తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించనున్న రైతు బిడ్డ

ఉన్న ఊరు కన్న తల్లి అంటారు. అందులోనూ రైతుకు అయితే ఉన్న ఊరే కాదు.. తాను సాగు చేసే భూమి కన్నతల్లి కంటే ఎక్కువే. రైతుకు భూమితో ఉన్న అనుబంధాన్ని పోల్చడానికి ఏ బంధమూ సరిపోదు.  రైతు బిడ్డ ఏ దేశమేగిగా, ఎందు కాలిడినా సొంత గడ్డ, తాను సాగు చేసిన పొలం మీదే ధ్యాస ఉంటుంది. ఎక్కడా ఇమడ లేడు. ఎప్పుడెప్పుడు వచ్చి సొంత ఊర్లో, సొంత భూమిలో సాగు చేసుకుందామా అని తహతహలాడుతుంటాడు. అదిగో అచ్చం అలాంటి పదహారణాల రైతు ఉదంతమిది. భూమితో ఉన్న అనుబంధానికి తార్కానంగా తన సొంత భూమిలో తాను బతికుండగానే తన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. వివరాల్లోకి వెడితే..

కళ్లెం నరసింహారెడ్డి పదహారణాల రైతు. ప్రస్తుతం ఆయన వయస్సు 89 ఏళ్లు.  ఈ వయసులోనూ వ్యవసాయం మీద మమకారం పోలేదు. భూమిపై అనురక్తి తగ్గలేదు. సొంత ఊరు, దేశం వదిలి మూడు దశాబ్దాల పాటు అమెరికాలో ఉన్నా.. ఆయన వ్యాపకం వ్యవసాయమే.  అమెరికాలో ఐదువేల ఎకరాలు లీజుకు తీసుకుని రకరకాల పంటలు సాగు చేసి రికార్డు సృష్టించారు. అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ నుంచి  ఉత్తమ రైతు అవార్డు  కూడా అందుకున్నారు.

అయితే మాతృభూమిపై మమకారం తీరలేదు. అందుకే స్వదేశానికి, అందులోనూ సొంతగడ్డ తెలంగాణకు వచ్చేశారు.  చిలుకూరు సమీ పంలో తన పేరుమీద అంటే కళ్లెం నర్సింహా రెడ్డి పేరుతో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకున్నారు.  ఎన్నో సాగు పద్దతులతో  పేరు గడించిన కళ్లెం ఇప్పుడు తన సొంత ఫామ్ లో మొక్కలు...చెట్లు పెంచిప్రకృతి లోనే జీవితం గడుపుతున్నారు. నిత్యం తన వ్యవసాయ క్షేత్రంలో కలియదిరగందే, ఆయనకు రోజు గడవదు, నిద్రపట్టదు. తొమ్మది పదులకు చేరువ అవుతున్న ఈ వయస్సులోనూ ఆయన పనులు ఆయనే చేసుకుంటారు.   తెలంగాణ పల్లె నుంచి అమెరికా దాకా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కళ్లెం నర్సింహా రెడ్డి ఇప్పుడు నేల తల్లితో తన మమకారాన్ని వినూత్నంగా చాటి వార్తల్లోకి ఎక్కారు. ఇంతకీ ఆయన ఏం చేశారంటే.. తన వ్యవసాయ క్షేత్రంలో తన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరణించిన తన భార్య విగ్రహం పక్కనే తన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుని మరణించిన తరువాత తాను తన భూమాతతో అనుబంధం కొనసాగుతుందని చాటారు.  

తన భార్య ప్రథమ వర్ధంతి సందర్భంగా శుక్రవారం (డిసెంబర్ 19)న ఈ విగ్రహాలను ఆవిష్కరిం చనున్నారు. అంతే కాకుండా భార్య మరణానంతరం కూడా ఆమెకు తోడుగా తాను ఉన్నానని కూడా ఈ విగ్రహాల ఏర్నాటు చేసినట్లు ఆయన చెబుతారు. ఈ విగ్రహాలను కళ్లెం నరసింహారెడ్డి స్వయంగా శుక్రవారం (డిసెంబర్ 19) ఆవిష్కరించనున్నారు.  ఆమె  ఓంటరిగా ఉండొద్దు అనే ఉద్దేశంతో తన విగ్రహాన్ని కూడా పక్కనే పెట్టుకుంటున్నారు. ఈ విగ్రహాలు స్వయంగా ఆయనే ఆవిష్కరిస్తారు.

