ఐబొమ్మ రవి కస్టడీపై రివిజన్ పిటిషన్

తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా,  దేశ వ్యాప్తంగాసంచలనం సృష్టించిన పైరసీ కేసులో ప్రధాన నిందితుడైన ఐబొమ్మ రవి కస్టడీ వ్యవహారంలో సైబర్ క్రైమ్ పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఐబొమ్మ రవి విచారణకువిచారణకు కోర్టు కేటాయించిన మూడు రోజుల సమయం సరిపోదనీ, ఆయన కస్టడీని పొడిగించాలనీ ఆ రివిజన్ పిటిషన్ లో పేర్కొన్నారు.  

ఐబొమ్మ రవిపై  నమోదైన మూడు కేసులకు సంబంధించి ఒక్కో కేసుకు  ఒక్కో రోజు చొప్పున కోర్టు మూడు రోజుల కస్టడీకి  కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.  మొత్తం నాలుగు కేసుల్లోనూ సమగ్రంగా విచారించాల్సి ఉందని, ఇందుకు గాను ఐదు రోజుల కస్టడీ అవసరమని పోలీసులు తమ రివిజన్ పిటిషన్ లో కోరారు.  ‘కుబేర’, ‘కిష్కింద పురి’, ‘తండేల్’, ‘హిట్’ వంటి భారీ చిత్రాల పైరసీకి సంబంధించి కీలక సమాచారాన్ని రవి నుంచి రాబట్టాల్సి ఉందని వివరించారు.  ఇందు కోసం అదనపు కస్టడీ అవసరమని పేర్కొన్నారు.

  పైరసీ చేసిన ఫైళ్ల సోర్స్ లు, రవి అందుకున్న టెక్నికల్ సహాయం, సర్వర్లు, విదేశీ ఐపీ అడ్రెసులు, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలపై వివరాలు సేకరించాల్సి ఉందన్న సైబర్ క్రైమ్ పోలీసులు, రవి నిర్వ హించిన నెట్‌వర్క్‌లో ఎంత మంది భాగస్వా ములు ఉన్నారు? సినిమాల డిజిటల్ కాపీలు ఎక్కడి నుండి తీసుకున్నారు? ఎలాంటి ఛానళ్ల ద్వారా పంపిణీ చేశారు? అనే విషయాలపై ప్రశ్నించాల్సి ఉందని పేర్కొన్నారు.  కాగా పోలీసుల రివిజన్ పిటిషన్ పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి. 

వైసీపీ ఎంపీలకు.... నిర్మల సీతారామన్ షాక్

  వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఎంపీలకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ప్రైవేటీకరణ కాదని, పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానంలో మాత్రమే చేస్తున్నారని నిర్మల సీతారామన్ ప్రశ్నించడంతో ఎంపీలు నిస్సత్తువకు లోనయ్యారు. ​ పీపీపీ అంటే ప్రైవేట్ కాదు: నిర్మల సీతారామన్ ​వైద్య కళాశాలల అంశాన్ని ప్రస్తావించినప్పుడు, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, "మేము మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం లేదు. మీరు అంటున్నట్టుగా అవి కేవలం పీపీపీ విధానంలో మాత్రమే కదా జరుగుతున్నాయి?" అని సూటిగా అడిగారు. ​దీనికి సమాధానంగా, వైసీపీ ఎంపీలలో ఒకరైన, జగన్ బాబాయి సుబ్బారెడ్డి, "అవును, అవి పీపీపీ పద్ధతిలోనే ఉన్నాయి" అని ధృవీకరించారు. వెంటనే నిర్మల సీతారామన్, "మరి అలాంటప్పుడు మీరు ప్రజల్లోకి వాటిని 'ప్రైవేట్' అని ఎందుకు చెబుతున్నారు?" అని ప్రశ్నించారు. ​ఎంపీలు ఏదో చెప్పబోతుండగా, "పీపీపీ అంటే ప్రైవేట్ కూడా ఉంటుంది కదా మేడం..." అని అన్న సమయంలోనే నిర్మల సీతారామన్ కలుగజేసుకున్నారు. "నో, నో. మీరు నన్ను దయచేసి తప్పుదోవ పట్టించవద్దు. మీరు ప్రజలను తప్పుదోవ పట్టినట్లుగా నన్ను కూడా చేస్తే ఎలా?" అని ఆమె గట్టిగా ప్రశ్నించారు.. నిర్మల సీతారామన్ నుండి వచ్చిన ఈ అనూహ్య ప్రతిస్పందనతో, వైసీపీ ఎంపీలు మరింత మాట్లాడలేక తెల్లమొహం వేసుకుని వెనుతిరిగారు.  

