ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
posted on May 21, 2020 @ 4:20PM
ఏపీ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ శుభవార్త చెప్పారు. మే నెల నుంచి ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఆర్థిక శాఖ, ట్రెజరీ విభాగాలకు ఆదేశాలు అందాయి. ఉద్యోగులకు పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించేందుకు వీలుగా ట్రెజరీ సాఫ్ట్వేర్లో సిఎఫ్ఎంఎస్ మార్పులు చేయనున్నది. గడిచిన రెండు నెలల్లో తగ్గించిన వేతనాల బకాయిలపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో గత రెండు నెలలు ఉద్యోగులకు సగం జీతాలు మాత్రమే జగన్ సర్కార్ చెల్లించింది. లాక్ డౌన్లో సడలింపులు చేయడంతో ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిన పెట్టే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వాలని నిర్ణయించింది. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.