బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపిక.. ఈటల మౌనం వెనుక వ్యూహమేంటి?
posted on Jul 1, 2025 @ 4:24PM
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటలకు అవకాశం ఇవ్వకపోవడం ఆయనను అవమానించడమేనన్న భావన ఈటల అనుచరులలో వ్యక్తం అవుతున్నది. వాస్తవానికి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల కాషాయ కండువా కప్పుకున్న సమయంలోనే పలువురు విస్మయం వ్యక్తం చేశారు. వామపక్ష భావజానం ఉన్న ఈటల బీజేపీలో ఇమడటం కష్టమన్న అభిప్రాయాన్ని అప్పట్లోనే పరిశీలకులు వ్యక్తం చేశారు. వారి విశ్లేషణలకు తగినట్లుగానే ఈటల బీజేపీలో ఇమడ లేకపోతున్నారనీ, ఉక్కపోతకు గురౌతున్నారనీ పలు సందర్భాలలో గట్టిగా వినిపించింది. నిజానికి వామపక్ష భావజాలం ఉన్న ఈటల చేరితే కాంగ్రెస్ లో చేరాలి కానీ.. తన భావజాలానికి పూర్తి వ్యతిరేకమైన బీజేపీ కండువా ఎలా? ఎందుకు కప్పుకున్నారన్న ప్రశ్రలు ఉత్పన్నమయ్యయి. అయితే ఈటల మాత్రం పరిశీలకుల విశ్లేషణలను డౌటానుమానాలను పూర్వపక్షం చేస్తూ ఉక్కపోతకు గురైనా, ఇబ్బందులు పడినా బీజేపీలోనే కొనసాగారు. సాగుతున్నారు. ఈ మధ్యలో బీజేపీ అధిష్ఠానం కూడా ఈటల పాపులారిటీనీ, సిన్సియారిటీనీ గుర్తిస్తూ పార్టీలో సముచిత ప్రాధ్యాన్యత ఇస్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల బరిలో పరాజయం పాలైనా.. లోక్ సభ ఎన్నికలలో ఈటలకు మల్కాజ్ గిరి స్థానం నుంచి పోటీకి అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికలలో విజయం సాధించిన ఈటల ఎంపీ అయ్యారు.
అలాగే బండి సంజయ్ ఈటల మధ్య పొడసూపిన విభేదాల సందర్భంలో బీజేపీ హైకమాండ్ బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి ఈటలకు మద్దతుగా నిలిచింది. సరే బండి సంజయ్ స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. పార్టీలో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో చేరికల కమిటీని ఏర్పాటు చేసిన బీజేపీ ఆ కమిటీకి చైర్మన్ గా ఈటలను నియమించింది. ఈటల ఆధ్వర్యంలో బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయనీ... ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయనీ అంతా ఆశించారు. అదలా ఉంటే బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల నియామకానికి ముందు పార్టీలో ఈటలకు చాలా చాలా అవమానాలు ఎదురయ్యాయని చెబుతారు. కానీ ఈటల బీజేపీలో చేరిన క్షణం నుంచి రాష్ట్రంలో ఆ పార్టీ నిర్వహించిన అన్ని కార్యక్రమాలలోనూ భాగస్వామిని చేయడం, అమిత్ షా, మోడీ వంటి అగ్రనేతల సభలలో కూడా వేదికపై ఆసనం ఇవ్వడంతో ఈటలకు బీజేపీలో ఉక్కపోత అన్న భావన అప్పట్లో పలువురిలో వ్యక్తమైంది.
అయితే బండితో విభేదాలు ఉన్నప్పటికీ ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం పార్టీలో ఈటల గౌరవానికి ఎటువంటి భంగం వాటిల్లలేదు. కానీ కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత మాత్రం ఉద్దేశ పూర్వకంగా ఈటలను తక్కువ చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయని ఈటల సన్నిహితులు చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న తాను పార్టీలోకి చేరికల కోసం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరగడంపై ఈటల అప్పట్లోనే బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కృష్ణయాదవ్ పార్టీలో చేరిక అప్పట్లో చివరి క్షణంలో ఆగిపోవడానికి కిషన్ రెడ్డి కారణమన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి. దీనితో ఈటల ఇక పార్టీలోకి చేరికల విషయంలో ఎటువంటి ప్రయత్నాలూ చేయడం లేదని అంటున్నారు. అలాగే.. ఈటల ద్వారా పార్టీలోకి స్పష్టమైన హామీతో చేరిన తుల ఉమ వంటి వారికి పోటీగా ఇతరులను తీసుకురావడం వంటి ఘటనలతో ఈటల పార్టీ వ్యవహారాలలో పెద్దగా పాల్గొనకుండా అంటీముట్టనట్లు వ్యవహిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
మొత్తం మీద కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నంత కాలం పార్టీలో పరిస్థితి ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా ఉందని పార్టీ వర్గాలే చెప్పేపరిస్థితికి విభేదాలు పెచ్చరిల్లాయి. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి స్థానంలో కొత్త అధ్యక్షుని ఎన్నికపై చర్చ సందర్భంగా ఈటలకు పార్టీ హైకమాండ్ స్పష్టమైన హామీ ఇచ్చిందనీ, కానీ చివరిక్షణంలో హాత్ ఇచ్చి రామచంద్రరావును ఎంపిక చేయడంపై ఆయన వర్గీయులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కాగా రామచంద్రరావుకు తెలంగాణ పార్టీ బాధ్యతలను అప్పగించడంపై ఈటల ఎలా స్పందిస్తారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.