రేవంత్, మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ ...సీపీ కీలక ఆదేశాలు

  ఫుట్​బాల్​ అభిమానులకు ఈ నెల 13న పండగే పండగ. ఎందుకంటే ఫుట్​బాల్​ దిగ్గజ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్​లో మ్యాచ్​ ఆడబోతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి ఉప్పల్​ స్టేడియం వేదిక కానుంది. అయితే మెస్సీ పాల్గొనే మ్యాచ్​లో భద్రతాపరమైన లోపాలకు అవకాశం లేకుండా నిర్వహించాలని తెలంగాణ డీజీపీ శివధర్​రెడ్డి ఆదేశించారు. క్రీడాకారుడు లియోనల్​ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇమేజ్​, ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి మ్యాచ్​లో పాల్గొంటున్న దృష్ట్యా బందోబస్తు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సూచించారు.  మెస్సీ ఫుట్​బాల్​ మ్యాచ్​ నేపథ్యంలో ఉప్పల్​ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను డీజీపీ గురువారం పర్యవేక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ నేపథ్యంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాసులు లేని వారు స్టేడియం వద్దకు రావద్దన్నారు. అలాగే ఆలస్యంగా వచ్చే వారిని స్టేడియంలోకి అనుమతించమని సీపీ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి , మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫుట్‌బాల్ మ్యాచ్ టికెట్లు కూడా హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి.   శుక్రవారం (ఈ నెల 12) మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచే ఈవెంట్ ఇది అని అన్నారు.శనివారం 7 గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మ్యాచ్ జరుగనుందని.. మ్యాచ్ సందర్భంగా అందరూ క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. స్టేడియం దగ్గర పాసులు అమ్మబడవని... ఇప్పటికే ఆన్‌లైన్‌లో పాసులను విక్రయించినట్లు చెప్పారు. పాసులు లేని వారు స్టేడియం వద్దకు రావద్దన్నారు. మెస్సీకి Z కేటగిరి భద్రత ఏర్పాటు చేశామని.. గ్రీన్ చానెల్ ద్వారా మెస్సీ ప్రయాణం చేస్తారని వెల్లడించారు. మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఉంటుందని.. టికెట్స్ లేని వారు ఇంట్లో ఉండి టీవీలో చూడాలని కోరారు.  మ్యాచ్‌కు వచ్చే వారు మూడు గంటల ముందే స్టేడియంకు చేరుకోవాలని... ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించమని స్పష్టం చేశారు. మ్యాచ్ కోసం వచ్చే వారు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించాలని సూచించారు. వ్యక్తిగత వాహనాలు తీసుకురావడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని తెలిపారు.వాహనాల పార్కింగ్ కోసం 34 ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి అందరి సహకారం అవసరమని సీపీ చెప్పారు.  ఎవరైనా అనుమతి లేకుండా మెస్సీని కలవాలి అని ప్రయత్నం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 3000 మంది పోలీసులు మ్యాచ్ కోసం భద్రత విధుల్లో ఉంటారన్నారు. డ్రోన్లు ద్వారా మ్యాచ్‌ను, భద్రతను పర్యవేక్షిస్తామన్నారు. 450 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. మఫ్టీలో కూడా అధికారులు ఉంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకుల కదలికలపై నిఘా పెడతారని వెల్లడించారు. నిషేధిత వస్తువులు స్టేడియం లోపలికి తీసుకు రావద్దన్నారు. మ్యాచ్ చూడటం కోసం వచ్చే మహిళా ప్రేక్షకుల కోసం షీ టీమ్స్ కూడా అందుబాటులో ఉంటాయని రాచకొండ సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.

ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు కేంద్రం నిర్ణయం

  కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు ఆమోదం తెలిపింది. ఇకపై పూజ్య బాపు గ్రామీణ్‌ రోజ్‌గార్ యోజనగా పేరు మారుస్తూ  కేంద్రం నిర్ణయం తీసుకుంది.  అలాగే పనిదినాల సంఖ్యను 100 నుంచి 125కి పెంచింది. ఒక రోజుకు ఇచ్చే కనీస వేతనాన్ని రూ.240కి సవరించింది. యూపీఎ సర్కార్ ఎన్‌ఆర్‌ఈజీఏ’ పథకాన్ని 2006లో ప్రారంభించింది. జనాభా లెక్కలు-2027కు ఎన్డీయే సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా పూర్తి డిజిటల్ పద్ధతిలో చేపట్టనున్న ఈ బృహత్ కార్యక్రమానికి రూ.11,718.24 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తూ ఆమోదముద్ర వేశారు. ‘కోల్  సేతు విండో’కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బొగ్గు గనుల రంగంలో సంస్కరణల కోసం నూతన పాలసీకి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. కొబ్బరి కి మద్దతు ధర ప్రకటించిన కేంద్ర కేబినెట్.. 2026 సీజన్‌లో క్వింటాల్ మిల్లింగ్ కొబ్బరి కి క్వింటాల్‌కు రూ. 445 రూపాయలు. బాల్  కొబ్బరి క్వింటాలుకు  400 రూపాయలు మద్దతు ధర పెంచింది. మిల్లింగ్ కొబ్బరి  క్వింటాలు ధర: 12,027 రూపాయలు, బాల్ కొబ్బరి ధర 12,500 ప్రకటించింది.   

సీఎం రేవంత్‌ను కలిసిన ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్

  భారత ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు, ఆర్థికవేత్త ప్రొ. అరవింద్ సుబ్రమణియన్ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 లో పాల్గొన్న  అరవింద్ సుబ్రమణియన్ తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను ఆవిష్కరించి, అనుసరించడం ద్వారా రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధిస్తుందని చెప్పారు. ఈ సందర్బంగా ఆయనను ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించారు.ఈ భేటీలో సీఎంతో పాటు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తదితర అధికారులు ఉన్నారు. 

రాష్ట్రపతి తెలంగాణ పర్యటన... మినిస్టర్ ఇన్ వైటింగ్‌గా మంత్రి సీతక్క

  శీతాకాల విడిది కోసం  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో డిసెంబర్ 17 నుండి 22 వరకు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో   రాష్ట్రపతి పర్యటకు మంత్రి సీతక్క ‘మినిస్టర్-ఇన్-వైటింగ్’గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.. శీతాకాల విడిదిలో భాగంగా సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పటిష్టమైన భద్రత, ట్రాఫిక్, బందోబస్తు ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖను ఆదేశించారు. అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ టెండర్లు, ప్రత్యేక వైద్య బృందాలను నిరంతరం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.  

భార్యను కాపురానికి పంపడం లేదని మామను చంపిన అల్లుడు

  భర్త వేధింపులు భరించలేక  భార్య కోపంతో పుట్టింటికి వెళ్ళిపోయింది... దీంతో ఆ భర్త ప్రతిరోజు అత్తగారింటికి వెళ్లి గొడవ పడుతూ చివరకు మామను హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని ఆమీన్పూర్ బీరంగూడలో నివాసముంటున్న చంద్రయ్య (58) అనే వ్యక్తి తన కూతురు లక్ష్మిని గత కొన్ని సంవత్సరాల క్రితం రామకృష్ణ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. వీరికి ముగ్గురు కూతుర్లు ,ఒక కొడుకు మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు... రామకృష్ణ మద్యానికి బానిస అయ్యాడు... ప్రతిరోజు పీకలదాకా మద్యం సేవించడం ఆ మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడడం చేస్తూ ఉండేవాడు. రామకృష్ణ తన కన్న కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న వెంటనే భార్య లక్ష్మి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి భర్త రామకృష్ణ అత్తవారింటికి వచ్చి తరచుగా గొడవ పడుతూ ఉండేవాడు.  అల్లుడు రామకృష్ణ, భార్యను తిరిగి తమ కాపురానికి పంపడం లేదని అత్తమామలతో తరుచుగా గొడవ చేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపధ్యంలో గురువారం రాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న రామకృష్ణ మామ చంద్రయ్యతో గొడవపడ్డాడు.. ఇద్దరి మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది.  కోపంతో రగిలిపోయిన అల్లుడు రామకృష్ణ కత్తితో ఒక్కసారిగా మామ చంద్రయ్యపై దాడి చేసి  కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలతో చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దాడి సమయంలో కుటుంబ సభ్యులు అడ్డుకు నేందుకు ప్రయత్నించగా, వారిని కూడా చంపేస్తానని రామకృష్ణ బెదిరించాడు.  మామను హత్య చేసిన అనంతరం అల్లుడు రామకృష్ణ అక్కడి నుండి పారిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే ఆమీన్పూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి... పరారీలో ఉన్న నిందితుడు రామకృష్ణ కోసం గాలింపు చర్యలు చేపడుతూ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు...  

