దమ్ముంటే రా...అంటూ జగన్ కు బాబు సవాల్... మరోసారి పోరాటానికి పవన్ రెడీ...

కేంద్రం చెప్పినట్లు రాజధానిని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రానికే ఉన్నా... మార్చే హక్కు మాత్రం లేదన్నారు చంద్రబాబు. జగన్ కు దమ్ముంటే అమరావతిపై బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబు సవాలు విసిరారు. జగన్ రాజీనామా చేసి... మూడు రాజధానులపై రెఫరెండం పెట్టాలన్న బాబు... మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతామంటే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. అమరావతిని కేంద్రం ఆమోదించిందన్న చంద్రబాబు... దాన్నెలా మారుస్తారని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు కూడా ఇస్తోందని... ఇఫ్పుడు రాజధానిని మారిస్తే ఆ నిధులు కూడా ఆగిపోతాయని వాదిస్తోంది.

మరోవైపు, అమరావతి ఆందోళనల్లో మరోసారి పాల్గొనడానికి జనసేనాని రెడీ అవుతున్నారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటున్న పవన్ కళ్యాణ్... ఫిబ్రవరి పదిన రైతుల ఆందోళనల్లో పాలుపంచుకోనున్నట్లు తెలిపారు. అమరావతి రైతులు, మహిళల ఆందోళనలు, దీక్షలు 50రోజులు దాటిన నేపథ్యంలో స్పందించిన పవన్.... రాజధాని ప్రజలు చేస్తున్న శాంతియుత ఉద్యమం తెలుగు జాతి మొత్తానికి స్ఫూర్తిదాయమన్నారు. అయితే, బీజేపీతో పొత్తు పెట్టుకుని కలిసి పయనిస్తోన్న జనసేనాని స్టాండ్ కి భిన్నంగా ఏపీ రాజధాని ఇష్యూపై కేంద్రం ప్రకటన చేయడం పవన్ ను ఇరకాటంలో పడేసింది. రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర పరిధిలోని అంశమని... రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమని కేంద్రం స్పష్టం చేయడంతో... అమరావతి రైతులకు పవన్ ఏం చెబుతారో చూడాలి.

ఇక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐ నేతలు ఘాటు విమర్శలు చేశారు. రాజధాని అంశంపై రాష్ట్రం పరిధిలోనిదని... కేంద్రానికి సంబంధం లేదని చెప్పడం చూస్తుంటే... జగన్, మోడీ కుమ్మక్కయ్యారని అర్ధమవుతోందన్నారు. బీజేపీ, వైసీపీ మధ్య రహస్య ఒప్పందం నడుస్తోందని, అందుకే రాజధానిపై అధికారం రాష్ట్రానిదేనంటూ కేంద్రం ప్రకటించిందని విమర్శించారు. అయితే, టీడీపీ, సీపీఐ నేతల వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. ఏపీ రాజధాని వివాదంపై కేంద్రం స్పష్టత ఇచ్చినా భ్రమ కలిగించేలా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని మండిపడుతున్నారు. రాజధాని ఏర్పాటు అనేది రాష్ట్రం పరిధిలోని అంశమేనని బీజేపీ ఎంపీ జీవీఎల్, అలాగే ఎమ్మెల్సీ మాధవ్ తేల్చిచెప్పారు. అయితే, రాజధాని పేరుతో ఏపీలో రాజకీయ, రాక్షస, వ్యాపార క్రీడ జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబు చేసిన తప్పులనే జగన్ కూడా చేస్తున్నారని విమర్శించారు.

ఇదిలాఉంటే, అమరావతి పరిరక్షణ సమితి, రైతుల బృందం ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలుస్తూ రాజధానిపై వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ విన్నవిస్తున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ను కలిసిన జేఏసీ, రైతులు.... ఏపీ రాజధాని తరలింపు వల్ల జరిగే నష్టాన్ని వివరించారు.

Teluguone gnews banner