నటి హేమశ్రీ హత్యకేసు, డ్రైవర్‌ అరెస్ట్

 

కన్నడనటి హేమశ్రీ హత్యకేసులో కీలక వివరాలు ఒక్కొటొక్కటిగా బైటపడుతున్నాయి. బుధవారం రాత్రి డ్రైవర్‌ను కూడా పోలీసులు పట్టుకున్నారు. హేమశ్రీ భర్త సురేంద్ర బాబు ఆమెను తరలించడానికి డ్రైవర్ సతీష్ సహరించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసుకి సంబంధించిన మరిన్ని వివరాల్ని సేకరించేందుకు పోలీసులు హేమశ్రీ తల్లిని ప్రశ్ని౦చారు. క్లోరో ఫామ్ ఎక్కువగా ఇచ్చినందువల్లే హేమశ్రీ మృతి చెందిందన్న నిజాన్ని ఆమె భర్త సురేంద్ర పోలీస్ ఇంటరాగేషన్ లో ఇప్పటికే బైటపెట్టేశాడు. సురేంద్ర ఇచ్చిన సమాచారంతో తీగలాగిన బెంగళూరు పోలీసులకు హత్య వెనక మాజీ కార్పొరేటర్ మురళి హస్తం కూడా ఉందన్న విషయం తెలిసిపోవడంతో కేసులో చిక్కుముడి వీడిపోయింది. హేమశ్రీ మృతికి సంబంధించి ఆమె మిత్రుడు మంజునాథ్‌ను కూడా పోలీసులు ప్రశ్నించారు. హేమశ్రీ హత్యకు ముందు అతను ఆమెతో మాట్లాడిన సిడీని విడుదల చేశాడు. తన భర్త సురేంద్ర నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని హేమశ్రీ చెబుతున్నట్లు ఉన్న సీడిని అతను మీడియాకు విడుదల చేశాడు. ఈ నేపథ్యంలోనే మంజునాథ్‌ను పోలీసులు విచారించి, పంపించి వేశారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని పోలీసులు అతనికి చెప్పారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.