కూలీగా మారిన సీపీఐ నారాయణ
posted on May 7, 2021 @ 1:30PM
సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఉపాధి హామీ కూలీగా మారారు. మండుటెండల్లో ఆయన కూలీ పనులు చేశారు. ఏదో ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లుగా కాకుండా రెండు రోజుల పాటు కూలీలతో సమానంగా ఆయన పని చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. సీపీఐ జాతీయ నేత తమతో కలిసి పని చేయడంతో కూలీలు సైతం షాక్ అయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా నియోజకవర్గం నగరిలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. నగరి మండల పరిధిలోని అయానంబాకం గ్రామ చెరువులో రెండు రోజులు నారాయణ కూలీ పని చేశారు.
ఉపాధి హామీ పథకంలో పని చేయాలంటే జాబ్ కార్డు ఉండాలి. అందుకే తాను అఫీషియల్ గా పని చేయలేదని.. ఎందుకంటే అఫీషియల్ గా పని చేయాలంటే జాబ్ కార్డు పొంది ఉండాలనే నిబంధన ఉండడం వల్ల తాను అఫీషియల్ గా కాకుండా స్వచ్చందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాను అన్నారు. కూలీలతో కలిసి పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. ఉపాధి హామీ పథకం చాలా గొప్ప కార్యక్రమమని.. అయితే ప్రణాళికతో కాకుండా ఇష్టానుసారంగా పనిచేయడం వల్ల పెడదారి పోయే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.
కరోనా నిబంధనలకు అనుగుణంగా మాస్కు పెట్టుకుని మరి నారాయణ కూలీ పనులు చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది లెఫ్ట్ పార్టీలు పార్లమెంట్లో గట్టిగా ఉద్యమించి సాధించుకున్న పథకమని, అప్పట్లో జాతీయ పార్టీలన్నీ కూడా ఈ పథకాన్ని తీసుకు రాకూడదు అని తీర్మానించాయి అని గుర్తుచేశారు. ఉపాధి హామీ వల్ల ప్రతి ఏటా 50 వేల కోట్ల రూపాయల నష్టం ఏర్పడుతుందని అన్నిపార్టీలు వ్యతిరేకించాయని.. అయినా వామపక్ష పార్టీలు తప్పకుండా ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతోపాటు ఆకలి చావులను, నిరుద్యోగతను పారదొలేందుకు అవకాశం ఏర్పడిందన్నారు.
గ్రామీణ ఉపాధి ద్వారా కోట్లాది మంది గ్రామీణ నిరుద్యోగులు, మహిళలు లబ్ధి పొందారన్నారు. ముఖ్యంగా బాలింతలు ఈ పథకంలో వచ్చి పని చేసేటప్పుడు చిన్నపిల్లల కోసం ప్రత్యేక కిట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్ లు, ఎండాకాలంలో మజ్జిగ సరఫరా చేసేవారని, కానీ ఇప్పుడు ఆ నిబంధనలు అన్నీ కాలరాసి కేవలం పనులు మాత్రం చేయించుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు.
చెరువులలో గుంత తీస్తూ ఆ గుంతలో తీసిన మట్టిని కట్ట మీద కాకుండా పక్కనే పడేయడం వల్ల వర్షాలు పడినప్పుడు మళ్లీ ఆ మట్టి అంతా కూడా కొట్టుకు వచ్చి గుంతలు పూడి పోతున్నాయని, ఒక ప్రణాళిక లేకుండా ఇలా చేయడం ద్వారా శ్రమ, కాలం రెండు కూడా వృధా అవుతున్నాయని అభిప్రాయపడ్డారు.
అలా పూడిక తీసిన తరువాత ఆ మట్టిని ఒడ్డున కాకుండా కట్టమీద తీసుకుపోయి పోయడం వల్ల చెరువు కట్ట మరింత పటిష్టంగా మారుతుందని సలహా ఇచ్చారు. ఈ పథకంలో పనిచేసే వారికి కూలీలు అందిన వెంటనే సోషల్ ఆడిట్ ను నిర్వహిస్తే బాగుంటుందని, అలా కాకుండా రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చి చేయడం వల్ల పని జరగనట్లు ఫీల్డ్ అసిస్టెంట్లతో రికవరీ చేయడం సరికాదన్నారు.