పెరిగిన చలి తీవ్రత...స్కూల్స్ టైమింగ్స్ మార్పు

  తెలంగాణలో చలి తీవ్రత అధికంగా పెరిగింది. అన్ని జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సాయంత్రం నుంచి ఉదయం వరకు బయటకు రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరగటంతో జిల్లా కలెక్టర్ స్కూల్స్ టైమింగ్స్ మార్చుతూ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్ధులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోని ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఇప్పటి వరకు ఉదయం 9 గంటలకు నుంచి సాయంత్రం 4 :15 గంటల వరకు ఉన్న బడి సమయాలను ప్రస్తుతం 09:40 గంటల నుంచి సాయంత్రం 04 :30 గంటలకు మార్చారు. అటు ఇతర జిల్లాల్లోనూ స్కూల్ టైమింగ్ మార్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. గత మూడు రోజుల నుంచి సాధారణం కంటే 4 డిగ్రీలకు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు అధికారులు. ఆయా జిల్లాల ప్రజలు అత్యవసరం అయితే తప్ప రాత్రిపూట కనీస జాగ్రత్తలు లేకుండా బయటికి రావొద్దని సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధ వ్యాధులతో బాధ పడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు

భూవివాదాల్లో నేతల జోక్యం సంహించం : డిప్యూటీ సీఎం పవన్

  భూ వివాదాల్లో రాజకీయ నాయకుల జోక్యాన్ని ఎంత మాత్రమూ సహించొద్దని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు డిప్యూటీ సీఎం పవన్, సీఎం చంద్రబాబు ఆదేశించారు. విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో కొన్ని భూ వివాదాల్లో రాజకీయ నాయకుల ప్రమేయంపై ఫిర్యాదులు వచ్చాయిని ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖ జోన్ లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. రాజకీయ నాయకుల ప్రమేయం వల్ల అధికారులు కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారని సీఎం పేర్కొన్నారు.  విశాఖ, విజయనగరం, అనకాపల్లి తదితర జిల్లాల్లో రాజకీయ నాయకుల జోక్యంపై ఫిర్యాదులు రాకూడదని, ఎవరి మీద ఫిర్యాదు వచ్చినా వదిలిపెట్టవద్దని ముఖ్యమంత్రి కలెక్టర్లును కోరారు. సౌండ్ పొల్యూషన్ గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  ప్రస్తావించారు. మతం పేరుతో విపరీతమైన సౌండ్ పెట్టి కార్యక్రమాలు, వేడుకలు, ప్రార్థనలు చేయడం తప్పుని పేర్కొన్నారు. ఎక్కడైనా కేవలం చట్టం మరియు సుప్రీంకోర్టు ఆదేశం మాత్రమే అమలులో ఉంటాయి డిప్యూటీ సీఎం తెలిపారు.  నిర్దేశించిన డెసిబుల్స్ లోనే సౌండ్ ఉండాలి. ఇందుకు సంబంధించి ఉన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు పవన్ తెలిపారు. భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత తీసుకువచ్చేందుకు అన్ని రిజిస్ట్రేషన్, ఆస్తి పత్రాలను డిజిటలైజేషన్ చేస్తున్నామని సీఎం వివరించారు. 20-30 ఏళ్లుగా ఇళ్లలో నివసిస్తున్న వారికి పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. చివరగా, జిల్లాల వారీగా రెవెన్యూ రాబడులపై దృష్టి సారించాలని, పన్ను ఎగవేతలు, మానిప్యులేషన్ జరగకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రం ఒక్కరోజు కూడా ఆదాయం కోల్పోవడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు.   

తెలంగాణ గ్రూపు-3 ఫలితాలు విడుదల

  తెలంగాణ గ్రూపు-3 ఫలితాలను టీజీపీఎస్‌సీ విడుదల చేసింది.  మొత్తం 1370 మంది ఎంపికైనట్లు టీజీపీఎస్‌సీ వెల్లడించింది. అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికెషన్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవలే ఫలితాలు విడుదల చేసింది. జనరల్‌ ర్యాంకుల జాబితాను కమిషన్‌ ప్రకటించింది. గత ఏడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో నిర్వహించిన గ్రూప్‌-3 పోస్టులకు 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 50.24 శాతం మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు.  పురుషుల్లో టాప్‌ ర్యాంకర్‌కు 339.24 మార్కులు, మహిళా టాప్‌ ర్యాంకర్‌కు 325.15 మార్కులొచ్చాయి.  2022 లో 1388 పోస్టుల భర్తీకి గ్రూప్ 3 నోటిఫికేషన్ వెలువడింది. గత ఏడాది నవంబర్ 17,18 తేదీల్లో పరీక్షలు జరిగాయి. కోర్టు కేసులు, గ్రూప్-1,2 వివాదాల కారణంగా గ్రూప్-3 ఫలితాలు ఆలస్యంగా విడుదల చేశారు.  

