సెలక్ట్ కమిటీలను నియమించిన మండలి చైర్మన్.. వైసీపీ దూరం!!
posted on Feb 6, 2020 @ 4:13PM
సెలెక్ట్ కమిటీల విషయంలో ఏపీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ పంతం నెగ్గించుకున్నారు. వైసీపీ ప్రభుత్వం ఎంత చెప్పినా వినిపించుకోని ఆయన.. గురువారం సెలెక్ట్ కమిటీలను అధికారికంగా ప్రకటించారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల్ని అధ్యయనం చేసేందుకు వేర్వేరుగా రెండు సెలెక్ట్ కమిటీల్ని నియమిస్తూ ఆదేశాలిచ్చారు. సీఆర్డీఏ రద్దు బిల్లు సెలక్ట్ కమిటీ చైర్మన్గా బొత్స సత్యనారాయణ నియమితులయ్యారు. సభ్యులుగా టీడీపీ నుంచి ఎమ్మెల్సీలు దీపక్రెడ్డి, అర్జునుడు, రవిచంద్ర, శ్రీనివాసులు ఉండగా, వైసీపీ నుంచి మహ్మద్ ఇక్బాల్, పీడీఎఫ్ నుంచి వెంకటేశ్వరరావు, బీజేపీ నుంచి సోము వీర్రాజు నియమితులయ్యారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీ చైర్మన్గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. సభ్యులుగా టీడీపీ నుంచి నారా లోకేష్, అశోక్బాబు, తిప్పేస్వామి, సంధ్యారాణి.. పీడీఎఫ్ నుంచి లక్ష్మణరావు, బీజేపీ నుంచి మాధవ్, వేణుగోపాల్రెడ్డి నియమితులయ్యారు.
ఇదిలా ఉంటే సెలక్ట్ కమిటీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమంటూ మండలి చైర్మన్ షరీఫ్ కు వైసీపీ లేఖ రాసింది. కమిటీల్లో తాము భాగస్వాములు కాబోమని లేఖలో పేర్కొంది. సెలెక్ట్ కమిటీల ఏర్పాటే రాజ్యాంగ విరుద్ధమని, మండలి రద్దు బిల్లు సైతం పార్లమెంటులో పెండింగ్ లో ఉందని, ఇలాంటి సమయంలో పేర్ల ప్రకటన అవసరం లేదంటూ.. మండలి చైర్మన్కు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పిల్లి సుభాష్, ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు లేఖ రాశారు. అయితే, కమిటీల ఏర్పాటుపై తన విచక్షణాధికారాల్ని ఎవరూ ప్రశ్నించలేరని మండలి చైర్మన్ షరీఫ్ అన్నట్లు తెలుస్తోంది. సెలక్ట్ కమిటీ ఏర్పాటు గడువు బుధవారం ముగిసింది. ఇప్పటికే ఆయా పార్టీలు సభ్యుల పేర్లను సూచిస్తూ.. లేఖలు ఇవ్వడంతో చైర్మన్ కమిటీలు ఏర్పాటు చేశారు.
మరోవైపు, సెలెక్ట్ కమిటీల ఏర్పాటు నిబంధనల ప్రకారం జరగలేదు కాబట్టి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించబోనని మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం వద్దంటున్నా మండలి చైర్మన్ పట్టుదలతో సెలెక్ట్ కమిటీలను ప్రకటించడంతో ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది.