అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు.. నెరవేరిన చిరకాల డిమాండు...
posted on Aug 24, 2021 @ 7:34PM
పేదరికానికి కులం-మతం అనే తేడా ఉండదు. ఏ కులంలోనైనా పేదలు ఉంటారు. కేవలం పుట్టకతో అగ్రవర్ణం అయినంత మాత్రాన ఇక వారు సంపన్నులే అని భావించలేం. వారిని ధనవంతుల జాబితాలో కలిపేసి పట్టించుకోకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేదరికం నుంచి బయటపడలేదు. అందుకే, దేశవ్యాప్తంగా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు- ఈడబ్ల్యూఎస్ కోసం ఏళ్లుగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, తెలంగాణ సర్కారు వారికి గుడ్న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ చేసింది.
ఇకపై ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయనుంది తెలంగాణ సర్కారు. 8 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వర్తించని వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతాయి. ఆదాయ ధ్రువపత్రం ఆధారంగా రిజర్వేషన్లకు అర్హత నిర్ణయిస్తారు. ధ్రువపత్రం తప్పుగా తేలితే సర్వీసు రద్దు, చట్టపరమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటాలో భర్తీ కాకపోతే తదుపరి ఏడాదికి ఖాళీలు బదిలీ చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ఈడబ్ల్యూఎస్ నియామకాల్లోనూ మహిళలకు 33.33 శాతం కోటా అమలు చేయనున్నారు. ఈడబ్ల్యూఎస్ వారికి నియామకాల్లో ఐదేళ్ల వయోపరిమితి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ తరహాలో పరీక్ష రుసుముల్లో మినహాయింపు ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కోటాకు అనుగుణంగా విద్యాసంస్థల్లో సీట్ల సంఖ్యను పెంచనున్నారు. నియామకాల్లో రోస్టర్ పాయింట్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం 50వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు ఉత్తర్వులు జారీచేయడం అగ్రవర్ణ పేద నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఈడబ్ల్యూఎస్ ఎన్నో దశాబ్దాలుగా వినిపిస్తున్న డిమాండ్ నెరవేరినట్టే. అగ్రవర్ణ పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరినట్టే.