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

  ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో సుప్రీంకోర్టు వారం రోజులపాటు ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకొని విచారణ చేసేందుకు అనుమతించిన విషయం తెలిసిందే... ఈ మేరకు మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుపై వారం రోజులపాటు సాగిన కస్టోడియల్ విచారణ ఈరోజుతో ముగిసింది. ఈ మేరకు రేపు సుప్రీంకోర్టుకు పూర్తి స్థాయి నివేదికను సమర్పించేందుకు సిట్ అధికారులు సిద్ధమవు తున్నారు. అయితే అధికారులు ప్రభాకర్ రావు ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేసిన సమయంలో ప్రభాకర్ రావు కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని, నోరు మెదపలేదని అధికా రులు పేర్కొంటున్నారు.  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అత్యంత కీలక అంశాలను ఆయన దాటవేస్తున్నారని సిట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు మరికొన్ని రోజుల పాటు కస్టోడియల్ విచారణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును మరోసారి కోరే అవకాశ ముందని సమాచారం....ఈ కేసులో నిజాలు వెలుగులోకి రావాలంటే ప్రభాకర్ రావును ఇంకా కస్టడీలో ఉంచి విచారణ కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. సిట్ సమర్పించనున్న నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేయనుంది. ఆదేశాలు వచ్చే వరకు ప్రభాకర్ రావు పోలీసుల కస్టడీలోనే కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం రాజకీయంగా, పరిపాలనాపరంగా కీలకంగా మారనుంది.

నాటు సారాను అరికట్టాలి కలెక్టర్లకు... సీఎం చంద్రబాబు సూచన

  అమరావతిలో రెండు రోజుల పాటు సాగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్  ముగిసింది. ముగింపు ఉపన్యాసంలో సీఎం  చంద్రబాబు నాయుడు రాష్ట్ర పునర్నిర్మాణం, ఆర్థిక స్థిరీకరణ, పీపీపీ విధానాలు, విద్యుత్ రంగం, పాలనలో సంస్కరణలపై విస్తృతంగా మాట్లాడారు. గత పాలనలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి తీసుకురాగలిగామని, రూ.21 లక్షల కోట్ల పెట్టుబడులకు రికార్డు స్థాయిలో ఒప్పందాలు కుదిరాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. విద్యుత్ రంగంపై మాట్లాడుతూ యూనిట్‌కు రూ.1.20 మేర కొనుగోలు ధర తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.  పీపీఏల రద్దుతో గతంలో విద్యుత్ వ్యవస్థ నాశనం అయ్యిందని, డిస్కంలు–ట్రాన్స్‌కోలపై రూ.1,25,633 కోట్ల భారం పడిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.11,320 కోట్ల మేర భారం తగ్గించామని, విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. రుణ నిర్వహణను సమర్థంగా చేపట్టి, అధిక వడ్డీలతో తీసుకున్న అప్పులను రీషెడ్యూలింగ్ చేస్తున్నామని తెలిపారు. పీపీపీ వైద్య కళాశాలల అంశంపై సీఎం ఘాటుగా స్పందించారు. పీపీపీ విధానంలో అభివృద్ధి జరుగుతుందని, ఈ విధానంలో చేపట్టే ప్రాజెక్టులు ప్రభుత్వ ఆస్తులుగానే ఉంటాయని, నిబంధనలు ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పారు. ప్రైవేటు సంస్థలు నిర్వాహకులుగా మాత్రమే ఉంటాయని, సీట్లు పెరుగుతాయే తప్ప ఫీజులు పెరగవని భరోసా ఇచ్చారు. 70 శాతం వరకు ఎన్టీఆర్ వైద్యసేవల కింద ఉచిత చికిత్స అందుతుందని, పీపీపీ మెడికల్ కాలేజీలు రెండేళ్లలోనే సిద్ధమవుతాయని అన్నారు. ఈ విషయంలో బెదిరింపులు చేయడం రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. పాలన, శాంతిభద్రతలపై మాట్లాడుతూ కలెక్టర్లు, ఎస్పీలు జిల్లాల్లో నేరాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. వ్యక్తుల ప్రతిష్టను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో చేసే పోస్టులను సహించవద్దని స్పష్టం చేశారు. నేరాల దర్యాప్తులో వేగం పెంచాలని సూచించారు. పాలనలో డిజిటలీకరణపై సీఎం కీలక ప్రకటన చేశారు. జనవరి 15 నుంచి అన్ని శాఖల ఫైళ్లు, ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లో ఉండాలని, అప్పుడే ప్రజలు సంతృప్తి చెందుతారని అన్నారు.  ఇప్పటివరకు ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ద్వారా మంచి ఫలితాలు సాధించామని, ఇకపై ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం ఎస్క్రో ఖాతా విధానం తీసుకొచ్చినట్లు తెలిపారు. గత 18 నెలల్లో ద్రవ్యోల్బణం, నేరాల రేటును తగ్గించగలిగామని, నాటు సారా నియంత్రణకు తీసుకొచ్చిన ‘మార్పు’ ప్రాజెక్టు రోల్ మోడల్‌గా నిలిచిందని చెప్పారు. సారా తయారీదారులకు పునరావాసం, ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. తిరుమల ప్రసాదంలో నాణ్యతను పునరుద్ధరించామని, అన్నా క్యాంటీన్లు, పెన్షన్లు వంటి సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు.  రాష్ట్రం 18 నెలల్లోనే రికవరీ అవుతుందని, పునర్నిర్మాణం సాధ్యమవుతుందని తాను కూడా ఊహించలేదని సీఎం పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన సమావేశాలన్నింటికంటే ఐదవ కలెక్టర్ల కాన్ఫరెన్స్ అత్యంత విజయవంతంగా జరిగిందని ప్రశంసించారు.  