బిల్లులందు పురుష బిల్లులు వేర‌యా!

  జాతీయ మ‌హిళా క‌మిష‌న్ గురించి మ‌నం వినే  ఉంటాం. అలాంటిదిపుడు జాతీయ పురుష క‌మిష‌న్ ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారు. డిసెంబ‌ర్ 6న రాజ్య‌స‌భ‌లో ఒక బిల్లు ప్ర‌వేశ పెట్టారు. ఈ బిల్లు ఉద్దేశం ఏంటంటే పురుషుల హ‌క్కుల సంర‌క్ష‌ణ‌, వారి సంక్షేమం వంటి విష‌యాల్లో ఈ బిల్లు  వారికి ఎంత‌గానో ఉప యోగ‌ప‌డుతుంది.  ఇంత‌కీ పురుషుల హ‌క్కులు అంటూ ఏవీ ఇప్ప‌టి వ‌ర‌కూ లేవు. మాన‌వ హ‌క్కులే పురుషుల హ‌క్కుల కింద‌కు వ‌స్తాయి. బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే కేటాయించేలాంటి  సీట్లు పురుషుల‌కంటూ ఉండ‌వు. ఇ ఇక రిజ‌ర్వేష‌న్ల‌లో ఓసీకంటూ ప్ర‌త్యేకించీ రిజ‌ర్వేష‌న్లుండ‌వు. ఎక‌నామిక‌ల్లీ బ్యాక్ వ‌ర్డ్ క్లాస్ ఎలాగో ఇది కూడా అలాంటిదేన‌ని చెప్పాల్సి వ‌స్తుంది.  అయితే,  ప్ర‌పంచ వ్యాప్తంగా  ప్ర‌స్తుతం మూడు ర‌కాల‌ జండ‌ర్లు త‌యారై కూర్చున్నాయి. ఒక‌ప్పుడు ఆడ మ‌గ మాత్ర‌మే ఉండేవారు. ఇప్పుడు థ‌ర్డ్ జండ‌ర్ ఒక‌టి త‌యారైంది. ఇక పురుషుడు అంటే ఎవ‌రు? అత‌డ్ని ఎలాంటి గుణ‌గ‌ణాల కొద్దీ డిసైడ్ చేస్తారు? అన్న‌ది కూడా చ‌ర్చ‌నీయంశ‌మే. ఈ విష‌యాల‌పై ఈ బిల్లు ద్వారా ఒక క్లారిటీ రావ‌ల్సి ఉంది. పురుషత్వం అంటే ఏమిటి? అన్న‌ది  కూడా ఒక‌ డిబేట‌బుల్ పాయింటే. ఇటీవ‌లి కాలంలో పుంస‌త్వ స్థాయిలు విప‌రీతంగా ప‌డిపోతూ వ‌స్తున్నాయ‌ని చెబుతున్నాయి కొన్ని గ‌ణాంకాలు.  దానికి తోడు రాన్రాను ఫిమేల్ డామినేష‌న్ పెరిగి మేల్ ఢ‌మాల్ అంటున్న ప‌రిస్థితి కూడా ఉంది. స‌హ‌జీవ‌నాలు పెరుగుతున్న ఈ కాలంలో, ఎల్జీబీటీ కి హై ప్ర‌యారిటీ ఇస్తోన్న ఈ సంద‌ర్భంలో.. పురుషుల హ‌క్కులు ప్ర‌శ్నార్ధ‌క‌మే. ప్ర‌స్తుత యువ‌త‌రం మాట అటుంచితే.. వీరి తండ్రుల త‌రంలో చాలా మంది భార్యా బాధితులున్నారు. వీరిపైన రివ‌ర్స్ లో గృహ‌హింస వంటి త‌ప్పుడు కేసులు పెడుతుంటారు. ఇలాంటి వాటిలో పురుష  క‌మిష‌న‌న్ ర‌క్ష‌ణ క‌ల్పిస్తుందేమో చూడాలి. ఆపై గ‌త ఐదేళ్ల కాలంలో ఐదు రాష్ట్రాల్లో 785 మంది భ‌ర్త‌లు త‌మ త‌మ భార్య‌ల చేతిలో హ‌త‌మ‌య్యారు. అది కూడా వారి  వారి ప్రియుల సాయంతో ఆయా భార్యామ‌ణులు త‌మ  త‌మ భ‌ర్త‌ల‌ను చంపేసిన ఘ‌ట‌న‌లు ఇటీవ‌లి కాలంలో బాగా వైర‌ల్ అయ్యాయి. ఈ క్ర‌మంలో పురుష  క‌మిష‌న్ ఏదైనా పురుషుల‌కు  ర‌క్ష‌ణ క‌ల్పించ‌ గ‌ల‌దా? అన్న‌ది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా పురుషాధిక్య ప్ర‌పంచంగా పిలిచే ఈ స‌మాజంలో పురుషుల హ‌క్కుల‌కే ర‌క్ష‌ణ  లేకుండా పోవ‌డం కూడా తీవ్ర విషాద‌క‌రం. చ‌ర్చ‌నీయాంశం కూడా.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్

