కొవ్వూరు మాజీ ఎమ్మెల్యేపెండ్యాల మృతి
posted on May 21, 2024 @ 4:09PM
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) అనారోగ్యంతో మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఇవాళ తెల్లవారుజామున కృష్ణబాబు చనిపోయినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.
కృష్ణబాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం దొమ్మేరుకు తరలించారు. బుధవారం నాడు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా, కృష్ణారావు టీడీపీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
కాగా, టీడీపీకి కంచుకోట అయిన కొవ్వూరు నియోజకవర్గంలో ఆంధ్రా షుగర్స్ అధినేత ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ మేనల్లుడు అయిన పెండ్యాల కృష్ణబాబు ఇక్కడి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, నియోజకవర్గాల పునర్విభజనలో కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో కృష్ణబాబు తెరపై నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత టీడీపీ నుంచి టీవీ రామారావు ఎమ్మెల్యే అయ్యారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన జవహార్ మంత్రి కూడా అయ్యారు. అయితే, నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైనా.. పెండ్యాల కుటుంబానిదే ఈ నియోజకవర్గంలో పైచేయి. ముఖ్యంగా కృష్ణబాబు సోదరుడు అచ్చిబాబు చెప్పినట్లే అక్కడ వినాల్సిన పరిస్థితి ఉంటుంది.