ఇంటర్ విద్యార్ధినిని రేప్ చేసిన డాక్టర్

 

ఢిల్లీ పహర్ గంజ్ లో ఈ దారుణం జరిగింది. విదేశాల్లో వైద్య విద్యకి సంబంధించిన సీటిప్పిస్తానంటూ అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన ఓ డాక్టర్ బాధితురాలికి మాయమాటలు చెప్పాడు. నిజమేనని నమ్మింది.  కాన్సొలేట్ అధికారిని కలవడానికి వెళ్దామని చెప్పి ఓ హోటల్ కి తీసుకెళ్లాడు. అదేమని అడిగితే కాన్సులేట్ అధికారులు బైట కలవరు, పెద్దపెద్ద హూటళ్లలోనే వాళ్లతో మాట్లాడాలి అని చెప్పాడు. తను నిజమేనని నమ్మేసింది. కాన్సులేట్ అధికారిని కలిసొస్తానని ఇంట్లో చెప్పి డాక్టర్ తో వెళ్లింది. పథకం ప్రకారం బాధితురాలిని వంచించిన డాక్టర్.. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఆమె స్పృహకోల్పోగానే అత్యాచారం జరిపాడు. మెలకువ వచ్చిన తర్వాత.. ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ బెదిరించాడు. బెదిరిపోయి ఇంటికెళ్లిన పిల్ల వాలకాన్ని చూసి తల్లికి అనుమానమొచ్చింది. అక్కున జేర్చుకుని అడిగితే బిడ్డ భోరుమంది. తమకు జరిగిన అన్యాయం గురించి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.