  ఫోన్ ట్యాపింట్ ప్ర‌ధాన నిందితుడు ప్ర‌భాక‌ర్ రావు ఇప్ప‌టి  వ‌ర‌కూ సుప్రీం ద్వారా  పొందుతోన్న తాత్కాలిక ర‌క్ష‌ణ  నుంచి బ‌య‌ట‌కొచ్చి ఏసీబీ వెంక‌టగిరి ముందు లొంగిపోమ‌ని ఆదేశించింది సుప్రీం  కోర్టు. దీంతో ప్ర‌భాక‌ర్ రావుకు ఇదొక షాకింగా మారింది. అలాగ‌ని ప్ర‌భాక‌ర్ రావును ఫిజిక‌ల్ గా టార్చ‌ర్ చేయొద్ద‌నీ.. థ‌ర్డ్ డిగ్రీ అస‌లే ప్ర‌యోగించ‌వ‌ద్ద‌ని  పేర్కొంది  సుప్రీం కోర్టు. ఇంత‌కీ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఏమిటి?  దీని  పూర్వాప‌రాలు ఎలాంటివి? అన్న‌దొక చ‌ర్చ‌గా మారింది. ఆ విష‌యాలేంటో చూస్తే.. మార్చి 2024లో పంజాగుట్ట స్టేషన్‌లో ఫోన్‌ట్యాపింగ్ కేసు నమోదు న‌మోద‌య్యింది. కేసు నమోదు నాటికి అమెరికాలో ఉన్నారు ప్రధాన నిందితుడైన‌ ప్రభాకర్‌రావును దేశానికి రప్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు పోలీసులు. విచారణకు రావాలంటూ ఆయనకు నోటీసులు  కూడా పంపించారు పోలీసులు. ఆరోగ్యం బాగోలేదని, ట్రీట్‌మెంట్ పూర్తయ్యాక వస్తానంటూ సమాచారమిచ్చిన ప్రభాకర్‌రావు.. పోలీసులు ఇచ్చిన గడువు ముగిసినా హైదరాబాద్‌కు రాలేదు. దీంతో ప్రభాకర్‌రావు పాస్‌పోర్ట్‌ను రద్దు చేయించారు పోలీసులు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభాకర్‌రావు 2025, మే 29న మూడు రోజుల్లో భారత్‌కు వచ్చి విచారణకు సహరించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.  తాత్కాలిక పాస్‌పోర్ట్‌పై హైదరాబాద్‌కు వచ్చారు ప్రభాకర్‌రావు. 2025 జూన్ 9, న జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు ప్రభాకర్‌రావు. జూన్‌లో మొత్తం 6 సార్లు విచారణకు హాజర‌య్యారు ప్రభాకర్‌రావు. జూన్ 11, 15, 17, 19, 20 తేదీల్లో ప్రభాకర్‌రావు విచారణ జ‌రిగింది. విచారణలో పోలీసులకు ఏమాత్రం సహకరించ లేదాయ‌న. పోలీసులకే రివర్స్‌లో వార్నింగ్ ఇచ్చారు ట్యాపింగ్ కేసులోని ప్ర‌ధాన నిందితుడు ప్రభాకర్‌రావు. అన్ని రోజులు మీవే ఉండవనీ, మావి కూడా వస్తాయంటూ ప్రభాకర్‌రావు వార్నింగ్ పాస్  చేశారు.  ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఇంతవరకూ జరిగిందేంటి? అని చూస్తే.. ఇంతవరకూ 270 మంది స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఆరుగురు ప్రధాన నిందితులుగా గుర్తించారు. A1గా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టి. ప్రభాకర్‌రావు కాగా, A2గా ఇంటెలిజెన్స్ మాజీ DSP డి.ప్రణీత్‌రావు, A3గా ఇంటెలిజెన్స్ మాజీ ASP N.భుజంగరావు, A4గా ఇంటెలిజెన్స్ మాజీ ASP M.తిరుపతన్న A5గా టాస్క్‌ఫోర్స్ మాజీ DCP T.రాధాకిషన్‌రావుగా ఉన్నారు. ఇక A6గా ఐన్యూస్ ఛానల్ ఎండీ A.శ్రవణ్‌రావు, కేసులో అరెస్ట్‌ అయిన వారందరికీ బెయిల్ రాగా.. ప్రభాకర్‌రావుపై 68 పేజీల ఛార్జ్‌షీట్ వేసింది సిట్.   ఫోన్ ట్యాపింగ్‌లో వాంగ్మూలం ఇచ్చినవాళ్లు ఎవ‌ర‌ని చూస్తే.. కేంద్రమంత్రి బండి సంజయ్‌, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో పాటు.. టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్, TRMES చైర్మన్ ఫయీమొద్దీన్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డీ గద్వాల్ జెడ్పీ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య, ఎమ్మెల్సీ కవిత పీఏ, డ్రైవర్‌, పనిమనిషి చక్రధర్‌గౌడ్ వంటి వారున్నారు.  విచారణకు హాజరైన వాళ్లు ఎవ‌రో చూస్తే.. మాజీ సీఎస్ శాంతికుమారి, ఐఏఎస్ అధికారి రఘునందన్‌రావు మాజీ సీఎం కేసీఆర్ OSD రాజశేఖర్‌రెడ్డి, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఉన్నారు. ప్రభాకర్‌రావును ఎలాంటి ప్రశ్నలు అడ‌గ‌నున్నారో చూస్తే.. - ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది? ఏ రాజకీయ నేతలు చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశారు?, రెండు ఐఫోన్లను అమెరికాలోనే ఎందుకు దాచిపెట్టి వచ్చారు?   హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేయమని చెప్పిందెవరు?, ఎందుకు చెప్పారు?, SIB నుంచి మాయం అయిన హార్డ్‌డిస్క్‌లు ఎక్కడికి వెళ్లాయి?, రూల్ 419/419A ప్రకారం సంఘవిద్రోహ శక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సి ఉండగా.. రాజకీయ నేతల ఫోన్లను ఎందుకు ట్యాపింగ్ చేశారు?  ఫోన్ ట్యాపింగ్‌పై రివ్యూ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రశ్నలు వేసే అవకాశం క‌నిపిస్తోంది. ఫైన‌ల్ గా రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్స్‌కు హోం సెక్రటరీ, GAD ప్రిన్స్‌పల్ సెక్రటరీ, DGP అనుమతి ఇచ్చారా? అని ప్ర‌భాక‌ర్ రావును విచార‌ణాధికారులు అడిగేలా తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే అస‌లు ప్ర‌భాక‌ర్ రావుకు ఈ క‌ష్టం ఎలా వ‌చ్చిందో చూస్తే ఆయ‌న విచార‌ణ‌కు అస్స‌లు స‌హ‌క‌రించ‌డం లేద‌ని తెలుస్తోంది. దానికి  తోడు ఆయ‌న ఐ క్లౌడ్ పాస్ వ‌ర్డ్ చెప్ప‌కుండా డేటా మొత్తం డిలీట్ చేసిన‌ట్టుగానూ తెలుస్తోంది. దీంతో సుప్రీం కోర్టు మీరు విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డం లేదు కాబ‌ట్టి  అరెస్టు ముప్పు కొని తెచ్చుకున్నార‌ని వ్యాఖ్యానించింది.

