చిక్కుల్లో హీరో అల్లు అర్జున్.. టీఎస్ ఆర్టీసీ లీగల్ నోటీస్
posted on Nov 9, 2021 @ 6:29PM
మెగా హీరో అల్లు అర్జున్ చిక్కుల్లో పడ్డారు. ఆయనకు లీగల్ నోటీస్ రావడం కలకలం రేపుతోంది. టియస్ ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచినందుకు హీరో అల్లు అర్జున్, రాపిడో సంస్థకు లీగల్ నోటీస్ లు ఇచ్చారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. నటుడు అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇంతకీ వివాదం ఏటంటే... రాపిడో సంస్థ కోసం యాడ్ లో నటించారు హీరో అల్లు అర్జున్. అందులో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని చెప్పారు. దీనిపైనే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభ్యంతరం చెప్పారు. యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సుల గురించి అల్లు అర్జున్ ప్రజలకు అలా చెప్పడం సరికాదని అన్నారు. ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణీకులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో సహా అనేక వ్యక్తుల నుండి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు.ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని ఖండిస్తున్నామని సజ్జనార్ అన్నారు.
టిఎస్ఆర్టిసిని కించపరచడాన్ని సంస్థ యాజమాన్యం , ప్రయాణికులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు సహించరని సజ్జనార్ స్పష్టం చేశారు. వాస్తవానికి మెరుగైన, పరిశుభ్రమైన పర్యావరణ సమాజం కోసం ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనలలో యాక్టర్స్ నటించాలి. టిఎస్ఆర్టీసి సామాన్యుల సేవలో ఉందని, అందుకే నటునికి, ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసు పంపుతున్నామని చెప్పారు.