గర్ల్ఫ్రెండ్ను సెక్షన్ 498ఏ కింద విచారించడానికి వీల్లేదు.. ఏపీ హైకోర్టు..
posted on Jul 26, 2021 @ 2:02PM
గర్ల్ఫ్రెండ్ను ఐపీసీ సెక్షన్ 498ఏ (మహిళను వేధింపులకు గురిచేయడం) కింద విచారించడానికి వీలేదని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. ఓ వ్యక్తితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారంటూ అతని గర్ల్ఫ్రెండ్పై పోలీసులు 498ఏ కింద నమోదు చేశారు. ఆ కేసులో ఆమె అరెస్ట్తో పాటు తదుపరి చర్యలను నిలిపేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ సెక్షన్ కింద భర్త రక్త సంబంధీకులు, వివాహం ద్వారా బంధువులైన వారిని మాత్రమే విచారించేందుకు వీలు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. భర్త బంధువుల్లో గర్ల్ఫ్రెండ్ రాదని, అందువల్ల ఆమెను 498ఏ కింద విచారించడానికి వీల్లేదని తెలిపింది. వివరాలు.. నెల్లూరు జిల్లా దిశ పోలీసు స్టేషన్లో ఓ వివాహత.. తన భర్తతో సాన్నిహిత్యం కలిగి ఉన్న మహిళపై ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె ఆమె పై కేసు నమోదు చేశారు. ఆమె తన భర్తతో వివాహేతర సంబంధం కలిగి ఉందంటూ ఆ మహిళా తెలిపింది.
ఫిర్యాదు చేసిన వివాహిత... భర్తను ఏ 1 నిందితుడిగా, అతనితో సంబంధం పెట్టుకున్న మహిళను ఏ 2 నిందితురాలిగా పేర్కొన్నారు. దీంతో దిశ పోలీసులు.. ఐపీసీ సెక్షన్ 498ఏ తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే తనపై సెక్షన్ 498ఏ కింద కేసు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ నిందితురాలు ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మహిళ.. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ఫిర్యాదు చేసిన వివాహిత భర్తకు పిటిషనర్ బంధువు కాదన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్పై పోలీసులు సెక్షన్ 498ఏ కింద నమోదు చేసిన కేసు చెల్లదన్నారు. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఉన్నాయని అన్నారు.వీటిని పరిగణలోకి తీసుకన్న న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్.. పిటిషనర్పై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ ఉత్తర్వులు ఇచ్చారు. 498ఏ కింద రక్త సంబంధం లేదా వివాహం ద్వారా భర్తకు బంధువులైన వారిని మాత్రమే విచారించేందుకు వీలుంటుందని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి మొదటి నిందితుడిపై దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపారు.
ఒకప్పుడు ఇలాంటి పంచాయితీలు ఉంటే ఇంటి పెద్దల ముందు తెచ్చుకునే వాళ్ళు.. లేదంటే ఊరి పెద్దల సమక్షంలో తెంచుకుంటే వాళ్ళు.. ఇప్పుడు కోర్టు కు కూడా వెళ్తున్నారు..కాలం మారింది మనుషులు తీరు మారింది.. అందుకే ఇలా జరుగుతున్నాయి అని ఈ విషయం తెలిసిన స్థానికులు మాట్లాడుకుంటున్నారు.