ప్రశ్న మీదే... ఆన్సర్ మీదే! కరోనాతో మారిన ఎగ్జామ్ సీన్....
posted on May 28, 2021 @ 6:48PM
కరోనా మహమ్మారితో అంతా తలకిందులవుతోంది. ఎవరూ, ఎప్పుడూ ఊహించని ఘటనలు జరుగుతున్నాయి. వైరస్ కారణంగా లాక్ డౌన్లతో ఏడాదిన్నరగా విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. స్కూళ్లు, కాలేజీలు మూతపడటంతో చదవులు అటకెక్కాయి. తప్పనిసరిగా నిర్వహించాల్సిన పరీక్షలు మినహాయిస్తే.. మిగితావన్ని రద్దువుతున్నాయి. ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నా.. పూర్తి స్థాయిలో అందరికి చేరడం లేదు. కరోనాతో చదువు, పరీక్షల విధానంలోనూ మార్పులు వస్తున్నాయి. ఇలానే గోవా ఐఐటీ చేసిన కొత్త తరహా ప్లాన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా ప్రాథమిక తరగతుల నుంచి ఉన్నత విద్య వరకు పరీక్షల్లో ఎక్కడైనా సరే.. ప్రశ్నపత్రం ఇచ్చి జవాబులు రాయమంటారు. కానీ ప్రశ్నలు, జవాబులు కూడా మీరే రాసుకోండి అని అంటే.. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా ఇలానే చేసింది. అనలాగ్ సర్క్యూట్స్ ఎగ్జామ్లో పరీక్ష పేపర్ ను ఇలానే ఇచ్చింది. సెమిస్టర్లో నేర్చుకున్నదానిని బట్టి ఈ పరీక్షలో సొంతంగా ప్రశ్నలు తయారుచేసి దానికి జవాబులు రాసి ఇవ్వాలని ఐఐటీ కోరింది. ఇది చూసిన విద్యార్థులు తొలుత షాకయ్యారు. దీంతో పరీక్షకు హాజరైన విద్యార్థులు.. ఆ పేపర్ చూసి షాకయ్యారు. ఆ తర్వాత కోలుకుని తమకు తోచినది, వచ్చినది, తెలిసినది రాసి ఎగ్జామ్ ముగించారు. ఎవరో ఈ పేపర్ను స్క్రీన్షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.
ఐఐటీ గోవా ఇచ్చిన ఆ పేపర్లో మొత్తం సెమిస్టర్లో మీకు ఇచ్చిన లెక్చర్ మెటీరియల్స్ నుంచి 60 మార్కుల ప్రశ్నలు రూపొందించండి అని ఉంది. ‘‘మీరు ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారనే దానిని ఇది తెలియజేస్తుంది. ప్రశ్నలు తయారుచేసిన తర్వాత రెండు గంటల్లో జవాబులు కూడా రాయండి’’ అని ఆ పేపర్లో రాసి ఉంది. కరోనా కారణంగా బోర్డు పరీక్షలను రద్దు చేయాలని దేశం మొత్తం డిమాండ్ చేస్తుంటే ఐఐటీ గోవా క్వశ్చన్ పేపర్ మాత్రం సరికొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది.
విద్యార్థులు ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారనేది ఈ దెబ్బతో తేలిపోతుందంటూ ఐఐటీ గోవాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐఐటీ గోవా తీసుకొచ్చిన ఈ సరికొత్త విధానం విద్యార్థుల ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని చెబుతున్నారు. విద్యార్థులను అంచనా వేసేందుకు ఈ ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుందని, ప్రశ్నలు తయారు చేసి జవాబులు రాయడం అంత సులభమైన విషయం ఏమీ కాదని అంటున్నారు. ఈ దెబ్బతో తనకు ఏం తెలుసు? ఏమి తెలియదు? అన్న విషయం విద్యార్థులకు పూర్తిగా బోధపడుతుందని మరికొందరు కామెంట్ చేశారు.