింది, దాన్ని ఎలా వినియోగించారు, ఈ వ్యవహారంలో ఇంకెంతమంది పాత్రధారులు ఉన్నారనే అంశాలపై మరింత లోతుగా విచారణ కొనసాగనుంది. ఇదిలా ఉండగా ఈ కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంలో హరీష్ కు భారీ ఊరట

ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీం కోర్టులో   ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో  పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. అయితే గతంలోనే తన ఫోన్‌ను ట్యాప్ చేయించారంటూ మాజీ మంత్రి హరీష్ రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయ్యింది. దీన్ని సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. సరైన ఆధారాలు లేనందున ఆ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్   సుప్రీంలో సోమవారం విచారణకు వచ్చింది.  తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమంటూ  జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది.  

జనసేన తెలంగాణ కమిటీలు రద్దు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో పార్టీ పటిష్ఠతపై దృష్టి సారించారు. తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తీసుకునే చర్యలలో భాగంగా ముందుగా రాష్ట్రంలోని జనసేన కమిటీలన్నిటినీ రద్దు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు జనసేనాని ఆదేశాల మేరకు తెలంగాణలోని జనసేన కమిటీలన్నిటినీ రద్దు చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి సోమవారం (జనవరి 5) అధికారికంగా ప్రకటించారు. రద్దు చేసిన కమిటీల స్థానంలో  నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.  ఈ విధంగా రాష్ట్రంలో పార్టీని పునర్వ్యవస్థీకరించి కేడర్ మరింత చురుకుగా పని చేసేలా స్థానిక నాయకత్వానికి గుర్తింపు ఇవ్వనున్నట్లు తెలిపారు.