అసెంబ్లీలో గుండాలున్నారట..! హెల్మెట్లు పెట్టుకుని సభలోకి ఎమ్మెల్యేలు..
posted on Jul 26, 2021 @ 1:48PM
చట్టసభల్లో ప్రతిపక్ష సభ్యులు వివిధ రీతిలో నిరసన తెలుపుతుంటారు. పార్లమెంట్ నుంచి అసెంబ్లీ వరకు అంతటా ఇలాంటి నిరసనలు జరుగుతుంటాయి. రైతు సమస్యలపై అయితే ఎండిన పంటలతో సభ్యులు సభకు వస్తుంటారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసన తెలపటానికి రిక్షాల్లో, ఎండ్ల బండ్లపై ప్రదర్శనలు చేస్తుంటారు. కాని బీహార్ అసెంబ్లీలో మాత్రం భిన్నమైన సీన్ కనిపించింది. ప్రతిపక్ష ఆర్జేడీ ఎమ్మెల్యేలు తలకు హెల్మెట్లు పెట్టుకుని అసెంబ్లీకి వచ్చారు.
తమ ప్రాణాలకు రక్షణ లేదని, తమపై దాడులు జరిగే అవకాశం ఉందని... అందుకే ఆత్మ రక్షణ కోసం హెల్మెట్లు పెట్టుకున్నామని ఆర్జేడీ ఎమ్మెల్యేలు చెప్పడం కలకలం రేపింది. మార్చి 23న బీహార్ అసెంబ్లీలో గందరగోళం చెలరేగింది. ప్రతిపక్ష నేతలు ఆందోళన చేయడంతో అసెంబ్లీలోకి పోలీసులు ప్రవేశించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో తమ ఎమ్మెల్యేలు కొంత మందికి గాయాలయ్యాయని ఆర్జేడీ ప్రకటించింది. ఇప్పుడు మరోసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో హెల్మెట్లు పెట్టుకుని, ప్రథమ చికిత్స పెట్టెలు పట్టుకుని వచ్చి ఆర్జేడీ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
'అసెంబ్లీలోనే మమ్మల్ని చంపేయడానికి మార్చి 23న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గూండాలను రప్పించారు. ఆ ఘటనలో కేవలం పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసి వదిలేయడం సరికాదు' అని
ఆర్జేడీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ అన్నారు. తమకు మరోసారి గాయాలు కాకుండా ఉండేందుకే తగిన ఏర్పాట్లు చేసుకుని వచ్చామని చెప్పారు. ఆర్జేడీ ఎమ్మెల్యే తీరుపై బీజేపీ, జేడీయూ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిసిటీ కోసం చిల్లర వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు.