కేజ్రీవాల్దే ఢిల్లీ పీఠం... బీజేపీ ఆశలు గల్లంతు... కాంగ్రెస్ డిపాజిట్లే గల్లంతు..!
posted on Feb 8, 2020 @ 7:01PM
ఢిల్లీ పీఠం మళ్లీ కేజ్రీవాల్దేనని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. సర్వే సంస్థలన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకే పట్టం కట్టాయి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీకి ఎదురే లేదని తేల్చిచెప్పాయి. ఇక, జాతీయ ఛానెల్స్ కూడా కేజ్రీవాల్దే మళ్లీ అధికారమని స్పష్టంచేశాయి. బంపర్ మెజారిటీతో మరోసారి కేజ్రీవాల్ అధికారంలోకి రావడం ఖాయమని లెక్కగట్టాయి. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో దాదాపు 60వరకు సీట్లను ఆప్ గెలుచుకుంటుందని అంచనా వేశాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ భారీ విజయం సాధిస్తుందని తెలిపిన టైమ్స్ నౌ.... ఆప్కి 51.... బీజేపీకి 18.... కాంగ్రెస్కి ఒక స్థానం వస్తాయని తేల్చిచెప్పింది. ఇక, రిపబ్లిక్ టీవీ కూడా ఆప్కే పట్టంకట్టింది. కేజ్రీవాల్ మరోసారి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వస్తారని తెలిపింది. రిపబ్లిక్ టీవీ అంచనా ప్రకారం.... ఆప్కు 48 నుంచి 61 సీట్లు... బీజేపీకి 9 నుంచి 21 స్థానాలు..... కాంగ్రెస్కు ఒక స్థానం రావొచ్చని లెక్కగట్టింది. మరో ప్రముఖ ఛానెల్ ఎన్డీటీవీ కూడా కేజ్రీవాల్దే అధికారమని తేల్చిచెప్పింది. ఆమ్ ఆద్మీకి 49 సీట్లు.... బీజేపీకి 20 స్థానాలు.... కాంగ్రెస్కు ఒక సీటు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలో ప్రకటించింది. ఇక, ఇండియా టీవీ కూడా కేజ్రీవాల్ బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తారని తెలిపింది. ఆప్ 44... బీజేపీ 26 స్థానాలు గెలుచుకుంటాయని తెలిపింది.
అయితే, ఒక్క సర్వే కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పలేదు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే బీజేపీ మెరుగైన స్థానాలు సాధిస్తుందని తేల్చాయి. ఇక, కాంగ్రెస్ అయితే చాలాచోట్ల డిపాజిట్లు కోల్పోతుందని ఎగ్జిట్ పోల్ సర్వేల్లో తేలింది.