లేడీ డాన్ నిడిగుంట అరుణపై పీడీ యాక్ట్

  నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన లేడీ డాన్ అరుణపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఆమె నేర చరిత్ర దృష్ట్యా ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్‌ను ప్రయోగించారు. అరుణతో పాటు మరో ఇద్దరు రౌడీషీటర్లపై కూడా ఇదే చట్టం కింద కేసులు నమోదు చేసి, ముగ్గురినీ నెల్లూరు నుంచి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. కోవూరు మండలం పెద్ద పడుగుపాడు గ్రామానికి చెందిన అరుణ  అనేక నేరాలకు పాల్పడినట్లు పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఆమెపై కోవూరు, నవాబుపేట, వేదాయపాలెం పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదై ఉన్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విజయవాడలో మోసాలకు పాల్పడిన కేసు కూడా ఆమెపై ఉంది. రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో పలు కథనాలు ప్రచురితం కావడంతో అరుణ నేర సామ్రాజ్యం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.  దీంతో కోవూరు పోలీసులు ఆమెపై రౌడీషీట్ కూడా తెరిచారు.అరుణ నేర కార్యకలాపాలను అరికట్టేందుకు, ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల.. కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ప్రతిపాదనలు పంపారు. కలెక్టర్ నుంచి ఆమోదం లభించడంతో కోవూరు పోలీసులు అరుణపై పీడీ యాక్ట్ నమోదు చేశారు.  ప్రస్తుతం నెల్లూరు జైలులో ఉన్న ఆమెను కడప సెంట్రల్ జైలుకు తరలించారు..అరుణతో పాటు నెల్లూరు నగరానికి చెందిన మరో ఇద్దరు రౌడీషీటర్లు ఎస్. జయప్రకాశ్‌, షేక్‌ షాహుల్‌ హమీద్‌లపైనా పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. వారిని కూడా నెల్లూరు నుంచి కడప కేంద్ర కారాగారానికి తరలించారు.  

స‌రికొత్త సనాత‌న సార‌ధి.... సాయిరెడ్డి!?

  విజ‌య‌సాయి రెడ్డి హిందుత్వ వైపు అడుగులు వేస్తున్నారా? ఎందుకీ మాట అనాల్సి వ‌స్తోంది? జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ లా  సాయిరెడ్డి స‌నాత‌న‌త్వం అని ఒక‌టి వెలుగు చూస్తోందా? ఇలా ఎందుకు చెప్పాల్సి వ‌స్తోంద‌ని చూస్తే ముచ్చ‌ట‌గా మూడు కామెంట్ల‌లో ఆయ‌న  ప్ర‌య‌త్నం, ప్ర‌యాణం, ప‌ద ప్ర‌యోగం ఏంటో చూడొచ్చు.. అందులో భాగంగా స్టెప్ వ‌న్.. ఢిల్లీ వేదిక‌గా ఆయ‌న వైసీపీ  నుంచి అన్ని ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన స‌మ‌యంలో వెంక‌టేశ్వ‌ర‌స్వామి  పేరు ప‌దే ప‌దే చెప్పారు.  తాను రాజ‌కీయ స‌న్యాసం  త‌ర్వాత వ్య‌వ‌సాయం  చేస్తాన‌ని  చెప్పుకొచ్చారు. వీలుంటే  మీడియా సంస్థ పెడ‌తానేమోగానీ రాజ‌కీయాల్లోకి రాను. రాలేను. రాబోను.. అంటూ కుండ  బ‌ద్ధ‌లు కొట్టారు. క‌ట్ చేస్తే మ‌రో కీల‌క‌మైన కామెంట్ ఏం చేశారో చూస్తే.. సిక్కోలు గ‌డ్డ మీద నుంచి తాను ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ పార్టీ వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేద‌ని.. బీజేపీలో చేర‌బోతున్న మాట అవాస్త‌వ‌మ‌నీ.. అన్నారు విజ‌య‌సాయిరెడ్డి. అదే స‌మ‌యంలో ఆయ‌న అవ‌స‌ర‌మైతే పార్టీ పెట్ట‌డానికి కూడా వెన‌కాడ‌న‌ని అన్నారు.  ఈ టైంలో ఆయ‌న చివ‌రాఖ‌రిగా అన్న మాట‌లేంట‌ని చూస్తే.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో త‌న‌కు రెండు ద‌శ‌కాల‌కు పైగా  సాన్నిహిత్య‌ముంద‌ని ఒక చిన్న‌హింట్ ఇచ్చారు. సేనాని ప్ర‌స్తుతం ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నారో మ‌నంద‌రికీ తెలిసిందే. ఎక్క‌డో త‌మిళ‌నాడులోని మ‌ధురైలో జ‌రిగిన‌ మురుగ‌న్ మానాడుకు హాజ‌ర‌య్యారు.  నిన్న మొన్న  త‌మిళ కార్తీక దీపోత్స‌వం వ్య‌వ‌హారంలో తీర్పునిచ్చిన స్వామినాథ‌న్ అనే ఒకానొక జ‌డ్జిపై ఇండి కూట‌మి ఎంపీలు అవిశ్వాసం పెట్టే  య‌త్నం జ‌రిగింది. ఇలాంటి విష‌యాల్లో హిందుత్వ వాదుల వైపు పోరాడ్డానికి స‌నాత‌న బోర్డు ఒక‌టి అత్యావ‌శ్య‌కంగా సెల‌విచ్చారు సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్.  రీసెంట్ గా విజ‌య‌సాయి రెడ్డి  హిందుత్వ ప్రోగా అన్న మాట‌ల విష‌యానికి వ‌స్తే.. హిందూ దేవాలయాలపై ఒక‌ ట్వీట్ చేశారు. దీని సారాంశ‌మేంటో చూస్తే.. హైంద‌వ‌ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు.. దేవాలయాలపై ప్రభుత్వ  నియంత్రణ- ఆర్టికల్ 14కు విరుద్ధమని అన్నారు.  ఇతర మతాలకు చెందిన ప్రార్ధ‌నాలయాలు స్వయం ప్రతిపత్తితో నడుస్తున్నాయనీ.. అన్ని మతాలకు సమానత్వం కల్పించాలనీ కోరారు స‌రికొత్త స‌నాత‌న సార‌ధి సాయిరెడ్డి. రాజ్యంగ బద్ధంగా మతాల మధ్య సమానత్వం ఉండాలనీ.. ప్రస్తుత విధానాలను కేంద్రం పున:పరిశీలించాలనీ డిమాండ్ చేశారు విజయసాయిరెడ్డి. హోంమంత్రి అమిత్ షా ఈ విష‌యంలో జోక్యం చేసుకోవాలని కూడా కోరారాయన. వీట‌న్నిటిని బ‌ట్టీ.. సాయిరెడ్డి పోక‌డ చూస్తుంటే హిందుత్వ‌కే బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిన బీజేపీలో చేర‌డ‌మా?  లేక స‌నాత‌నాన్ని భుజానికెత్తుకుని తిరుగుతోన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ పంచ‌న చేర‌డ‌మా రెండిట్లో ఏదో ఒక‌టి జ‌రగ‌డం ఖాయంగా తెలుస్తోందంటున్నారు కొంద‌రు విశ్లేష‌కులు. ఎనీహౌ అడ్వాన్స్డ్ కంగ్రాట్స్ ఫ‌ర్ యువ‌ర్ లేటెస్ట్ స‌నాత‌న సార‌ధ్యం అని మ‌నం కూడా ఓ శుభాకాంక్ష‌లు చెప్పి ఉంచుదాం. ఎప్ప‌టికైనా ప‌నికొస్తుందేమో చూద్దాం.