రేవంత్ ఖేల్ ఖతం దూకుడుకు బ్రేకులు

ఇప్పడు కాదు, చాలా కాలం క్రితం, ఆయన పీసీసీ చీఫ్ గా అప్పాయింట్ అయిన కొత్తల్లో కావచ్చు   ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ రాజకీయాలు అర్థం చేసుకోవడం అనుకున్నంత ఈజీ వ్యవహారం కాదని  అన్నారు. ఇప్పుడు ఆయన పరిస్థితి చూస్తుంటే ఇప్పటికీ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ రాజకీయాలు పూర్తిగా అర్థమైనట్లు లేదు. నిజానికి రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఎలా వచ్చింది అనేది అందరికీ తెలిసిన విషయమే. సంచులు చేతులు మారాయి

అనే ఆరోపణలలో నిజం వుందో లేదో కానీ  రాహుల్ గాంధీ సంపూర్ణ  మద్దతుతోనే రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి దక్కింది అనేది మాత్రం, రేవంత్ రెడ్డి సహా అందరూ హండ్రెడ్ పెర్సెంట్  అంగీకరిస్తున్న విషయం. పంజాబ్ పీసీసీ చీఫ్ గా నవజ్యోతి సింగ్ సిద్దు, తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి పేర్లను రాహుల్ గాంధీనే ఓకే చేశారు. అందుకే, రేవంత్ రెడ్డి నియామకాన్ని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాలా వరకు అయిష్టంగా అంగీకరించారే కానీ, హృదయపూర్వకంగా స్వాగతించలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన సీనియర్ నాయకులు...  ఎక్కడో పుట్టి ఇంకెక్కడో పెరిగి వచ్చిన రేవంత్ రెడ్డి  మూడేళ్ళు అయినా నిండకుండానే, పార్టీ బాస్ గా పెత్తనం చెలాయించడం అనే ఉహనే, జీర్ణించుకోలేక పోయారు. అందుకే ఆయన అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో అసమ్మతి సెగ రాజుకుంటూనే వుంది. మునుగోడు  ఉప ఎన్నిక  ఓటమికి కూడా రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల పార్టీ సీనియర్  నాయకుల అసమ్మతి, వ్యతిరేకతలే కారణం.   

అలాగే  నిన్నటిదాక కాంగ్రెస్ రాష్ట్ర  వ్యవహారాల ఇన్ చార్జిగా వ్యవహరించిన మాణిక్యం ఠాగూర్‌  కారాణాలు ఏవైనా రేవంత్ రెడ్డికి, అన్ని విధాల సహకరిస్తూ వచ్చారు. నిజానికి మునుగోడు ఓటమి తర్వాత తిరుగుబాటు జెండా ఎగరేసిన తర్వాత, జీ 9 అసమ్మతి నేతలు  రేవంత్ రెడ్డి వ్యవహర సరళిని, ఒంటెద్దు పోకడలను ఎంతగా వ్యతిరేకించారో, మాణిక్యం ఠాగూర్‌  వ్యవహార శైలిని అంతలా ఎండగట్టారు. ఆ ఇద్దరి కారణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరుకుందని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి తప్పొప్పులకు కర్త, కర్మ,క్రియ అన్నీ ఠాగూరే అని ఫిర్యాదు చేయడమే కాకుండా ఆయన స్థానంలో రాష్ట్ర రాజకీయల పట్ల అవగాహన ఉన్న  సీనియర్ నాయకులను రాష్ట్ర వ్యవహారాల బాధ్యునిగా నియమించాలని కేంద్ర దూతగా వచ్చిన దిగ్విజయ్ సింగ్ వద్ద మొర పెట్టుకున్నారు. 