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అద్భుతమైన ఫలితాలు : సీఎం రేవంత్‌

  తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అఖండ విజయం సాధించడంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 7,527 స్థానాల్లో విజయం సాధించగా, మరో 808 చోట్ల కాంగ్రెస్ రెబల్స్ గెలుపొందారని తెలిపారు. బీఆర్‌ఎస్ 3,511, బీజేపీ 710 చోట్లు గెలిచినట్లు  ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విజయం ప్రభుత్వ ప్రజాపాలనకు నిదర్శనమని, గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.  66%  ఫలితాలు కాంగ్రెస్ పార్టీకే వచ్చాయిని రేవంత్ పేర్కొన్నారు. ఈ ఫలితాలు మా రెండేళ్ల పాలనకు నిదర్శనమని ముఖ్యమంత్రి తెలిపారు. 2029 లో కూడా కాంగ్రెస్ పార్టీదే అధికారం అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ 1/3 స్థానాలు మాత్రమే గెలిచిందని ఇప్పటికైనా అహంకారం, అసూయ తగ్గించుకోవాలని సీఎం హితవు పలికారు . ఈ ఫలితాలతోనైనా బీఆర్‌ఎస్ వాళ్లకి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడం దారుణమని సీఎం అన్నారు. కేంద్రంలోని బీజేపీ.. రాహుల్‌గాంధీపై కోపంతో రాజకీయం చేస్తోందన్నారు. గాంధీ అనే పేరు ఎక్కడా కనిపించకూడదని కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ దురాలోచన చేస్తోందని విమర్శించారు. 

8 నెలల క్రితం ప్రేమ పెళ్లి...భార్యను కొట్టి చంపిన భర్త

  రెండక్షరాల ప్రేమ అనే మత్తులో పడిన యువతి తన తల్లిదండ్రులను ఒప్పించి... ప్రేమపెళ్లి చేసుకొని సంవత్సరం గడవకముందే భర్త తన విశ్వరూపం చూపించడంతో అది భరించలేక మృతి చెందిన ఘటన తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చింది. వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణంలో ఉన్న సాయిపూర్ ప్రాంతంలో మానవత్వాన్ని కలిచివేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త, అత్తమామలు కలిసి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన అనూష (20) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వికారాబాద్ జిల్లాకి చెందిన అనూష, తాండూరు కి చెందిన పరమేష్ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు అంగీకరిస్తూ...ఎనిమిది నెలల క్రితం పరమేష్‌ను, అనూష  ప్రేమ వివాహం చేసుకుంది. కోటి ఆశలతో అత్తారింటిలో అడుగు పెట్టిన అనూషకు వేధింపులే ఎదురైయ్యాయి. అయితే ఈ పెళ్లి పరమేష్ తల్లిదండ్రులకు ఇష్ట్రం లేకపోవడంతో మొదటి నుంచి అనూషను వేధింపు లకు గురి చేస్తున్నారు. ప్రేమ పెళ్లిని అంగీకరించని అత్తమామలు అనూషతో తరచూ గొడవలకు దిగేవారు. ఇటీవల జరిగిన గొడవలో భర్త పరమేష్ కూడా జోక్యం చేసుకుని తల్లిదండ్రులతో కలిసి అనూషపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయ పడిన అనూషను వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అనూష మృతి చెందిన విషయం కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కూతురు మరణించింది అని తెలియగానే ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. అత్త, మామ, భర్త కలిసి ప్రతిరోజు వేధింపులకు గురి చేసే వారిని.. తన కూతురిపై  దాడి చేయడం వల్లే తన కూతురు మరణించింది అంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అనూష మరణించిందని తెలియగానే  భర్త పరమేష్‌తో పాటు అత్త లాలమ్మ, మామ మొగులప్ప పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అనూష తల్లి చంద్రమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “పలుమార్లు వరకట్నం తీసుకురావాలంటూ నా బిడ్డతో గొడవ పడేవారు. ప్రతిరోజు నా బిడ్డను వేధింపులకు గురిచేసే వారిని... అత్త మామ భర్త ముగ్గురు కలిసి బాగా కొట్టి చివరకు ఆమె ప్రాణాలు తీసేశారు” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన మరోసారి ప్రేమ వివాహాలపై కుటుంబ విరోధం, వరకట్న వేధింపులు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో స్పష్టం చేస్తోంది. పోలీసులు నిందితులను త్వరగా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

