బీజేపీకి హరీష్ రావు 15 ప్రశ్నలు.. హుజురాబాద్ లో సవాళ్లు..
posted on Oct 23, 2021 @ 8:24PM
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. నాలుగు రోజుల్లో ప్రచారం ముగియనుండటంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. నేతలంతా హుజురాబాద్ లోనే మకాం వేశారు. టీఆర్ఎస్ కు అంతా తానే వ్యవహరిస్తున్న మంత్రి హరీష్ రావు.. తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. హుజురాబాద్ కేంద్రంగా ఆయన బీజేపీకి, బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు 15 ప్రశ్నలు సంధించారు.
1. రైతుల పట్ల ఇంత నిర్దయగా, ఇంత నిర్లక్ష్యంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత కౄరంగా వ్యవహరించే పార్టీ, ప్రభుత్వం కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా బీజేపీ తప్పమరో పార్టీ, మరెక్కడా కనిపించదని మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతులను ఉగ్రవాదులతో పోల్చిన బీజేపీ నాయకులకు బుద్దిచెప్పాలి. నడి రోడ్డుపై రైతులను హత్య చేసి, మళ్లీ ఆ రైతులనే ఓట్లు అడుగుతారా ?
2. రైతులను కొట్టి జైలుకు వెళితే పెద్ద లీడర్లు అయితరు అని హర్యానా రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ రెచ్చగొడతడు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై కారు ఎక్కించి కేంద్ర మంత్రి కొడుకు నలుగురు రైతుల ప్రాణాలు తీస్తడు.కర్షకుల కోసం కొట్లాడే వాళ్లంతా ఖలిస్తాన్ తీవ్రవాదులని కేంద్ర మంత్రి అంటడు అని హరీశ్ రావు బీజేపీ పై మండిపడ్డారు.
3. రైతు చట్టాలను వ్యతిరేకించడం దేశ ద్రోహమని ఇంకో కేంద్ర మంత్రి అంటడు.హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఎమన్నడు? బీజేపీ కార్యకర్తలను ఎట్లు రెచ్చగొట్టిండు. బీజేపీ కార్యకర్తలు ఎక్కడిక్కడ గ్రూపులుగా తయారు కాండి. 500 మంది, వెయి మందితో జమ కాండి. వ్యవసాయ చట్టాలపై నిరసన తెలిపే రైతులను కర్రలతో తరిమి కొట్టండి. అయితే కేసు అయితది. కాని మీరు పార్టీలో పెద్ద లీడర్లు అయితరు. అని హర్యానా ముఖ్యమంత్రే బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టిండు.ఉత్తర ప్రదేశ్ లో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా కారు ఎక్కించిండు. నలుగురు రైతుల ప్రాణాలు తీసిండు. ఉత్తర ప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వమే ఆశిష్ పై హత్య కేసు పెట్టింది.కేంద్రమంత్రి అజయ్ మిశ్రా ఎమంటున్నడు. అసలు రైతులంతా ఖలిస్తాన్ తీవ్రవాదులని ముద్ర వేసిండు. రైతులకు అడుగడుగునా అన్యాయం చేసి, ప్రతీ అంశంలో దగా చేసిన బీజేపీకి గట్టి బుద్ది చెప్పాలి.ఇన్ని దుర్గాలు చేసిన బీజేపీ నాయకులకు కనీసం పశ్చాతాపం లేదు. బాధ లేదు. రైతుల పట్ల సానుభూతి లేదు. ఉత్తర ప్రదేశ్ లో అంత ఘోరం జరిగినా ఒక్క బీజపీ నాయకుడు కూడా కనీసం విచారం వ్యక్తం చేయలేదు ఇదేనా బీజేపీ నాయకులకున్నమానవత్వం?
4. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే పాకిస్తాన్ అని ముద్ర వేయడం, రైతుల గురించి మాట్లాడితే ఖలిస్తాన్ అని ముద్ర వేయడం, న్యాయం గురించి మట్లాడితే హిందుస్తాన్ అని అరవడం ఇది బీజేపీ నాయకులకు దుర్నీతి. అన్నం పెట్టే రైతులను చంపిన బీజేపీ నాయకులు జాతి ద్రోహులు. అలాంటి దేశ ద్రోహ పార్టీకి ఓట్లేస్తమా.
5. హూజూరాబాద్ లో బీజేపీని ఓడించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారనే సందేశం మనం దేశానికి ఇవ్వాలి.నేను బీజేపీ నాయకులను అడుగుతున్న అసలు రైతులు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి.? ఒక్కరంటే ఒక్క కారణం చెప్పండి.రైతులు టీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో నేను వంద కారణాలు చెబుతా. మీరు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ఒక్క కారణం చెప్పండి.. అని హరీశ్ రావు ప్రశ్నించారు.రైతులను నడి రోడ్డు మీద చంపినందుకు మీకు ఓటెయ్యాలా? రైతులను కర్రలతో కొట్టండి అని పిలుపునిచ్చినందుకు బీజేపీకి ఓటెయ్యాలా? రైతులను ఖలిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చినందుకు బీజేపీకి ఓటెయ్యాలా?
6. వ్యవసాయ మార్కెట్లు బంద్ పెట్టడం కోసం కొత్త చట్టం తెచ్చినందుకు ఓటెయ్యాలా? ఎనర్జీ ఆడిట్ పేరుతో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వకుండా బాయిల కాడ, బోర్ల కాడ మీటర్లు పెట్టాలని చట్టం తెచ్చినందుకు బీజేపీకి ఓటెయ్యాలా?
పెట్రోల్ లీటరు ధర రూ 111.18 లీటర్ డిజీల్ ధర రూ. 103.94 కు పెంచినందుకు, గ్యాస్ సిలిండర్ ధర వేయి రూపాయలు చేసి సబ్సిడీని రూ. 250 నుంచి రూ. 39 కు తగ్గించినందుకు బీజేపీకి ఓటు వేయాలా?
7.బీజేపీ ప్రభుత్వం డిజిల్ రేట్లు పెంచడం కారణంగా రైతుల వ్యవసాయఖర్చు పెరిగింది. ట్రాక్టర్ తో ఎకరం భూమి దుక్కి దున్నడానికి ఇంతకుముందు ఎకరానికి రూ. 2 వేలు ఖర్చు అయ్యేది. అలాంటిది డిజిల్ రేట్ల పెంపు వల్ల, ఇవాళ ఎకరం దుక్కి దున్నడానికి రూ. 6 వేలు ఖర్చవుతుంది. రైతులకు రెండింతల సాగు ఖర్చు పెంచినందుకు బీజేపీకి ఓటు వేయాలా.?
8.సీఎం కేసీఆర్ గారు రైతు బంధు పథకంతో ఎకరానికి ఐదు వేలు కుడి చెత్తో సాయం చేస్తుంటే, బీజేపీ డిజిల్ రేట్లు పెంచి ట్రాక్టర్, వరి కోత మిషన్ల కు అయ్యే డిజిల్ ఖర్చు ద్వారా ఆ మొత్తాన్ని ఎడమ చేత్తో తీసుకుంటున్నందుకు బీజేపీకి ఓటు వేయాలా.?
9. ఎఫ్.సీ.ఐ ద్వారా ధాన్యం సేకరించేది లేదని మొండి చెయ్యి చూపించినందుకు బీజేపీకి ఓటెయ్యాలా? దేశంలోనే పుష్కలంగా మక్కలు పండుతున్నా , విదేశాల నుంచి మక్కలు దిగుమతి చేసుకుని ఇక్కడి రైతుల పంటకు ధర రాకుండా అన్యాయం చేస్తున్నందుకు బీజేపీకి ఓటు వేయాలా?
10. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంవచ్చిన తర్వాత బడా కంపెనీలకు 10 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసింది. కాని ఒక్కరంటే ఒక్క రైతు రుణం మాఫీ చేయలేదు. పిట్టలను కొట్టి గద్దలకు పెడుతున్న బీజేపీ పార్టీకి ఓటెయ్యాలా?
11. ఉపాధి హమీ పథకాన్ని వ్యవసాయనికి అనుబంధం చేసి అటు రైతులకు,ఇటు కూలీలకు మేలు చేయండని దేశమంతా మొత్తుకొంటోంది. అయినా ఆ పని మాత్రం చేయలేదు. ఉపాధి హమీ పథకాన్ని వ్యవసాయన్ని బాగు చేయడానికి ఉపయోగించనందుకు బీజేపీకి ఓటెయ్యాలా?
12. తెలంగాణలో రూ. 2 లక్షలకోట్ల వ్యయంతో రైతుల కోసం ప్రాజక్టులు కడుతున్నాం. కనీసం ఒక్క రూపాయి అయినా కేంద్రం సాయం చేసిందా.? ఒక్క ప్రాజెక్టు కూడా కట్టనందుకు బీజేపీకి ఓటెయ్యాలా?
13. కృష్ణా నీటిలో తెలంగాణ వాటా నిర్ణయించి,తెలంగాణకు న్యాయంచేయాలని వందల సార్లు ప్రధానికి చెప్పినా పట్టించుకోలేదు. నీటి వాటాలో అన్యాయాన్ని సవరించనందుకు బీజేపీకి ఓటెయ్యాలా?
14. కృష్ణా నది నీళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుల ద్వారా తరలిస్తున్నా మౌనం వహిస్తున్నందుకు బీజేపీకి ఓటెయ్యాలా.?