అయితే ఇది పార్టీని బతికించుకునేందుకు చేసిన ప్రయత్నమా  అంటే కాదు. ఠాగూర్‌ కు ఉద్వాసన పలికితే పీసీసీ అధ్యక్ష పదవి నుంచి రేవంత్ రెడ్డిని సాగనంపడం ఈజీ అవుతుందని భావించిన సీనియర్లు  వ్యూహాత్మకంగా పావులు కదిపారు.  ఏదైతే నేమి, చివరకు ఫస్ట్ రౌండ్ లో రేవంత్’పై సీనియర్లు విజయం సాధించారు. దిగ్విజయంగా ...ఠాగూర్‌ ను గోవాకు పంపారు.  ఆయన స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన బాధ్యునిగా, మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు మాణిక్‌రావు థాకరేను ఏఐసీసీ అధిష్టానం నియమించింది. దీంతో ఇప్పటికే సీనియర్ల నుంచి సమస్యలు ఎదుర్కుంటున్న రేవంత్ రెడ్డి ముందు ముందు మరింతగా  సమస్యలు ఎదుర్కోక తప్పదని అంటున్నారు. 

మాణిక్‌రావు థాకరే మహారాష్ట్రకు చెందిన నేత.  గతంలో ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. బీజేపీ, శివసేన ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శించిన నాయకుడిగా ఆయనకు పేరుంది. ఆయన్ను తెలంగాణకు బాధ్యునిగా యమించడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. మాణిక్యం ఠాగూర్‌ ను దిగ్విజయంగా సాగనంపిన సీనియర్లకు నెక్స్ట్ టార్గెట్ రేవంత్ అవుతారని అంటున్నారు. మరో వంక రాహుల్ గాంధీ పార్టీ వ్యవహారాలలో పెద్దగాజోక్యం చేసుకోవడం లేదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లతో దీర్ఘకాల సైద్ధాంతిక పోరాటానికే రాహుల్ ప్రాధాన్యత ఇస్తున్నారు.  పార్టీ సంస్థాగత వ్యవహరాల్లో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు గాంధీ ఫ్యామిలీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. చివరకు పార్టీలో తన పాత్ర ఏమిటో కూడా అధ్యక్షుడు ఖర్గేజీ  నిర్ణయిస్తారని రాహుల్ గాంధీ పలు మార్లు స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్ర తెలంగాణలో సాగుతున్న సమయంలోనూ రాహుల్ గాంధీ అదే విషయం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇక ఎంతో  కాలం పీసీసీ పదవిలో కొనసాగలేరని పరిశీలకులు అంటున్నారు. 

అందుకే కావచ్చు  రేవంత్ రెడ్డి స్వరం మారిందని, దూకుడుకు బ్రేకులు పడ్డాయని అంటున్నారు.  బుధవారం(జనవరి 4) పీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన శిక్షణ తరగతుల్లో రేవంత్ రెడ్డి అయిందేదో అయింది, ఇకపై విభేదాలు మరచి అందరం ఒకటిగా కలిసి కట్టుగా పని చేద్దామని పిలుపు నిచ్చారు. అంతే కాదు ఇంకో అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే మెరుగైన స్థాయికి వెళుతుందననుకుంటే తన పీసీసీ పదవి వదులుకుంటానని చెప్పారు. పీసీసీ వదులుకుంటే పార్టీ అధికారంలోకి వస్తుందంటే.. తాను రాజీనామా చేయడానికి సిద్ధమని అన్నారు.  పార్టీలో చిన్న చిన్న గొడవలు ఉంటాయని.. నేతలు సర్దుకుపోవాలని సూచించారు. తాను ఎవరినీ ఇబ్బంది పెట్టాలని అనుకోలేదని అన్నారు. అదుకే నిన్న మొన్నటి వరకు సీనియర్ నాయకులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఛీ .. ఛా .. అంటూ అవమానించిన రేవంత్ రెడ్డిలో ఈ మార్పు దేనికి సంకేతం  అనే చర్చ రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. ఠాగూర్‌ ఉద్వాసనతో రేవంత్ సీటుకు ముప్పు పొంచి ఉన్నట్లేనని అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే, రేవంత్ ఖేల్ ఖతం  అనే మాట పార్టీ సీనియర్ నేతల నోట వినవస్తోందని   అంటున్నారు. అయితే  రాజకీయ పరిశీలకులు మాత్రం  రేవంత్ రెడ్డికి తక్షణ ఉద్వాసన ఉండక పోవచ్చును కానీ, ఆయన దూకుడుకు మాత్రం బ్రేకులు పడినట్లే అంటున్నారు.