వైసీపీ ఎంపీలకు అవమానం? నిరూపిస్తే క్షమాపణ చెబుతానన్న మంత్రి నాని

పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధి మండలి సమీక్షా సమావేశాన్ని వైసీపీ ఎంపీలు బాయ్ కాట్ చేశారు. దాంతో, ఈ వ్యవహారం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. సమావేశ మందిరానికి ముందుగా వచ్చిన ఇన్ ఛార్జ్ మంత్రి పేర్నినాని, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని... అలాగే కలెక్టర్ ముత్యాలరాజులు వేదికపై కూర్చున్నారు. అయితే, ఆ తర్వాత వచ్చిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా వేదికపైకి వెళ్లారు. అనంతరం వచ్చిన వచ్చిన ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గాని భరత్ లు వేదిక ముందున్న మొదటి వరుసలో కూర్చున్నారు. అయితే, అంతకు ముందే వేదికపైకి వెళ్లిన ఎంపీ రఘురామకృష్ణంరాజు హఠాత్తుగా సమావేశం నుంచి వెళ్లిపోయారు. దాంతో, మరో ఎంపీ కోటగిరి శ్రీధర్ కూడా  రఘురామకృష్ణంరాజు వెంటే బయటికి వెళ్లిపోయారు. దాంతో, సమావేశంలో కలకలం రేగింది. అయితే, వేదికపై కూర్చోకూడదని కొందరు ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సూచించారని, దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన బయటకు వచ్చేశారన్నది సహచరులు చెబుతున్నారు. ఇదే విషయంలో ఎంపీ కోటగిరి శ్రీధర్ కూడా సమావేశం నుంచి బాయ్ కాట్ చేయగా... మరో ఎంపీ ఎంపీ మార్గాని భరత్‌ సైతం సమావేశం తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. తాము ఆరేడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రతినిధులమనీ, వేదికపై తమకు చోటు లేకపోవడం అవమానమని అన్నారు. ఎంపీలకు ప్రొటోకాల్‌ పాటించకపోతే ఎలా అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. అయితే, అందరికీ ప్రొటోకాల్‌ పాటిస్తూనే ఉన్నామన్నామని పశ్చిమగోదావరి జిల్లాఇన్ ఛార్జ్ మంత్రి పేర్నినాని వివరణ ఇచ్చారు. ప్రొటోకాల్‌ పాటించలేదని ఎవరైనా నిరూపిస్తే బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి సిద్ధమని ప్రకటించారు. 
 
అయితే, పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశం నుంచి బాయ్ కాట్ చేయడంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ప్రోటోకాల్ ప్రకారం అధికారుల కంటే తామే ఎక్కువన్నారు. దిశ కమిటీకి, లోక్‌సభలో సబ్‌ ఆర్డినేట్‌ లెజిస్లేటివ్‌ కమిటీకి చైర్మన్‌గా ఉన్న తనకు డీఆర్సీ మీటింగ్ లో సముచిత స్థానం ఉంటుందని భావించానని, కానీ అలా జరగలేదన్నారు. తనకు జరిగిన ఈ అవమానం... తనకు ఓట్లు వేసిన ప్రజలకు జరిగిన అవమానంగా భావిస్తున్నానన్నారు. అధికారులు తమ కంటే ఎక్కవని నిబంధనలు చెబితే... తాను అలాంటి మీటింగ్‌లకు ఇక మీదట వెళ్లబోమన్నారు. ఈ విషయమై జిల్లా మంత్రి ఆళ్ల నాని క్షమాపణ చెబుతారని భావిస్తున్నా అన్నారు. తదుపరి సమావేశాల్లో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటారని అనుకుంటున్నానన్నాని... ఒకవేళ అలా జరగకపోతే ఇక ముందు జరిగే మీటింగ్‌లకు వెళ్లబోమని రఘురామకృష్ణంరాజు తేల్చిచెప్పారు.

Teluguone gnews banner