లగే రహో కేజ్రీవాల్... ఇదే ఆప్ సునామీకి కారణం...
posted on Feb 9, 2020 @ 9:32AM
ఢిల్లీ పీఠం మళ్లీ కేజ్రీవాల్దేనని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీకి ఎదురే లేదని తేల్చిచెప్పాయి. మరోసారి బంపర్ మెజారిటీతో కేజ్రీవాల్ అధికారంలోకి రావడం ఖాయమని బల్లగుద్దిమరీ చెప్పాయి. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో 60 సీట్లకు అటూఇటుగా ఆప్ గెలుచుకుంటుందని అంచనా వేశాయి. అయితే, కేజ్రీవాల్ సునామీకి కారణమేంటి? ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, మొత్తం బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు... ఇంతమంది రంగంలోకి దిగినా... హిందుత్వ ఆయుధాన్ని ప్రయోగించినా... ఎగ్జిట్ పోల్స్ అన్నీ కేజ్రీవాల్ వైపే ఉండటానికి కారణాలేంటి? అంటూ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
అయితే, తన ఐదేళ్ల పాలనలో చేపట్టిన వివిధ పథకాలనే ప్రచారంలో ప్రజల ముందు పెట్టారు కేజ్రీవాల్. పేదలకు ఆధునిక సౌకర్యాలతో వైద్య సేవలందించే మొహల్లా క్లినిక్స్ను ఏర్పాటు చేశారు. అలాగే కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు. మహిళల భద్రత కోసం సీసీటీవీలు, వీధి దీపాలు ఏర్పాటు చేశారు. అలాగే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. ఉచిత వైఫై ఇచ్చారు. అవీనీతి రహిత పాలన అందించానని చెప్పుకున్నారు. ఇలా తన పాలన గురించే చెప్పుకునే ఓట్లు అడిగారు కేజ్రీవాల్. తన ఐదేళ్ల పాలన గురించి లగే రహో కేజ్రీవాల్ అంటూ అదిరిపోయే పాటను విడుదల చేసి జనాల్లోకి వెళ్లారు. అయితే, మరోసారి ఢిల్లీని చీపురు ఊడ్చేస్తుందని ముందే గ్రహించిన కమలం, ఆఖరి వరకు సకల అస్త్రాలూ సంధించింది. చావోరేవోనన్నట్లుగా పోరాడింది. మోడీ పౌరసత్వ ఆయుధాన్ని వదిలితే... స్వచ్చమైన నీటి సరఫరా చూడండి అన్నారు కేజ్రీవాల్. అమిత్ షా షహీన్ బాగ్ టెర్రరిస్టు అంటే, నిరంతరం కారుచౌకగా ఇస్తున్న కరెంటు చూడండి అంటూ ఓటర్లకు విన్నవించారు కేజ్రీవాల్. ఆఖరికి మోడీ రామబాణం, హనుమాన్ ఆయుధం సంధించినా, కేజ్రీవాల్ మాత్రం, తన హయాంలో సకల సదుపాయాలతో నెలకొల్పిన సర్కారీ బడులను చూడండంటూ ప్రచారాన్ని హోరెత్తించారు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన బ్రహ్మాస్త్రమైన హిందూత్వకు సంబంధించిన సకల ఆయుధాలనూ సంధిస్తే, కేజ్రీవాల్ మాత్రం, కేవలం తన సుపరిపాలన గురించి మాత్రమే వివరించారు. బీజేపీ పన్నిన సెంటిమెంట్ ఉచ్చులో మాత్రం పడలేదు. అదే హస్తిన జనాలను ఆలోచింపజేసినట్టుంది. ఎగ్జిట్ పోల్స్ను బట్టి, ఆమ్ ఆద్మీని మరోసారి పీఠమెక్కిస్తున్నవి, కేజ్రీవాల్ గుడ్ గవర్నెన్స్ అని అర్థమవుతోంది.