తుగ్లక్ లా జగన్ అంటూ గల్లా ఘాటు వ్యాఖ్యలు... లోక్ సభలో టీడీపీ-వైసీపీ రాజధాని ఫైట్....
posted on Feb 6, 2020 9:17AM
ఆంధ్రప్రదేశ్లో రాజధాని రగడ చల్లారడం లేదు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదంటూ పార్లమెంట్ వేదికగా కేంద్రం స్పష్టత ఇచ్చినా మూడు రాజధానులపై రాజకీయ కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు, తాను అనుకున్న మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం చాపకింద నీరులా పనిచేసుకుంటూ పోతుంటే... ఎట్టిపరిస్థితుల్లోనూ రాజధానిని అమరావతి నుంచి తరలించనివ్వమంటూ రైతులు, మహిళలు పోరాటం చేస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలుస్తూ తమ గోడు చెప్పుకుంటోంది అమరావతి జేఏసీ. రాజధాని కోసం తమ భూములను త్యాగంచేస్తే ఇఫ్పుడు జగన్ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తోందంటూ ఫిర్యాదు చేస్తున్నారు.
అయితే, ఏపీ రాజధాని వివాదం రాష్ట్రం పరిధిలోనిదని, రాజధాని ఏర్పాటుపై పూర్తి అధికారం రాష్ట్రానిదేనంటూ పార్లమెంట్ వేదికగా కేంద్రం స్పష్టతనిచ్చినా మరోసారి మూడు రాజధానుల ఇష్యూను లోక్ సభలో లేవనెత్తారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. ఏపీ రాజధాని ఇష్యూ రాష్ట్రానిది కాదని... జాతీయ సమస్య అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా మూడు రాజధానులు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. అలాగే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపైనా గల్లా జయదేవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల నిర్ణయంతో జగన్ ను తుగ్లత్ తో పోలుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దాంతో, గల్లా ప్రసంగానికి వైసీపీ ఎంపీలు అడ్డుతగిలారు. ఇక, స్పీకర్ సీట్లో కూర్చున్న డి.రాజా కూడా గల్లా స్పీచ్ పై అభ్యంతరం తెలిపారు. గల్లా వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
వైసీపీ ఎంపీలు అడ్డుతగులుతున్నా, గల్లా జయదేవ్ మాత్రం వాడివేడిగా తన స్పీచ్ ను కొనసాగించారు. అయితే, గల్లా కామెంట్స్కు అదే స్థాయిలో వైసీపీ ఎంపీలు కౌంటర్ ఇచ్చారు. అమరావతి విషయంలో చంద్రబాబు చేసిన తప్పిదాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని తెలిపారు. అమరావతికి కూడా ముఖ్యమంత్రి జగన్ న్యాయం చేస్తారని స్పష్టం చేశారు. చంద్రబాబుకు అమరావతిపై అంత ప్రేముంటే అక్కడ కేవలం 20 పీట్ల రోడ్డును మాత్రమే ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే, రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదని, ఎక్కడైనా రాజధాని పెట్టుకోవచ్చని జీవీఎల్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పినా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని జీవీఎల్ వ్యాఖ్యానించారు.