'కియా'తో మేం సంప్రదింపులు జరపలేదు: తమిళనాడు!!
posted on Feb 6, 2020 @ 5:48PM
కియా మోటార్స్ ఏపీ నుండి తమిళనాడుకు తరలిపోతుందని 'రాయిటర్స్' సంస్థ ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. దీంతో జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త కంపెనీలు రాకపోగా, ఉన్న కంపెనీలు తరలిపోతున్నాయి అంటూ.. విపక్షాలు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ వార్తలను ఖండించింది. కియా మోటార్స్- ప్రభుత్వం కలిసే పని చేస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ స్పష్టం చేశారు. విపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని అధికార పార్టీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, కియా మోటార్స్ తమిళనాడుకు తరలిపోతుందన్న ప్రచారంపై తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించింది. తాము కియా యాజమాన్యంతో టచ్లో లేమని, వారితో ఎటువంటి సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వంతో తాము సత్సంబంధాలు కోరుకుంటున్నామని పేర్కొంది. ఈ మేరకు తమిళనాడు పరిశ్రమల ప్రధాన కార్యదర్శి.. ఏపీ పరిశ్రమల కార్యదర్శికి ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం.