నో హెయిర్ నో బ్రెయిన్.. టీడీపీ ఎంపీ-వైసీపీ ఎంపీ ఫైట్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్
posted on Feb 8, 2020 @ 5:53PM
వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మధ్య మాటల యుద్ధం లోక్ సభ నుంచి ట్విట్టర్ కి చేరింది. ఇద్దరు నేతలు ట్విట్టర్ వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. వారి విమర్శలు చినికిచినికి వ్యక్తిగతంగా దూషించుకునే వరకు వెళ్లాయి. మిథున్రెడ్డిని అవివేకి అని గల్లా జయదేవ్.. జయదేవ్ తలకి జుట్టులేదు, తలలో మెదడు లేదంటూ మిథున్ ఇలా ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు.
అంతర్జాతీయ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ డమ్మీ కంపెనీ అని, ఆ సంస్థకు రూ.1000 కోట్లు విలువ చేసే భూమిని, గత టీడీపీ ప్రభుత్వం కేవలం రూ.30 కోట్లకు కేటాయించిందని లోక్సభలో మిథున్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై ట్విట్టర్ వేదికగా గల్లా జయదేవ్ స్పందించారు. 1947లో ఏర్పాటు చేసిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ను డమ్మీ కంపెనీగా వ్యాఖ్యానించడం అవివేకం అని గల్లా ట్వీట్ చేశారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ ఇండియాలో కూడా గత రెండు దశాబ్దాలుగా సేవలందిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, ఆ కంపెనీ ఏపీలో పెట్టుబడులు ఉపసంహరించుకోవడంలో ఎలాంటి అనుమానం లేదని గల్లా వ్యాఖ్యానించారు.
గల్లా జయదేవ్ ట్వీట్కు మిథున్రెడ్డి ఊహించని సమాధానమిచ్చారు. ‘‘మీకు తలపై జుట్టే లేదనుకున్నా.. ఇప్పుడే తెలిసింది, మెదడు కూడా లేదని’’ అని సెటైర్లు వేశారు. ఏపీ నుంచి పెట్టుబడిదారులు వెళ్లిపోవాలంటూ ఎందుకు వెంటబడతావు? అని ప్రశ్నించారు. అవివేకి మీరేనని గల్లాపై మిథున్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసిన మిథున్రెడ్డికి గల్లా జయదేవ్ కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. తన శరీరం, తెలివితేటలపై మీరు చేసిన వ్యాఖ్యలను ప్రజలకే వదిలేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో ఎవరు గెలిచారో ప్రజలే తేలుస్తారని వ్యాఖ్యానించారు. అలాగే పెట్టుబడిదారులను ఎవరు బెదిరిస్తున్నారో చెప్పాలని ప్రశ్నిస్తూ.. కియా ప్రారంభోత్సవంలో ఆ కంపెనీ ప్రతినిధిని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ బెదిరిస్తున్నట్లు ఉన్న ఫోటోను గల్లా జయదేవ్ జోడించారు. మొత్తానికి టీడీపీఎంపీ-వైసీపీ ఎంపీ మధ్య ట్విట్టర్ వేదికగా టామ్ అండ్ జెర్రీ లాంటి ఫైట్ జరిగిందనే చెప్పాలి.