కమ్మేసిన పొగమంచు.. ఢిల్లీలో విమాన రాకపోకలకు అంతరాయం

దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 40 విమానాల రాకపోకలు జాప్యమయ్యాయి. పది విమాన సర్వీసులు రద్దయ్యాయి.   అలాగే రైళ్ల రాకపోకలలో కూడా తీవ్ర జాప్యం జరిగింది.  ఢిల్లీకి రావలసిన, ఢిల్లీ నుంచి బయలు దేరాల్సిన 22 రైళ్ల రాకపోకల్లో గంటల తరబడి జాప్యం జరిగింది. అదే విధంగా దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ పడిపోవడంతో దేశ రాజధాని నగరంలో ట్రాఫిక్ కు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది.  పొగమంచుతో పాటు, ఢిల్లీలో వాయు కాలుష్యం  కూడా తీవ్రస్థాయికి చేరుకుంది.   వాయు నాణ్యత సూచిక 400 కంటే ఎక్కువగా నమోదైంది. మరి కొన్ని రోజుల పాటు పొగమంచు బెడద కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.  

కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌ సోదరులకు దక్కని ఊరట

  ఏపీ నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్‌ సోదరులకు విజయవాడ ఎక్సైజ్ కోర్టులో ఊరట దక్కలేదు. ఏ2 జగన్‌మోహన్‌రావు, ఏ18 జోగి రమేశ్‌, ఏ19 జోగి రాము బెయిల్‌ పిటిషన్లను విజయవాడలోని ఎక్సైజ్‌ కోర్టు తిరస్కరించింది. కొంతమంది నిందితులకు బెయిల్‌ మంజూరు చేసింది. నేటితో రిమాండ్‌ ముగియనుండటంతో జోగి రమేశ్‌, జోగి రాము సహా 13 మంది నిందితులను అధికారులు న్యాయస్థానంలో హాజరు పర్చారు.   ఈనెల 31 వరకు నిందితులకు న్యాయస్థానం రిమాండ్‌ పొడిగించింది. నకిలీ మ‌ద్యం కేసులో తంబ‌ళ్ల‌ప‌ల్లె టీడీపీ ఇన్‌చార్జ్ జ‌య‌చంద్రారెడ్డి, ఆయ‌న పీఏ, అలాగే అదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన టీడీపీ నాయ‌కుడు సురేంద్ర‌నాయుడి ప్ర‌మేయాన్ని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. దీంతో తంబ‌ళ్ల‌ప‌ల్లె ఇన్‌చార్జ్‌గా జ‌య‌చంద్రారెడ్డి, సురేంద్ర‌నాయుడిని టీడీపీ పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడైన జ‌గ‌న్మోహ‌న్‌రావుతో పాటు మ‌రికొంద‌రిని అరెస్ట్ చేశారు. 

శిశువుల విక్రయ ముఠా అరెస్టు

 ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన పసిపిల్లలను బెజవాడలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.  ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి నెలల వయస్సు చిన్నారులను తీసుకువచ్చి ఈ ముఠా విజయవాడ కేంద్రంగా విక్రయాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా ఒక్కో శిశువునూ మూడున్నర నుంచి ఐదులక్షల రూపాయలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠాకు చెందిన ఆరుగురు మహిళలు, ఏడుగురు పురుషులను  పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న ఐదుగురు శిశువులను ఐసీడీఎస్‌కు తరచి ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.